నీతి కథలు - 3



















































నీతి కథలు





భూతదయ




పెద్దలు చెప్పిన నీతికథ
అది భవ్యమైన ఉజ్జయినీ నగరపు రాచవీధి. ప్రొద్దుకుంకినా ఆ దారిలోని దేశవిదేశ వర్తకుల సంఖ్య బేరసారాలాడుతున్న జనావళి రద్దీ తగ్గలేదు! రాత్రి కొంత గడచిన తరువాత కాస్త కాస్తగా రద్దీ తగ్గటం మొదలుపెట్టింది. ఇంతలో తేనెలమ్మే ఒక వయ్యారి తన వన్నెచిన్నెలు ఒలకబోస్తూ ఆ వీధివెంట వచ్చి బుట్ట క్రిందికి దించి అమ్మకం మెదలుపెట్టింది. నిమిషములో కొన్ని లక్షలాది చీమలు మధువు కోసం ఆ వన్నెలాడి తేనె బుట్ట వద్దకు చేరినాయి. చీమల పుట్టలు చూసి వాటిని బఠానీల్లా నములుదామని ఒక తొండ అక్కడికి వచ్చింది.
రాత్రంతా నగరంలోని వేడుకల వలన జనసంచారమునకు భయపడి బయటకురాని ఎలుక తొండకోసం వచ్చింది. పిల్లిగారు ఆ తొండని గుటకాయస్వాహా చేద్దామని పొంచినిలిచినారు. పిల్లికోసం కుక్క కూడా అక్కడికి వచ్చింది. రాచవీధిలోని వేటకుక్కలు ఊరికుక్కని చూసి హంగామా చేశాయి.
ఇంతలో ఒక మాంత్రికుడు తన మంత్రశక్తి ద్వారా అడవిలోని ఒక పెద్దపులిని బంధించి రాచవీధిన తెస్తున్నాడు రాజుగారికి చూపించి మెప్పుపొందుదామనే ఉద్దేశ్యముతో. పౌరుషంలేని పులిని చూసి వేటకుక్కలు మీదపడ్డాయి. మరే జంతువైనా మంత్రించి బంధించేసేవాడు మాంత్రికుడు కానీ రాజుగారి వేటకుక్కలయ్యేసరికి కిమ్మనక ఉండిపోయాడు. ఈ గందరగోళానికి రాచభటులు ఆ పై మహామంత్రిగారు అక్కడికి వచ్చి పరిస్థితులను సమీక్షించి రాజుగారికి నివేదించారు. రాజుగారు నగరపు ముఖ్యవీధిలోనే ఇంత అల్లకల్లోలం ఎందుకు జరిగింది?” అని ప్రశ్నించాడు.
సూక్ష్మబుద్ధి అయిన మహామంత్రి ఇలా సమాధానమిచ్చినాడు ప్రభు! కొద్దికాలముగా మన దేశములోని యువత రాత్రంతా వేడుకలతో సంబరాలతో గడుపుతున్నది. దీనివలన నిశాచరులైన జంతువులకు వేట కుదరటంలేదు. ఆహారము దొరకని కారణముగా ప్రకృతిలో ఈ అసహజస్థితి వచ్చినది. మానవునితో పాటు సహజీవనము చేసే భూతజాలములకు సైతం దయ చూపమని మన భారతీయ సంస్కృతి ఘోషిస్తున్నది కదా”!
ప్రజాహితుడైన ఉజ్జయినీ మహారాజు వెంటనే రాత్రి ఒక జాము నగారా తరువాత వీధులలో జనసంచారము ఉండరాదుఅని దండోరా వేయించాడు.
పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాము:
మన చిన్నప్పుడు అమ్మ బాబూ! రాత్రయిందిరా! ఇంక ఆటలు మాని ఇంటికి రారా. వేళకానివేళ ఆడితే నేలతల్లి కోపిస్తుందిరా! మంచి పిల్లలు త్వరగా పడుకుని తెల్లవారకముందే లేస్తారుఅని చెప్పి మందలించిన సన్నివేశం మనందఱికీ గుర్తే. ఈ సూక్తి వెనుకనున్న తత్త్వం మనకు మహామంత్రి మాటల ద్వారా తెలిసినది. ఈ విధముగానే అన్ని ప్రాచీన ఆచార సాంప్రదాయాల వెనుక ఆరోగ్య, సామాజిక, ఆధ్యాత్మిక హేతువులు కలవు. వాటి వివరమెఱిగి అనాదిగా వస్తున్న ఆచారాలను కాపాడుకొంటూ ముందు తరాలకు అందించుట మన కనీసకర్తవ్యము.




