నీతి కథలు - 7






























నీతి కథలు







పద్మపాద బయన్న కథ




జగద్గురువులైన ఆది శంకరాచార్యులవారికి సనందుడనే శిష్యుడుండేవాడు. ఆ సనందుడు మిక్కిలి గురుభక్తి విద్యలపై ఆసక్తి కలవాడు. తన ఎకాగ్రత వినయవిధేయతల వలన కొద్దికాలం లోనే విద్యలునేర్చి శంకరభగవత్పాదులకు ప్రియ శిష్యుడైనాడు పద్మపాదుడు. ఏ కారణముగా సనందుడు గురువుగారికింత ప్రియుడైనాడోఅని చర్చించుకుంటున్న తన శిష్యులను విన్నారు శంకరులు. వారికి సనందుని అపారమైన గురుభక్తిని చూపాలని నిశ్చయించుకున్నారు.
ఒకసారి ఆది శంకరులు తమ శిష్యసమేతముగా గంగాతీరమునకు వెళ్ళినప్పుడు ఆవలి గట్టునున్న సనందుని చూచి నాయనా! సనందా శీఘ్రముగా ఇటు రా!అని పిలిచినారు. గురు ఆజ్ఞయే తప్ప ఇతరము గూర్చి ఆలోచించని సనందుడు వెంటనే కళ్ళుమూసుకుని అనన్యమైన గురుభక్తితో ఇవతలి గట్టుకి నీటి మీద నడచి వచ్చాడు! అప్పుడు సనందుడు నీటిలో మునిగిపోకుండా అతని పాదాల క్రింద పద్మాలను మొలిపించింది గంగాభవానీ. ఆ ఆశ్చర్యకరమైన సంఘటన చూసి ముగ్ధులైన శిష్యులు సనందుని గురుభక్తి తెలుసుకున్నారు. అప్పటి నుంచి సనందుడు పద్మపాదుడనే పేరుతో ప్రసిద్ధుడైనాడు.
చోళదేశంలో పుట్టిన పద్మపాదుడు బాల్యము నుంచి అఖండ నృసింహభక్తుడు. స్వామి సాక్షాత్కారము కోసం పవిత్రమైన అహోబిల అడవులలో ఎన్నో ఏండ్లు తీవ్ర తపస్సును చేసినాడు. కాని నరహరి కరుణించలేదు. శిష్యుని భక్తి పరిపక్వమైనదని గ్రహించిన ఆది శంకరులు ఒకనాడు పద్మపాదుని పిలిచి దగ్గరలో ఉన్న చెంచుగుడెం లోని కొండగుహలో నృసింహస్వామికై తపస్సు చేయమని ఆజ్ఞాపించాడు. గురు ఆజ్ఞపై పద్మపాదుడు కొండగుహ చేరి ఘోర తపస్సు ప్రారంభించాడు.
తాపసి వచ్చాడని తెలియగానే పరుగు పరుగున సాధుసేవ చేదామని వచ్చాడు చెంచుగుడెం దొర బయన్న. సామీ! నేను బయన్నను. ఈ నేల ఏలికను. దేని కోసం నీవు ఇక్కడికి వచ్చావు దొరా”? అని అడిగాడు. సింహం ముఖముతో మనిషి శరీరంతో ఉండే దేవుని వెదుకుతున్నాఅన్నాడు పద్మపాదుడు. అడవినంతా ఎఱిగిన ఆ బయన్న తానెన్నడూ అట్టి వింత జంతువును చూడలేదన్నాడు. బయన్న మూఢభక్తుడు. ఉంది అని రూఢిగా చెప్పిన పద్మపాదుని మాటలువిని సామీ! ఆ ముగము నిజంగా ఉంటే కట్టేసి తెస్తా లేకుంటే పానాలు వదిలేస్తాఅని ఆ నరసింహమును వెదుక బయలుదేరాడు బయన్న!
పద్మపాదుడు వర్ణించిన నృసింహస్వామి అద్భుత రూపాన్ని మనస్సులో ముద్రించుకున్నాడు బయన్న. ఏకాగ్రచిత్తంతో నిద్రాహారాలు మాని అడవంతా తిరిగాడు బయన్న. ఎంత శ్రమించినా అణువణువూ పరీక్షగా చూచినా ఎక్కడా కనబడలేదు స్వామి. నీవు కనిపించని ప్రాణమెందులకు?” అని బయన్న ప్రాణాత్యాగం చేయబోయాడు. బయన్న నిస్వార్థ నిష్కల్మష మూఢభక్తికి మెచ్చి నృసింహుడు ప్రత్యక్షమయ్యాడు. వెంటనే స్వామిని తీగలతో కట్టేసి పద్మపాదుని ముందర నిలబెట్టాడు బయన్న!
కళ్ళముందరే బయన్నకు కనబడుతున్న నృసింహుడు పద్మపాదునకు కనబడలేదు.స్వామీ! ఏమి నా పాపము?” అని ఆక్రోశించాడు పద్మపాదుడు. నాయనా! పద్మపాదా! కోటి సంవత్సరములు నా రూపాన్ని ధ్యానం చేసినా అలవడని ఏకాగ్రత భక్తి ఈ బయన్న ఒక్కరోజులో సాధించాడు. ఈ సత్పురుషుని సాంగత్యం వలనే నీకు నా మాటలు వినబడుతున్నాయి. నీవు విచారించకు. నీ అఖండ గురుభక్తికి మెచ్చాను. అవసరమైనప్పుడు నేనే నీకు దర్శనమిచ్చి నిన్ను కాపాడెదనుఅని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు స్వామి.
పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాము:
1.     పద్మపాదుని గురుభక్తి అనన్యము. గురుకృప లేని ఏవిద్య రాణించదు. ఇహపరసాధనానికి దిక్కైన గురువుని అత్యాదరముతో పూజించాలి.
2.     ఏకాగ్రత నిశ్చల భక్తి యొక్క గొప్పతనము మనకీ కథలో బయన్న ద్వారా తెలిసినది. నిద్రాహారాలు మాని ఏకాగ్రచిత్తంతో స్వామిని వెదకిన బయన్నను కరుణించాడు నృసింహుడు.