శివస్వామి పుణ్యగాధ




రీ స్కందపురాణము లోని కథ
పూర్వం చిత్రకేతుడనే ధర్మాత్ముడైన మహారాజు ఉండేవాడు. అతడొకనాడు ధర్మజిజ్ఞాసతో మహానుభావుడైన శౌనకమహర్షిని ఇలా ప్రార్థించాడు స్వామి! నాయందు దయ ఉంచి సర్వలోక హితావహమైన ధర్మము యొక్క మాహాత్మ్యమును తేటపఱచి వివరింపుడు”. చక్రవర్తి యొక్క కుతూహలమునకు సంతోషించి ఆ మహర్షి శివస్వామి పుణ్యగాధను వినిపించినాడు:
అవంతీదేశములో శివస్వామి అనే ధర్మస్వాంతుడైన విప్రోత్తముడు ఉండేవాడు. అతడు కౌండిన్యగోత్రోద్భవుడు ధర్మస్వామి కుమారుడు. శివస్వామి మిక్కిలి పితృభక్తి పరాయణుడు. మాతాపితరుల సేవే మాధవసేవ అన్న ఉక్తిని నమ్మినవాడు. ఇలా ఉండగా కొంతకాలానికి ధర్మస్వామి కాలధర్మం చెందినాడు. యథావిధిగా శ్రద్ధతో పితృదేవునికి శ్రాద్ధకర్మలు చేసి సంవత్సరీకముల తరువాత శివస్వామి తీర్థయాత్రలకు బయలుదేరినాడు. తల్లిదండ్రులు బ్రతికి ఉన్నంతకాలమే కాక చనిపోయిన తరువాత కూడా వారిని మరిచిపోకుండా పూజించుట భారతీయుల సంప్రదాయము కదా!
హిమాద్రి మందరాచలము లోని సర్వతీర్థములను గంగాది నదులను సేవించుకొని గంగాద్వారములోని నరనారాయణుల ఆశ్రమానికి చేరి అక్కడ తపోనిష్ఠలో ఉన్న ఋషులను సందర్శించుకొన్నాడు. ఇలా ఉత్తరభారతములోని పుణ్యతీర్థాలు సేవించి దక్షిణాది పుణ్యక్షేత్రాలను దర్శించడానికి ఉత్సుకుడై అతి ఘోరమైన వింధ్యాటవిలోనికి ప్రవేశించినాడు. భయంకరమైన సింహాలతో పెద్దపులులతో భూతభేతాళ రూక్షరాక్షసులతో ముండ్లచెట్లతో కరాళ జ్వాలలతో భీకరముగా ఉంది ఆ కాంతారము. ధీరుడైన శివస్వామి తీర్థయాత్రలు చేయాలనే దృఢసంకల్పముతో ముందుకుసాగినాడు. ఒకచోట మానవుల ఎముకలప్రోవులు చూచి కలవరపడి వెనుతిరుగుట ఇష్టంలేక ముందుకు నడువసాగినాడు. ఇంతలో భయాకారులైన అయిదు ప్రేతలు శివస్వామి ముందు నిలిచినాయి. శివస్వామి నిశ్చేష్టుడైనాడు.
కొంతసేపటికి తేరుకొని ధీరత్వం తెచ్చుకొని కమండలములోని జలముతో ఆచమించి శుచి అయ్యి మనోవీధిలో ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానించినాడు. ప్రేతలను మీరెవరు? నిర్జనవనంలో ఏమిచేస్తున్నారు”? అని ప్రశ్నించినాడు. మేమెవరమైతే నేమి? నిన్ను భక్షించుటకు వచ్చినాముఅన్న సమాధానము విని జరామరణదుఃఖాలను తొలగించే మహేశ్వరుణ్ణి స్మరిస్తున్నాను. ఆ భూతపతి తప్ప నాకు వేరు దిక్కులేదు. ఎవని పాదపద్మములను ఆశ్రయించి మార్కండేయాది మహర్షులు మృత్యువును జయించినారో అట్టి మృత్యుంజయుని ధ్యానిస్తున్నానుఅని అన్నాడు శివస్వామి. ఎవరైతే నిజమైన భక్తిశ్రద్ధలతో శూలపాణిని స్మరిస్తారో అట్టివారిని ఆ కాలకాలుడు కాలునిపాశమునుంచి కూడా రక్షిస్తాడు కదా!