కాకభుశుండి పూర్వజన్మవృత్తాంతము




శ్రీ తులసీదాస కృత రామచరితమానసము లోని కథ
నారద మహర్షి పంపగా గరుడ భగవానుడు మేఘనాథుని చేతిలో తనకు తానే బంధింపబడిన శ్రీరాముని బంధములను తొలగించెను. శ్రీరాముని మాయావశుడైన గరుడుడు ఇలా ఆలోచించసాగెను సర్వవ్యాపకుడు నిర్వికారుడు వాగాధిపతి మాయాతీతుడు అయిన పరమేశ్వరుడు ఈ భూమిపై శ్రీరామునిగా అవతరించెనని విన్నాను. శ్రీరామ నామమును జపించినంత మాత్రముననే మానవులు భవబంధవిముక్తులు అగుదురనీ విన్నాను. కానీ అట్టి మహిమాన్వితుడైన శ్రీరాముడు ఒక రాక్షసాధముని నాగపాశముచే బంధింపబడుట ఏమి”? ఇలా మాయామోహితుడై వ్యాకులచిత్తుడైన గరుడుడు బ్రహ్మర్షి అగు నారదుని కడకేగి తన సందేహమును వ్యక్తపఱచి కాపాడమని ప్రార్థించెను. నారదుడు గరుడుని సందేహనివారణార్థం సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికడకు పంపెను. తన వద్దకు వచ్చిన గరుడునితో బ్రహ్మదేవుడిలా అన్నాడు ఓ విహగేశ్వరా! పరమశివుడు శ్రీరాముని మహిమను బాగా ఎఱుగును. కావున నీవు ఆ శంకరునే శరణువేడుము”. కుబేరుని కడకు వెళుతున్న మహాదేవుని కలిసి గరుడుడు తన సందేహమును చెప్పెను.ఓ పక్షీంద్రా! ఎంతో కాలము సజ్జనుల సేవను చేసిగానీ జ్ఞానమును పొందలేము. నిన్ను నిరంతర రామకథాప్రసంగములు జరిగే దివ్యమైన నీలగిరిలోని పరమ భాగవతోత్తముడైన కాకభుశుండి ఆశ్రమమునకు పంపెదనుఅని పార్వతీనాథుడు ఆనతిచ్చెను.
వేయి మందిలో ఒక్కడే ధర్మపథమును సర్వకాల సర్వావస్థలయందూ అనుసరించును. అట్టి కోటి ధర్మాత్ములలో ఒక్కడు పేరాశకులోనుకాక విరాగి వలె ఉండును. అట్టి కోటి విరాగులలో ఒక్కడు జ్ఞాని అగును. అలాంటి జ్ఞానులలో కోటికొక్కడే జీవన్ముక్తుడగును. అట్టి వేయిమంది జీవన్ముక్తులలో అరుదుగా ఒక్కడు బ్రహ్మైక్యమును పొందును. అలా బ్రహ్మైక్యమును పొందినవారిలో మిక్కిలి అరుదుగా సంపూర్ణముగా మాయావిముక్తుడై శ్రీరాముని భక్తిలో లీనమైన ప్రాణి ఉండును. అట్టి దుర్లభమైన నిష్కల్మష రామభక్తి ఉన్న కాకభుశుండి కడకు గరుడుడు వచ్చెను. వచ్చిన గరుడుని తగిన రీతిలో గౌరవించి కుశలమడిగి సముచిత ఆసనముపై కూర్చుండబెట్టి గరుడునికి సంక్షిప్త రామాయణము మొదలగు ఎన్నెన్నో అతిరహస్యములైన తత్త్వములను వివరించి గరుడుని కోరికపై తన పూర్వజన్మ కథను ఇలా చెప్పాడు రామభక్తుడైన కాకభుశుండి
పూర్వము ఒకానొక కల్పములో కలియుగము ఆరంభమైనది. కలికాలము మిక్కిలి కలుషితమైనది. స్త్రీ పురుషులందఱూ పాపకర్మనిరతులై వేదవిరుద్ధముగా మోహాధీనులై క్షణికమైన జీవితకాలము కలిగియూ కల్పాంతములు దాటే గర్వము దంభము అహంకారమును కలిగియుందురు. పాషండులు తమవిపరీత బుద్ధులతో క్రొత్తక్రొత్త సాంప్రదాయాలను ఆచారాలను కల్పించి ప్రచారం చేయుదురు. ఎవరికి ఏది ఇష్టమో అదే ధర్మమని అందురు. ఒక వైపు బ్రహ్మజ్ఞానముగూర్చి మాట్లాడుతూ మఱొక వైపు లోభముచే ఎంత మహాపాపకార్యమైనా