శివశర్మ ఉమానాథ ధ్యానం చేశాడో లేదో అగ్ని వలె తేజోమయుడై వెలిగిపోయాడు. ఆ అగ్నితో తమ ముఖములు కాలుతున్నాయా? అనిపించి గడగడ వణుకుతూ ప్రేతలు ఏకకంఠముతో విప్రోత్తమా! మా అవజ్ఞతను మన్నింపుము. నీవు నిజమైన విప్రుడవు. కావున అగ్నివలె వెలుగుతున్నావు. నీకు హానికలిగించు శక్తి మాకులేదు. పుణ్యమూర్తివైన నీవు ఎవరు?” అని ప్ర్రార్థించినారు. శివస్వామి తన గురించి చెప్పి మీరెవరు? పాపచిత్తముతో నన్ను భక్షించడానికి ఏల వచ్చినారు? మీ వికృతాకారాలకు కారణములేమి?” అని అడిగినాడు.
మొదటివాడు: ఆర్యా! నేను స్థూలదేహుడను. నేను పూర్వజన్మలో విప్రధనమును అపహరించినాను. ఆడువారు పసివారు వృద్ధులు అన్న విషయం ఆలోచించక వారి ధనాన్ని దొంగిలించినాను. ఆ ఘోర పాపఫలితముగా నాకీ వికృతాకారము వచ్చినది. ఈ స్థూలదేహముతో నరకయాతనలు అనుభవించుచున్నాను. కాని ఏమి చేయగలను? చేసిన కర్మ చెడని పదార్థము కదా!
రెండవవాడు: స్వామి! నేను పరస్త్రీలనెందఱినో కామించినాను. నా ఘోరపాపకర్మ కారణముగా పీనమేఢ్రుడను అయినాను. నా శరీరమంతా ఎల్లప్పుడూ కాలిపోతున్నట్టుగా మండుతూ ఉంటుంది. చేసిన పాపమునకు ఫలితము అనుభవించ వలసినదే కదా!
మూడవవాడు: ద్విజోత్తమా! నేను గతజన్మలో అసత్యవాదిని. ఎప్పుడూ పరులను నిందించువాడిని. ఆ పాపప్రభావముచే ఇప్పుడు పూతివక్త్రుడిని అయినాను. నానోరు చీమునెత్తురులతో దుర్గంధభూయిష్ఠమై ఉంటుంది. నాలుక పురుగులు పట్టి ఉంటుంది. అహోరాత్రాలు నా ముఖము అగ్నిగుండము వలె మండిపోతూ ఉంటుంది. కర్మానుభవము తప్పదు కదా!
నాల్గవవాడు: భూసురేంద్రా! పోయిన జన్మలో నేను పిశినారిని. ఎంతో ధనము ఉండి కూడా కనీసము నా కుటుంబ పోషనార్థమైనా ధనవ్యయము చేయలేదు. ఎన్నడూ స్వాహాస్వధాలు దేవపితృకార్యాలు చేయలేదు. ఎవరికీ ఇంత పెట్టలేదు నేను తినలేదు. దేవపితృకార్యాలు చేయక కుటుంబాన్ని కృశింపచేశాను కావున ఇప్పుడు కృశశరీరుడనైనాను. అనుభవం అనే అగ్నిచే కానీ పాపరాసులు దహించబడవు కదా!
ఐదవవాడు: ఓ పుణ్యనిధి! ఏమి చెప్పను? నేను గడచిన జన్మలో నాస్తికుణ్ణి. మర్యాద కృతజ్ఞత లేకుండా వ్యవహరించేవాడిని. నిత్యమూ వేదనింద దేవనింద పూజ్య సాధుసజ్జన నింద చేసెడివాడిని. నా వాదాలు ఇలా ఉండేవి ధర్మం సత్యం మోక్షం అనేవి కల్పితాలు. బ్రతికినంతకాలం సుఖంగా ఉండాలి. చచ్చిన తరువాత ఏమవుతుందో ఎవడు చూశాడు? ఆత్మ అంటే దేహమే. ఇంద్రియ భోగమే ఆనందము. చచ్చినవాడికి శ్రాద్ధం పెట్టడం అవివేకము. తిలోదకాలు పరలోక గతిని కలిగిస్తాయన్న మాటలు మూఢనమ్మకాలు. ఏలయన శ్రాద్ధములు ఎక్కడో పరలోకంలో ఉన్నవాడికి తృప్తి కలిగిస్తాయని అనడమే నిజమైతే గ్రామాంతరములో ఉన్నవానికి కూడా తృప్తి కలగాలి. కాని అట్లు జరుగుటలేదు కదా!”. ఈ విధముగా హేతువాదముచేసి శాస్త్రాలలో అంతకంటే గొప్పవిషయాలు ఉన్నాయని తెలుసుకోక మిడిమిడి జ్ఞానముతో నేనెంతో తెలివైనవాడినని తలచి నన్ను నేనేకాక నాతోటివారిని కూడా నమ్మించి పాడుచేసినాను. చేసిన దుష్టవాదానికి ఫలితముగా దీర్ఘజిహ్వుడిని అయినాను. ఎవరూ అనుభవించని దుర్భరక్లేశాలను అనుభవిస్తున్నాను. నాది స్వయంకృతాపరాధము. చేసి తప్పుకు నేనే కదా ఫలము అనుభవించాలి!
ప్రేతలు చెప్పిన దారుణ వృత్తాంతాలు విని స్వాభావిక దయార్ద్రుడైన శివస్వామి అయ్యో! పాపమ్! దుష్టకర్ములు పాపాలకి ఫలితము ఈ లోకంలోనే కాక తరువాత కూడా అనుభవిస్తారు. పుణ్యపాప వలయములో చిక్కుకున్న వీరిని ఆ భగవంతుడే కాపాడాలిఅని అనుకొని మీ అనుజ్ఞ అయితే వెళతాను. కాదు నన్ను భక్షించాలని ఉంటే నేను అందుకు సిద్ధముగా ఉన్నాను. నావల్ల మీ ఆకలి తీరుతుందంటే అంతకన్నా కావలిసినదేమి?” అని అన్నాడు. అప్పుడు ప్రేతలు మహానుభావా! అగ్నిహోత్రమును భక్షించుట ఎవరి తరము? నీవంటి తేజస్విని మేమేమీచేయము. సుఖముగా వెళ్ళు. నీకు శివమగుగాక!
ఎంతో పుణ్యంచేసుకుంటే కానీ సత్సాంగత్యము కలుగదంటారు. మళ్ళీ మీవంటి పుణ్యాత్ముల సాంగత్య భాగ్యము కలుగునంత పుణ్యము మాకడ ఉన్నదోలేదో. కావున ఆపన్నులమైన మమ్ము ఉద్ధరింపుమని ప్రార్థన. అపకారికి సైతం ఉపకారము చేయుట సాధులక్షణము. కాబట్టి మేము చేసిన కీడు తలచక మమ్ము ఈ ఘోరయాతనల నుండి రక్షించు. మా కర్మప్రభావము వలన మాకు తర్పణలు ఇచ్చేవారు లేరు. కావున అతిపవిత్రమైన విరజ తీర్థములో మాకు తర్పణలు ఇవ్వు. నీవంటి మహనీయుడు మాకు తర్పణలు ఇస్తే మాకు తప్పక దురితనివారణం జరుగుతుందిఅని శివస్వామిని కోరినాయి. వెంటనే ప్రయాణమయ్యి సరిగ్గా శివరాత్రి రోజు విరజక్షేత్రం చేరినాడు. సంకల్ప సహితముగా తీర్థస్నానము చేసి యథావిధిగా శివరాత్రి వ్రతము చేసి శివభజనతో జాగరణము చేసి సూర్యోదయంలోని ఆహ్నికాలు తీర్చుకొని విధివిధానముగా తీర్థక్రమం నిర్వహించి శ్రద్ధతో పితరులకు తర్పణలిచ్చి పిండప్రదానము చేసినాడు. తరువాత పంచప్రేతలకు కూడా శ్రాద్ధాది క్రియలు చేసి ఆ పాపాత్ములను ఉద్ధరించినాడు.
కాబట్టి మానవుడు ఎల్లప్పుడు ధర్మమార్గములోనే నడవాలి. ధర్మవంతుడైన సజ్జనుడు తను తరించుటే కాక శివస్వామి వలె అందఱినీ తరింపచేయగలడుఅని చిత్రకేతునికి ధర్మబోధ చేసినాడు శౌనకమహర్షి.
పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాము:
1.     చౌర్యము పరకాంతావ్యామోహము అసత్యము పరనింద కృపణత్వము నాస్తికత్వము వేద దైవ నింద కృతఘ్నత మహాపాపాలని మనకు ప్రేతల వాక్కుల ద్వారా తెలిసినది. కావున మనమెన్నడూ ఇట్టి పాపకార్యములను చేయరాదు.
2.     కృతజ్ఞతాపూర్వకముగా శ్రద్ధతో చేసే శ్రాద్ధాదికార్యముల ఔన్నత్యము మహాత్మ్యము మనకీ కథలో తెలిసినది. ఆర్తులు దుఃఖితులు పాపాత్ములైనాసరే వారికి తర్పణలు ఇచ్చి ఉద్ధరించిన వానికి అశ్వమేధయాగములు చేసిన పుణ్యము కంటే అధికము లభించునని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఒక మనిషి యొక్క జీవనము కేవలము తనవలనే కాదు అందుకు పరోక్షముగా సహకరించేవారు దైవము తల్లిదండ్రులు సాటి మనుష్యులు పశుపక్షాదులు జ్ఞానబోధకులైన మహర్షులు అని భారతీయుల సిద్ధాంతము. బ్రతికి ఉన్నవారినే కాక చనిపోయిన వారిని కూడా విధివిధాన పూర్వకముగా తలుచుకొని వారికి కృతజ్ఞతలను తెలుపుకునే భారతీయుల కృతజ్ఞతావైభవము ఊహాతీతము.