చేయుటకు వెనుకాడరు. తాము స్వయముగా భ్రష్టమగుటే కాక సన్మార్గమున నడచువారినికూడా భ్రష్టుపఱచెదరు. వర్ణాశ్రమధర్మాలు అడుగంటుతాయి. ప్రజలలో సామరస్యం సమైక్యభావం నశిస్తుంది. నిష్కారణ వైరములతో కక్షలతో ఉండెదరు. వేదశాస్త్ర పురాణములను గౌరవించరు. కుతర్కములతో వేదశాస్త్రపురాణ నిందచేసి అనంతపాపరాశిని సొంతం చేసుకుంటారు. పూజలు దానధర్మాలు స్వార్థబుద్ధితో తామసముతో చేసెదరు. విద్యను అన్నమును అమ్ముకొనెదరు. ధనవంతులకే గౌరవమివ్వబడును. గురుశిష్య భార్యభర్త మాతాపితభ్రాత అను సంబధములకు విలులేకుండును. ఆడంబరముగా జీవించుచూ వేదమార్గమును త్యజించి దిగంబరత్వము సమర్థించి ఆపాదమస్తకమూ కపటత్వముతో నిండియున్న వారు గురువులై అధర్మబోధలు చేశెదరు. అమంగళకరమైన వేషభూషణాదులను ధరించి శిరోజములను విరియబోసుకొనెదరు. తినదగినది తినగూడనిది అను విచక్షణ తినుటకు సమయం అసమయం అను విచక్షణ చేయక అన్నింటిని అన్నివేళలా తినెదరు. అలా పాపకూపములో పడి ఇహములో పరములో బహు క్లేశాలను అనుభవించెదరు.
కానీ ఈ కలియుగమున ఒక గొప్పగుణము కలదు. కలౌ సంకీర్తనాన్ముక్తిః”. యొగ యజ్ఞ పూజాదులకు ఆస్కారములేని ఈ యుగములో భగన్నామస్మరణ చేసి జనులు ముక్తిని పొందెదరు. ఓ పన్నగాసనా! ఇంద్రజాలికుడు ప్రదర్శించుమాయ చూచువారిపైనే ప్రభావమును చూపును. కానీ అతనిసేవకులను అది ఏమీ చేయదు. అట్లే మాయకుమూలమైన భగంవంతుని శరణుజొచ్చిన వానికి ఆ అనూహ్యమైన మాయ అంటదు.
అట్టి కలియుగములో నేను భూవైకుంఠమైన అయోధ్యానగరములో ఒక శూద్రునిగా జన్మించినాను. మనోవాక్కర్మలచే నేను అఖండ శివభక్తుడను. కానీ నా బుద్ధిమాన్యముచే ఇతరదేవతలను దూషించుచుండెడి వాడను. అతిగర్వముతో ధనగర్వముతో నేనుండగా ఒకసారి అయోధ్యలో కఱవు వచ్చింది. దరిద్రుడనై దుఃఖితుడనై ఉజ్జయినీ నగరము చేరి అక్కడ కొంత ధనము సంపాదించి పరమ శివుని ఆరాధన కొనసాగించితిని. ఒక్కడ అతిదయాళువు నీతిమంతుడు పరమసాధువైన ఒక విప్రోత్తముడు వైదికపద్ధితిలో అహర్నిశలూ శివుని ఏకాగ్రచిత్తముతో నిష్కల్మషముగా పూజించుచుండెను. అతడు ఎన్నడునూ విష్ణు నింద చేయలేదు. కపటబుద్ధితో నేనతనికి సేవ చేయుచుండెడివాడను. ఆ భూసురుడు నన్ను పుత్రవాత్సల్యముతో చూచుచూ బోధించుచుండెను. శివభక్తినే కాక ఇతరములైన ఎన్నో నీతులను నాకతడు బోధించెను. నేను ప్రతి దినమూ దేవాలయమునకు పోయి శివనామస్మరణము చేసెడివాడను కానీ నా అహంకారమును నేను విడువలేదు. హరిభక్తులను పండిత సజ్జనులను ద్వేషించెడివాడను.
నా గురువు నా ప్రవర్తన చూసి చాల బాధపడి నిత్యమూ ఎన్నో సదుపదేశములిచ్చెడివాడు. ఆ ఉపదేశములను పెడచెవిన పెట్టి గురుద్రోహము చేయుచూ నాలోని కోపాగ్నిని ప్రజ్వలింప చేయుచూ జీవించుచుంటిని. ఇలా ఉండగా ఒక రోజు నా గురువు నన్ను పిలిచి శివకేశవుల అభేదత్వము బోధించి పరమాత్మ అయిన శ్రీరామునికి సర్వదేవతలు బ్రహ్మ శివుడు నమస్కరించెదరు. అట్టిది నీవు ద్వేషించుట తగదుఅని అనెను. అది వినడంతో నా కోపాగ్ని మింటికెగసెను. అనర్హుడనైన నాకు విద్యనొసగిన నా గురువునకే ద్రోహము తలపెట్టాను. అయినా క్రోధాదులను జయించిన అతడు నాపై ఏమాత్రమూ కోపపడలేదు.
ఒక రోజు నేను శివాలయములో శివనామము జపించుచుండగా నా గురూత్తముడు అచటికి వచ్చెను. నా గర్వము వలన లేచి ఆయనకు నమస్కరించలేదు. దయానిధి అయిన నా గురువుకు నా దౌష్ట్యము చూచియు కొంచెముకూడా కోపమురాలేదు! కాని గురువును నిరాదరించుట మహాపాపము. పరమశివుడు ఇది చూసి సహింపలేక ఓరీ మూర్ఖుడా! పూర్ణజ్ఞాని అయిన నీ గురువును అవమానించినావు. నీవు క్షమార్హుడవు కాదు. సద్గురువుపై ఈర్షగొన్నవాడు కోట్లాదియుగములు రౌరవాది నరకములలో పడి తరువాత పశుపక్షాది జన్మలు పొంది అటుపై వేలకొలది జన్మలు క్లేశములభవించును. నీ విప్పుడే అజగరమువై ఒక చెట్టుతొఱ్ఱలో పడివుండుఅని నన్ను శపించెను. భయకంపితుడనైన నన్ను చూసి నా గురువర్యుడు రుద్రాష్టకముతో శివుని ప్రసన్నుని చేసుకుని పశ్చాత్తాపముతో దుఃఖిస్తున్న నాకు శాపావశానము ప్రసాదించమని వేడుకొనెను. అంతట పరమేశ్వరుడు
ఓ కృపానిధీ! మహాపకారికైనా మహోపకారము చేయు నిన్ను మెచ్చితిని. నీ శిష్యునికి శాపావశానమిచ్చెదఅని నన్ను చూసి చేసిన తప్పుకు శిక్ష అనుభవింపక తప్పదు. నీవు దుర్భరమైన వేయి జన్మలెత్తుతావు. కానీ నీ గురువు మహిమవల్ల దివ్యమైన అయోధ్యానగరమున పుట్టినందువల్ల నీ మనస్సును నాయందు పెట్టి నన్ను పూజించినందువల్ల నీలో అచంచలమైన రామభక్తి ఉదయిస్తుంది. ప్రతి జన్మలో నీకు పూర్వజన్మ స్మృతి ఉంటుంది. వత్సా! ఇంకెప్పుడూ సాధుసజ్జనవిప్రులను నిరాదరింపవద్దు. ఇంద్రుని వజ్రాయుధముతో నాత్రిశూలముతో యముని దండముతో శ్రీహరి చక్రముతో చంపబడనివాడు సజ్జనద్రోహమనెడి అగ్నిలో పడి మాడిపోతాడుఅని చెప్పి నాపై కృపావర్షం కురిపించినాడు ఉమానాథుడు. అప్పటినుంచీ ప్రతి జన్మలోనూ నేను చేసిన తప్పులకు ఎంతో పశ్చాత్తాపముతో దుఃఖిస్తూ రామునిపై భక్తిని మఱువక చివరికి కాకి జన్మనెత్తి మహనీయుడైన లోమశ మహర్షి వద్ద శ్రీరామచరితమానసము విని కాకభుశుండినై శ్రీరామునికి ప్రియుడనైనాను”.
పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దామ్:
1.       గురుద్రోహం శివకేశవులను భేదబుద్ధితో చూడడం సాధుసజ్జనులను అవమానించడం ఘోరపాపములని మహాశివుడు కాకభుశుండితో చెప్పాడు. కావున మనము గర్వముతో ఇట్టి తప్పులెన్నడునూ చేయరాదు.
2.     కాకభుశుండి గురువు యొక్క దయాగుణం మనకు ఆదర్శం కావాలి. శిష్యుడెన్ని అవమానాలుచేసినా తను చెప్పిన హితవాక్యాలను పెడచెవిన పెట్టినా ఏమాత్రమూ కోపగించుకోలేదు.
3.     రామభక్తుడైన కాకభుశుండి కలియుగ వర్ణనము వలన మనకు చేయకూడనివి ఎన్నోతెలిసినాయి. ఇట్టి దుష్కృతాలకు దూరముగా ఉండి ధర్మమార్గములో నడచుచూ నిత్యం భగవన్నామస్మరణ చేయడమే మన కర్తవ్యమ్