శ్రీకృష్ణ లీలలు ప్రలంబాసుర వధ




శ్రీగర్గభాగవతము లోని కథ
యమునాతీరములో ఉన్న పొగడ చెట్టు మీదకూర్చుని మధుర వేణుగానముతో శ్రీకృష్ణపరమాత్మ సామవేదసారాన్ని బోధించెడివాడు. ఎంతో ప్రియముగా లేలేత పసిరికను మేస్తున్న గోమాతలు ఆ మధుర వేణురవం వినగానే పసిరికను వదిలి నిశ్చేష్టులై బొమ్మలవలె నందబాలునివైపు చూస్తూ వేణుగానమును ఆస్వాదించెడివి. హంసలు బెగ్గురుపక్షులు సమాధినిష్ఠులవలె వేణుగానమును గ్రోలుచుండెడివి.

పరమాత్మ గోపబాలులతో ఆడుచు పాడుచు నృత్యములు చేసెడివాడు. వారు గంతులువేస్తూ పరుగులెడుతూ పందెములు వైచుచూ కలహములాడుచూ క్రీడించుచుండెడివారు.



ఒకసారి వారు రెండు పక్షములుగా బారులుదీరి ఒకపక్షమునకు బలరాముని రెండవ దానికి శ్రీకృష్ణుని నాయకులుగా ఎంచుకొని ఆడుచుండిరి.


గెలిచిన పక్షమువారిని ఓడినవారు భాండీరకమను వటవృక్షము కడకు మోయవలెనని పందెము. ఆటలో శ్రీకృష్ణుని పక్షము ఓడిపోయెను. భక్తుల వద్ద ఓడిపోవుట భగవంతునికి పరిపాటి కదా! పరమాత్మ ప్రియసఖుడైన శ్రీధాముని మోసెను. మారువేషములో వచ్చి శ్రీకృష్ణుని పక్షాన ఉన్నట్టు నటించి కంస ప్రేరితుడైన ప్రలంబాసురుడు అవతల పక్షములో ఉన్న బలరామదేవుని మోసెను.
ప్రలంబుని కపటము గ్రహించి బలరామస్వామి తన బరువు పెంచుకొనెను. మోయలేక దానవుడు నిజరూపము దాల్చెను. ప్రలంబుని బ్రహ్మరంధ్రము చిట్లునట్టు ఒక్క ముష్టిఘాతమిచ్చెను బలరాముడు. తల రెండు వ్రక్కలయి ప్రలంబాసురుడు ప్రాణములను విడచెను. వాని తేజము పరమాత్మలో లీనమయ్యెను.


ప్రలంబాసురుని వృత్తాంతము
పరమశివుని ప్రియసఖుడు దిక్పాలకుడు యక్షేశ్వరుడు త్రిలోకపూజ్యుడు అయిన కుబేరుకి చైత్రరథము అను ఉద్యానవనము కలదు. పరమ శివభక్తుడైన కుబేరుడు చైత్రరథములోని పుష్పములన్నిటిని మహాదేవుని పూజకోసమే వినియోగించెడివాడు. కానీ కావలివాళ్ళు ఎంత అప్రమత్తులై ఉన్నా ఎవడో ఆ ఉద్యానవనములోని పుష్పములను అపహరించుచుండెడివాడు. అది తెలిసి కుబేరుడు పుష్పచౌర్యము చేసినవాడు రాక్షసుడై జన్మిస్తాడని శపించెను.
ఒకసారి హూహూ అను గంధర్వుని కుమారుడైన విజయుడు ఎన్నో తీర్థయాత్రలు చేసి కుబేరుని ఉద్యానవనము వద్దకు వచ్చెను. కుబేరుని అనుమతి గ్రహింపకనే ఉద్యానవనములోకి వెళ్ళి కొన్ని పువ్వులను గైకొనెను. యజమాని అనుమతి లేకనే పుష్పములు స్వీకరించిన కారణముగా విజయునికి పుష్పచౌర్య దోషము వచ్చెను. కుబేరుని శాపప్రభావముచే ప్రలంబాసురునిగా మారెను. పశ్చాత్తాపముతో కుబేరుని శరణువేడగా అభయమిచ్చి కుబేరుడు నాయనా! తెలిసి ముట్టినా తెలియక ముట్టినా అగ్నిహోత్రము వలన చేయి కాలక మానదు కదా! అట్లే పాపము కూడా. కానీ పరమ భక్తుడవైన నీకు కడకు మేలు జరుగును. పాపఫలితమును అనుభవించిన తరువాత బలరామస్వామిచే సంహరించబడి ముక్తుడవు అవుతావుఅని ఆశీర్వదించెను. (హాహా హూహూ అను గంధర్వులు శాపగ్రస్తులై గజేంద్ర మకరములుగా జన్మలెత్తి శ్రీహరికృపచే కైవల్యమును పొందినవారు.)
పిల్లలూ! కాబట్టి మనమెన్నడూ ఇతరుల వస్తువులను వారి అనుమతి లేనిదే గైకొనరాదు. అట్లుచేసిన అది చౌర్యమగును



గౌతముడి ఏనుగు




మహాభారతము లోని కథ
ఒకసారి గౌతమ మహర్షి అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండగా తల్లిలేని ఒక ఏనుగు పిల్ల కనిపించింది. స్వాభావికముగా దయార్ద్రహృదయుడైన ఆ గౌతముడు ఏనుగు పిల్ల మీద జాలిపడి దాన్ని ఆశ్రమానికి తీసుకు వచ్చి పెంచుకున్నాడు. కాలక్రమేణ అది పెరిగి పెద్దదయింది. ఇలా ఉండగా ఒకరోజు ధృతరాష్ట్రుడనే మహారాజు గౌతముని వద్దకు వచ్చి ఏనుగును తనకిమ్మని అడిగినాడు. గౌతముడు తల్లీ తండ్రీ లేని ఈ ఏనుగును నా సొంత బిడ్డలా పెంచుకుంటున్నాను. ఇది నేను లేనప్పుడు నా ఆశ్రమాన్ని పరిరక్షిస్తుంది. యజ్ఞాలకు అడివినుంచి దర్భలు సమిధలు తెస్తుంది. కాబట్టి ఈ ఏనుగును కోరకుఅని చెప్పాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు నీవు అడిగినన్ని గోవులు కావలిసినంత బంగారము ఇస్తాను. ఈ ఏనుగును నాకు ఇవ్వుఅని అన్నాడు. రాజా! దీని చిన్నప్పటినుంచి ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాను. నీవు ఎన్ని గోవులిచ్చినా నాకు అక్కరలేదు. మునివేషములో ఉన్న నాకు హిరణ్యముతో అసలు అవసరములేదుఅని బదులిచ్చాడు గౌతముడు.
ధృతరాష్ట్రుడు మునులకు అవసరమైనవి గోవులుకాని ఏనుగులు కావు. ఐశ్వర్య చిహ్నములైన ఏనుగులు రాజుల వద్దనే ఉండాలి కదా! రాజునైన నేను స్వయముగా వచ్చి ఏనుగును ఇమ్మనినా కాదంటావా?” అని న్యాయం అడిగాడు. అది విని సూక్ష్మబుద్ధి అయిన గౌతముడు పుణ్యాత్ములు ఆనందించే పాపాత్ములు దుఃఖించే యమలోకానికి వేళదాము రా! యమసభలోనే న్యాయనిర్ణయం జరుగనిఅని అన్నాడు.
ధృతరాష్ట్రుడు: నాస్తికులు పాపాత్ములు సహింపరాని బాధలు పడతారు ఆ దారుణమైన యమలోకములో. నేను రాను.
గౌతముడు: సమవర్తి అయిన యమధర్మరాజు వద్దకు వెళదాము. అతనే న్యాయం చెప్తాడు.
ధృతరాష్ట్రుడు: అక్కాచెళ్ళెళ్ళను తల్లిదండ్రులను దయతో చూసుకునే వారే ఆయన దగ్గరకు వెళ్ళగలరు. నేను రాలేను.
గౌతముడు: అయితే వైకుంఠధామ సమానమైన గంగాతీరానికి వెళదాము. వస్తావా?”
ధృతరాష్ట్రుడు: అతిథి అభ్యాగతులకు పెట్టి ఆ తరువాత తినే వాళ్ళే అక్కడికి వెళ్ళి పుణ్యం సంపాదించగలరు. నేనెందుకు వస్తాను?”
గౌతముడు: పోని పవిత్రమైన మేరువనానికి రా!
ధృతరాష్ట్రుడు: సత్యము దయ మృదువర్తనము భూతదయ ఉన్నవాడే అక్కడికి వెళ్ళగలడు. వేరే చోటు చెప్పు.
గౌతముడు: విష్ణుస్వరూపుడైన నారదుని విహారస్థలానికి వెళదాము. పద! అప్సరసలు కిన్నెరులు ఉంటారక్కడ
ధృతరాష్ట్రుడు: సంగీత నృత్యాలతో దేవతార్చన చేసే పుణ్యాత్ములే వెళ్ళగలరక్కడికి. నావల్ల కాదు.
గౌతముడు: అలాగా! అయితే దేవతలు విహరించే ఉత్తర కురుభూములకు వెళదాం రా!