శ్రీకృష్ణ లీలలు శకటాసుర భంజనమ్



 శ్రీ గర్గభాగవతం లోని కథ
ఏమి నోము ఫలమో ఇంత ప్రొద్దొక వార్త వింటిమబలలారా వీనులలర
మన యశోద చిన్ని మగవాని గనెనట చూచివత్తమమ్మ సుదతులారా
అంటూ ఒకరినొకరు పిలుచుకుంటూ వ్రజభామలందఱూ చిన్ని కృష్ణుని చూడ వచ్చారు. బాలకృష్ణుని కురులు ముడిచి పరిమళ పుష్పములతో అలంకరించారు. ఆ చిన్ని శిశువు నుదుట కస్తూరి దిద్ది కాటుక పెట్టారు. చెవి పోగులు పులిగోరు చంద్రహారము బాలునికి ధరింపచేశారు. బోసి నవ్వులొకిస్తున్న జగన్నాథుని బుగ్గన గడ్డముపై చుక్కలు పెట్టారు. చేతులకు కడియాలు ముంజేతులకు మురుగులు మొలకు బంగారుత్రాడు కట్టారు. బాలుని రూపములో ఉన్న శేషశాయికి నీరాజనాలిచ్చి ఉయ్యాలా బాలునూచెదరుఅంటూ బాలుని బండీ క్రిందనున్న పసిడి తొట్టిలో పడుకోబెట్టి లాలి పాటలు పాడారు. వ్రజభామలు ఎన్నో కానుకలు పిండివంటలు మొదలగునవి ఇచ్చారు.



ఈ కోలాహలంలో కంసప్రేరితుడైన శకటాసురుడు వాయు రూపములో వచ్చి పరమాత్మపై బండిని పడద్రోశాడు. ముద్దులొలికిస్తూ చిన్నికృష్ణుడు ఆ శకటమును (బండిని) తన్నాడు. రివ్వున బండీ ఎగిరి శకటునిపై పడి ఆతని తల వ్రక్కలయ్యెను. బండిపైనున్న క్షీర దధి భాండములు క్రింద పడి పగిలెను.
అలికిడి వినిన వ్రజభామలు కలవరుముతో చూడగా బాలకృష్ణుడు కేరింతలుకొట్టుచూ ఆడుకుంటున్నాడు. ఈ లీలను చూచిన గోపబాలురు జరిగిన సంగతి వ్రజభామలకు చెప్పిరి. ఆశ్చర్యపడి నందనందునకు ఎఱ్ఱని నీటితో దిష్టితీసి భూసురులచేత వేదాశీర్వచనములు చేయించి లోకరక్షకునకు రక్షకట్టిరి.



శకటాసురుని వృత్తాంతము:
హిరణ్యలోచనుని పుత్రుడైన ఉత్కచుడు చాలా క్రూరుడు. ఒకసారి అతడు తన స్వాభావికమైన క్రూరత్వముచే లోమశ మహర్షి ఆశ్రములోనున్న వృక్షలతాదులను పెఱికివేశాడు! ఆతని క్రూరబుద్ధిని చూసి ఆ మహర్షి ఓరీ! పాము కుసుసము విడిచినట్టు నీవు ఈ దేహము విడువుముఅని శపించినాడు. పశ్చాత్తాపముతో మహర్షి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు ఉత్కచుడు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తము లేదు. అయిననూ నీవు చేసిన కర్మకు శిక్ష తప్పదు. ద్వాపరమున శ్రీకృష్ణ పరమాత్మ నిన్ను విధించును. ఆ పురుషోత్తముని పాద స్పర్శతో నీకు శాపవిముక్తి కలుగుతుందిఅని శాపావశానం చెప్పాడు లోమశ మహర్షి. ఆ ఉత్కచుడే శకటాసురుడు.
పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దామ్:
క్రూరత్వం కడు దుష్టస్వభావము అసురలక్షనము. తోటి మానవులు జంతువులతోనే కాక వృక్షములతో కూడా మైత్రీభావముతో ఉండవలెనని మనకు ఈ కథ ద్వారా తెలిసినది. మన శాస్త్రాల ప్రకారం ఒక చెట్టును ఊరికే నఱకడం మహాపాపమ్. అవసరార్థం ఒక వృక్షమును నఱికితే దానికి బదులు నాలుగు వృక్షములు నాటమని మన ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఉత్కచుడు ఊరికే ఎన్నో వృక్షములను పెఱికివేసి ఆ తప్పుకు శిక్ష అనుభవించాడు.