ధృతరాష్ట్రుడు: కామము హింస మొదలైనవి లేని వాళ్ళు అక్కడికి వెళతారు. వచ్చుట నా తరము కాదు.
గౌతముడు: అమృతకిరణాలను ప్రసరించి లోకాలను ఆనందమయము చేసే చంద్రుని వద్దకు వెళదాము. సరేనా?”
ధృతరాష్ట్రుడు: దాననిరతులు పరమ శాంతచిత్తులు అక్కడికి వెళ్ళగలరు. వచ్చుట నాకు సాధ్యము కాదు.
గౌతముడు: సమస్త లోకాలకు అన్నప్రదాత ఆ సూర్యభగవానుడు. ఆయన వద్దకు వెళదాము. దయలుదేరు.
ధృతరాష్ట్రుడు: అమ్మో! తపస్స్వాధ్యాయనిరతులే ఆయన దర్శనము చేయగలరు. నన్ను విడిచిపెట్టు.
గౌతముడు: పోనీ వరుణుడి దగ్గరకు వస్తావా?”
ధృతరాష్ట్రుడు: అగ్నిహోత్రము యాగాలు చేసిన వాళ్ళైతే ఆయన దగ్గరకు వెళ్ళగలరు.
గౌతముడు: దేవరాజైన ఇంద్రుని సన్నిధిలో న్యాయం అర్థిద్దాము.
ధృతరాష్ట్రుడు: శూరులు సోమయాజులు కానీ అక్కడికి వెళ్ళలేరు. నేను రాను.
గౌతముడు: ప్రజాపత్య లోకానికి వెళదాము.
ధృతరాష్ట్రుడు: అశ్వమేధ యాగాలు చేసిన వాళ్ళకు స్థానమది.
గౌతముడు: గోలోకం?”
ధృతరాష్ట్రుడు: తీర్థాలు సేవించినవారు బ్రహ్మచర్య వ్రతం చేసిన వాళ్ళు గోలోకానికి చేరెదరు. నేనెలా రాగలను?”
గౌతముడు: సరే! అయితే బ్రహ్మసభకు వెళదాము రా!
ధృతరాష్ట్రుడు: అసంగులు (లౌకిక బంధాలు లేనివారు) ఆధ్యాత్మవిద్య తెలిసిన వారు వెళ్ళగలరు అక్కడికి. నావంటి వాడు ఆ లోకము చూడనే లేడు.
ధృతరాష్ట్రుని విజ్ఞానము చూసి గౌతముడు మహానుభావా! నీవు దేవేంద్రుడవు. ఏ ఏ పుణ్యాలు చేస్తే ఏ ఏ లోకాలు వస్తాయో దేవేంద్రునికి తప్ప ఇంకెవరికి తెలుసు?” అని పాదాభివందనము చేశాడు గౌతముడు. అయ్యా! నేను మారువేషం ధరిస్తే దేవతలే కనుక్కోలేరు. మీరు మహానుభావులు కాబట్టి నా నిజరూపం గుర్తుపట్టగలిగినారు. మీరు ఈ ఏనుగుతో సహా స్వర్గలోకానికి వచ్చి మమ్ము ఆనందపఱచండిఅని ప్రార్థించాడు దేవేంద్రుడు. సంతోషించి గౌతముడు తన ఏనుగుతో సహా స్వర్గానికి వెళ్ళాడు.
పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాము:
ఏ పుణ్యకార్యములు మనము చేయవలెనో తద్వారా ఏ ఏ పాపకార్యములు మనము చేయకూడదో వివరముగా దేవేంద్రుడు మనకు ఈ కథలో బోధించినాడు. (ధృతరాష్ట్రుడు అంటే శరీరమును ధరించినవాడు. అంటే మానవుడు. కాబట్టి మావనుడు ఏ పుణ్యకార్యాలు చేయాలో మనకు ఈ కథలో తెలిసింది) కానీ అందఱూ అన్నీ చేయలేరు. ఉదాహరణకు కలియుగములో అశ్వమేధ రాజసూయ యాగములు చేసే అర్హత మానవులకు లేదు. కాబట్టి అందఱూ చేయదగ్గ పుణ్యకార్యాలు మనము తప్పకుండా చేయాలి: తల్లిదండ్రుల సేవ, అతిథిసేవ, సత్యం, భూతదయ, గీతనృత్యాదులతో దేవతార్చన, దానము, స్వాధ్యాయనము, తీర్థయాత్రలు, బ్రహ్మచర్య పాతివ్రత్యాది వ్రతములు.