ఏకచక్రపుర బక వధ




మహాభారతము లోని కథ
అమ్మా! ఎందులకు నీవు పుత్రత్యాగము చేయుచున్నావు? ఎవ్వని బాహుబలము వలన మనము లాక్షాగృహము నుండి బయపడ్డామో ఎవ్వని శక్తి సామర్థ్యాలవల్ల దుష్టుడైన పురోచనుడు నశించాడో ఎవ్వని బలపరాక్రమాలు మనల్ని ఎల్లవేళలా దుర్యోధనుని బాఱినుండి కాపాడుతున్నాయో ఏ వీరుని అండ చూసుకుని మనము సుఖముగా జీవిస్తున్నామో ఏ మహాబలశాలి కౌరవాదులకు గుండెదిగులు అయ్యాడో ఎవ్వని పై భారం మోపి పోగొట్టుకున్న రాజ్యలక్ష్మిని మఱల పొదుదామనుకుంటున్నామో అట్టి నాగాయుధ బలసంపన్నుడైన భీమసేనుని ఎందులకు త్యాగము చేస్తున్నావు తల్లీ”? అని బకాసురునికి ఆహారముగా వెళుతున్న తమ్ముని చూసి తల్లి అయిన కుంతీదేవిని అడిగాడు ధర్మరాజు.
నాయనా! ప్రస్తుతము మనము ఈ విప్రోత్తముని ఇంటిలో ఆశ్రయము తీసుకుంటున్నాము. ఆ విప్రుని కుమారుడు బకాసురునకు ఆహారము కాకుండా కాపాడి ఆయన మనపై చూపిన వాత్సల్యానికి కృతజ్ఞతను చూపించాలి. ప్రత్యుపకారం మన కనీస కర్తవ్యమ్. సాటి వారు బాధలలో ఉన్నప్పుడు ఆదుకోవటం మానవతాధర్మమ్. అదీ కాక ఇటువంటి పండితోత్తముని రక్షించటం మహాపుణ్యదాయకమ్. లోభం వల్లకానీ తెలియక గానీ మోహము వల్లకానీ నేనీ నిర్ణయము తీసుకోలేదు.
వెయ్యి ఏనుగుల బలమున్న భీమసేనుని పరాక్రమము మనకు తెలియనిది కాదు. హిడింబాసురుని వధించినప్పుడు మనకి అతని శక్తి ఎంతటిదో తెలిసిపోయింది. ఆ భీమసేనుడు పుట్టిన రోజే నా చేయిజారి క్రింద పడినప్పుడు అతని క్రింద ఉన్న రాయి నుగ్గునుగ్గైపోయింది! యుద్ధములో వజ్రిని కూడా ఢీకొనే బలమున్నది భీమునికి. కనుక ఇతడు నిస్సందేహముగా బకాసురుని వధించి ఈ ఊరికి ఉపకారం చేస్తాడనే నా నమ్మకమ్. ఆ పైన శ్రీకృష్ణుని దయఅని హితబోధ చేసింది మహాసాధ్వి అయిన కుంతీదేవి.
ధర్మజుడు తల్లి మాటలు విని ఎంతో సంతోషించి పుత్రవాత్సల్యంతో తమ్ముని మనసారా దీవించి పంపినాడు. అనుకున్న ప్రకారం భీమసేనుడు ఒక బండీలో అన్నం నింపుకుని ఆ రాక్షసుని స్థావరమునకు వెళ్ళి అతనిని పిలిచి తానే ఆ ఆహారమంతా తినసాగాడు. బకాసురుడు నరార్భకుడు తన భోజనం తినేస్తున్నాడని కుపితుడై గట్టిగా భీముని వీపుపై గుద్దాడు. చలించని భీమసేనుడు ఆహారం తీసుకుంటూనే ఉన్నాడు. మహా క్రోధముతో బకుడు ఒక పెద్ద వృక్షమును పెకిలించి భీమునిపైకి విసరబోయాడు.
ఇంతలో భీముడు భోజనము ముగించి కాళ్ళూ చేతులూ కడుక్కోని ఆచమించి శుచి అయ్యి రాక్షసుడు విసిరిన చెట్టుని పట్టుకుని తిప్పికొట్టాడు! అలా కొంత సేపు వారు రాళ్ళతో చెట్లతో భీకర యుద్ధం చేసి చివరికి ముష్టియుద్ధము చేయసాగారు. అలసిపోయిన రాక్షసుని బోర్లదోసి తన మోకాలిని బకుని వీపుపైన ఉంచి బలముగా ఒక్క ముష్టిఘాతం ఇచ్చాడు భీముడు. బకుడు ఆర్తనాదాలు చేస్తూ అసువులు బాసినాడు


ఆ కేకలు విని బకుని బంధువులు బైటికి వచ్చారు. భయకంపితులైన వారితో భీముడుఇక నుంచీ మీరు మనుషులను హింసించటం మానకపోతే మీకూ ఈ బకునికి పట్టిన గతే పడుతుందిఅని హెచ్చరించాడు. వారందఱూ అలాగే ప్రతిజ్ఞ చేసి వెళిపోయారు. ఆ రోజునుండీ ఏకచక్రపురం లోని ప్రజలు హాయిగా జీవించడం మొదులుపెట్టారు.
పిల్లలూ! ఈ కథ లోని నీతులను మరొక్కమాఱు చూద్దామ్:
1.     కుంతీదేవి ధర్మరాజుకు చేసిన హితబోధ మనమెన్నడూ మఱువరాదు. కృతజ్ఞత ఆర్తరక్షణ కనీస కర్తవ్యాలని మనకు ఈ కథ ద్వారా తెలిసినవి.
2.     ఒక సజ్జనుడు తన బలాన్ని పరోపకారానికి ఎలా ఉపయోగిస్తాడో మనకు ఈ కథలో భీమసేనుని ద్వారా తెలిసింది. అదే దుష్టులైన కౌరవులు తమ బలాన్ని యుక్తిని ప్రజాశ్రయస్సుకు వాడకుండా మత్సరముతో పాండవులను మట్టుపెట్టడానికే ఉపయోగించారు.




భూదాన మహిమ




భరద్వాజ సంహిత లోని కథ
ఒకసారి దేవేంద్రునికి దేవగురువైన బృహస్పతులవారు భూదానము యొక్క గొప్పతనమును గూర్చి వివరిస్తూ ఈ కథ చెప్పారు:
మాళవ దేశములో ఒక ఘోరారణ్యమున్నది. సూర్యరస్మి కూడా చొచ్చుకు పోలేనంత దట్టమైన అడవి. ఆ మహారణ్యములో ఒక పెద్ద బూఱుగు చెట్టు ఉన్నది. శాఖోపశాఖలతో బాగా విస్తరించి ఉన్న ఆ శాల్మలీవృక్షం ఎన్నెన్నో పక్షులకు జంతువులకు సమాశ్రయాన్ని కల్పిస్తున్నది. చిలుకల కలకలరవాలతో జలపాతాల శబ్దాలతో పచ్చగా కన్నులకు పండుగగా ఉన్నది ఆ అడవి.
ఆ బూఱుగు చెట్టు కొమ్మపై తామ్రతుండం అనే ఒక రామచిలుక కాపురముండేది. ఆ శుకం తన పిల్లలకు నివ్వరిపైరు ఆహారముగా పెట్టేది. తామ్రతుండం పిల్లలు ఆ వడ్లను ఎలా తినాలో కూడా తెలియని పసికూనలు. అందుకని ముక్కుతో ఆ వడ్లను తీసుకుని పిల్లల నోటిలో పడేశేది తామ్రతుండం. ఇలా వడ్లు పెట్టేటప్పుడు కొన్ని గింజలు క్రింద పడేవి. కొన్నాళ్ళకు అవి మొలకలెత్తి కాలక్రమేణ ఒక చిన్న వరిపైరు తయాఱయింది!
ఒకరోజు ఎక్కడా సరి అయిన పచ్చగడ్డి దొరకని ఒక ఆవు ఆకలిదప్పికలతో అలసి ఆ శాల్మలీ వృక్షం దగ్గరకు వచ్చినది. తామ్రతుండం ముక్కునుండి జారిన వడ్లతో పెరిగిన పైరు చూసి సంతోషించి స్వేచ్ఛగా తిని తృప్తి చెంది వెళిపోయింది. తరువాత ఆ గోవు తినగా మిగిలిన యవలతో ఒక విప్రోత్తముడు పంచయజ్ఞాలు చేశాడు.
అలా దైవికంగా తామ్రతుండానికి మహాపుణ్యం వచ్చింది. కాలధర్మం చేశాక అది చేసుకున్న సుకృతము వలన ధనికుడనే ఒక ధర్మాత్ముడైన వైశ్యునిగా జన్మించింది. ఓడవ్యాపారి అయిన ఆ ధనికునికి పూర్వజన్మ స్మృతి ఉన్నది. అజ్ఞానవశః తన ముక్కునుండి జారిపడిన ధాన్యం మొలకెత్తి ఒక గోవు ఒక విప్రుడు ఆ పంటను ఉపయోగించినందుకే తనకి ఇంత ఫలితం వచ్చిందని తెలిసిన ఆ ధనికుడు ఎన్నో ఫలవంతాలైన మంచి మాగాడి భూములను పండితులకు దానము చేశాడు. ఆ పుణ్యఫలముతో ఇహములో సర్వభోగాలు అనుభవించి కడకు విష్ణులోకం చేరుకున్నాడు.
పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దామ్:
సస్యసంపూర్ణము ఫలవృక్ష సమన్వితము అయిన భూమిని భక్తితో సత్పాత్రునకు సమర్పించిన వాడికి బ్రహ్మలోకం కరతలామలకం. అజ్ఞానతః తన భూమిలోని పైరు ఇతరులకి ఉపయోగ పడినందుకే తామ్రతుండానికి అంత పుణ్యం వస్తే ఇక జ్ఞానపూర్వకముగా ఫలవృక్షములున్న భూమిని అర్హునికి దానముచేస్తే ఎంత ఫలమో ఆ పరమేశ్వరునికే తెలుసు




అన్నమాటకి కట్టుబడిన అర్జునుడు




మహాభారతము లోని కథ
పరమేశ్వరుని వరప్రభావముతో సక్షాత్ విష్ణుస్వరూపుడైన వ్యాసుని శాసనముపై ధర్మబద్ధముగా జరిగింది ద్రౌపదీ పాండవుల కళ్యాణము. దేవశిల్పి అయిన విశ్వకర్మచే నిర్మించబడిన ఇంద్రప్రస్థములో ఉన్న ద్రౌపదీ పాండవుల వద్దకు నారదుడు వచ్చి సంసారజీవములో వారుపాటించ వలసిన నీతినియమాలను వివరించాడు. అన్ని విషయాలు వివరిస్తూ ఇలా అన్నాడు ఓ పాండవులారా! విమలబుద్ధితో వినండి. ద్రౌపదీదేవి మీ ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కయేడాది క్రమముగా ఉంటుంది. ఆ కమలాక్షి ఉన్న ఇంటి యజమానికి తెలియకుండా మీరెవరైనా ఆ అంతఃపురానికి వెళితే ప్రాయశ్చిత్తముగా ఒక ఏడాది కఠిన వ్రతనియమాలు పాటించి తీర్థయాత్రలు చేయాలి”. పాండవులందఱూ నారదుని చెప్పిన ఆ సమయనియమాన్ని శిరసావహిద్దామని నిశ్చయించుకున్నారు.
ఇట్లా ఉండగా ఒక రోజు ఒక బ్రాహ్మణుడు దొంగలచేత తన హోమధేనువును పోగొట్టుకున్నవాడై తనను రక్షించమని ఆక్రోశించాడు. ఆ విప్రుని ఆర్తనాదం విన్న అర్జునుడు దుఃఖమునకు కారణమడిగి ఏమి జరిగినదో తెలుసుకున్నాడు. అర్జునుడి ధనుస్సు ధర్మరాజు ఆయుధశాలలో ఉన్నది. అప్పుడు ద్రౌపదీదేవి ధర్మరాజు అంతఃపురములో ఉన్నది. ఆ కారణముగా ఆయుధశాలకి ప్రవేశించిన నారదుడు వారికి విధించిన నియమముభంగము అవుతుందని తెలిసినా ప్రాయశ్చిత్త క్లేశమునకు జంకక ఆ వీరాధివీరుడైన అర్జునుడు ఆర్తరక్షణకై ఆయుధాలయం ప్రవేశించి తన ధనువు తీసుకుని ఆ దొంగలను వెంబడించాడు. దుష్టులు వీరులు అయిన ఆ దొంగలను శిక్షించి విప్రుని హోమధేనువు అతనికి తిరిగి ఇచ్చివేశాడు.
తరువాత సత్యవంతుడైన అర్జునుడు ధర్మరాజు వద్దకువెళ్ళి జరిగినది చెప్పి తనకు తీర్థయాత్రలు చేసి ప్రాయశ్చిత్తము చేసుకునే అవకాశం ఇవ్వమని కోరినాడు. అంతట ఆ ధర్మనందనుడిలా అన్నాడు సోదరా! క్రూరకర్ములై ఆ విప్రుని హోమధేనువును అపహరించిన ఆ దొంగలను శిక్షించి నీవు ధర్మమే చేశావు. ఇట్టి దుష్టులను ఉపేక్షించిన మహాపాపము. అందుకని సమయభంగమైనది నీవు విచారపడనక్కరలేదు. ధర్మరక్షణకై చేశావు కనక నీవు ఎందుకు తీర్థయాత్రలకు వెళ్ళటం”?
అప్పుడు శ్రీకృష్ణ ప్రియసఖుడైన అర్జునుడిలా అన్నాడు అన్నయ్యా! ప్రజారక్షణ అనే వ్యాజముతో (వంకతో) నేను ఆడిన మాట తప్పుట మంచిదికాదు కదా! నా పాపము తీరే విధముగా తీర్థయాత్రలు చేసేందుకు నాకు అనుజ్ఞ ఇవ్వండి”. తమ్ముని సత్యవాక్ పరిపాలనకు సంతోషించి అతనికి దూరముగా ఉండట ఇష్టములేక పోయినా తీర్థయాత్రలకు పంపించాడు. తరువాత ఆచార్యుల పెద్దల అనుమతి తీసుకుని అర్జునుడు రాజభోగాలన్నీ తృణప్రాయంగా ఎంచి వేదవేదాంగ విదులైన పండితులను సహాయముగా తీసుకుని సకల తీర్థాలూ సేవించి పావనుడైనాడు.
పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దామ్:
కఠినమైన వ్రతనియమాలతో ఉండి రాజ భోగాలు విడిచి తీర్థయాత్రలు చేయాలని తెలిసినా అర్జునుడు తన కర్తవ్య పాలన చేయడానికి వెనకాడకుండా ఆయుధాలయానికి వెళ్ళి ధనువు తెచ్చి దుష్టశిక్షణ చేశాడు. తనంతట తాను వేళ్ళి తన తప్పుకు ప్రాయశ్చిత్తము చేసుకునే అవకాశమీయ మని ధర్మరాజును ప్రార్థించి తన సత్యవాక్ పరిపాలనా దీక్షను మనకు చూపించాడు.

 





Om Tat Sat
                                                        
(Continued...)  



 

(My humble greatfulness to Neethi Kathalu  dot com and  Hindu dot com for the collection)


(మన భారతీయ సంస్కృతికి సవినయ నివాళి )

0 comments:

Post a Comment

About Me

My Photo
gopalakrishna
View my complete profile

Visitors

free counters

Visitors

free counters
Powered by Blogger.

Visitors

Labels