శ్రీకృష్ణ లీలలు ధేనుకాసుర సంహారము



శ్రీ గర్గభాగవతము లోని కథ
బలరామకృష్ణులు వివిధ వర్ణముల గోవులను చక్కగా అలంకరించి చూచువారి కన్నులపండగుగా ఆలమందలను తోలుకొని పోయేవారు. పవిత్రమైన గోధూళి తనపై పడాలని నందకిశోరుడు ఆలమందల వెనుక నడచుచుండెడివాడు. కానీ భక్తి అనే అమృతమును హృదయముల నిండా నింపుకొన్న గోమాతలకు పచ్చికబయళ్ళకన్నా పరమాత్మ సందర్శనమే మిక్కిలిప్రీతిని కల్గించుచుండెడిది. కావున గోమాతలు పరమాత్ముడైన యశోదాతనయుని చూడకపోతే అడుగులు ముందుకు వేసేవి కావు. అందుకని ఆ లీలామానుషవేషధారి తానే ఆలమందల ముందు నడుమ వెనుక ఉండి అందరికి ఆనందమును అందించెడివాడు. భక్తునికి భగవంతునికి గల సంబంధము అవ్యక్తమధురము కదా!


మధురానగరములో తీయ్యని తాటిపండ్లు గల తాళవనము ఒకటి ఉన్నది. కానీ ఆ వనములో నివసించు ధేనుకాసురునికి భయపడి గోపబాలురు ఆ వనములోకి మునుపెన్నడూ ప్రవేశించలేదు. శ్రీకృష్ణుని శక్తిపై పరిపూర్ణ విశ్వాసమున్న గోపబాలురు బలరామకృష్ణులను తాటిపండ్లు అప్పించమని కోరిరి. నిజభక్తుల కోరికలు స్వామి తీర్చకుండునా? వెంటనే బలరామకృష్ణులు తాళవనములో ప్రవేశించి తాళవృక్షములను గట్టిగా వూపిరి. తాళఫలములు క్రిందపడిన ధ్వనులు విని ధేనుకాసురుడు బలరామకృష్ణులను చూచినాడు. బలముగా తన వెనుకకాళ్ళతో బలరామదేవుని నాలుగుక్రోసుల దూరము పడునట్లుగా తన్నెను. చలించని బలదేవుడు వానిని తాళవృక్షమునకేసి కొట్టెను. కుపితుడై ఆ ధేనుకుడు గోపబాలుల వెంటబడెను. నందకిశోరుడు విసిరిగొట్టగా ధేనుకుడు గోవర్ధనిగిరి వద్ద పడి మూర్ఛిల్లెను.
కొంతసేపటికి తేరుకొని ధేనుకుడు నందనందనుని ఆకాశములోకి గొనిపోయి పోరుసల్పెను. పరమాత్మ వానిని నేలపైకి విసిరిగొట్టెను. గోవర్ధనగిరిని బంతివలె ధేనుకాసురునిపైకి విసిరెను. ధేనుకుడు ఆ గిరిని తిప్పికొట్టెను! శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని యథాస్థానములో ప్రతిష్ఠించి బలరామునికి సైగచేసెను. అంతట బలరాముడు పడికిలి బిగించి ధేనుకుని పొడిచెను. రక్కసుడు మరణించెను. వాని తేజము పరమాత్మలో లీనమయ్యెను.



ధేనుకాసురుని వృత్తాంతము:
పరమ విష్ణుభక్తుడైన బలిచక్రవర్తి యొక్క కుమారుడు సాహసికుడు. అహంకారి అయిన సాహసికుడు ఒకనాడు పవిత్రమైన గంధమాదన పర్వతములపై పదివేలమంది వనితలతో విహారములు చేసినాడు. ఆ పవిత్ర ప్రదేశములో ఘోరతపస్సు చేసుకొంటున్న దుర్వాసమహర్షికి సాహసికుని వలన తపోభంగమైనది. మహర్షి ఓరీ! ఏమాత్రమూ వినయవిధేయతలు లేకుండా గార్దభమువలె ప్రవర్తించినావు. పవిత్రమైన ఈ పర్వతముపై విలాసవిహారములు చేసి నా తపస్సును భంగపఱచినావు. గార్దభమువై జన్మించుఅని సాహసికుని శపించెను. చేసిన తప్పుకు పశ్చాత్తాపపడి మహర్షిని శరణువేడినాడు సాహసికుడు. కరుణించి మహర్షి నాయనా! అహంకారముతో మనసుకు నచ్చినట్లు చేయుట వివేకవంతుల లక్షణముకాదు. ఉత్తముడైన వాడు ధర్మబద్ధమైన కార్యములనే చేస్తాడు. కాబట్టి ఎప్పుడూ వినయమును కలిగి ధర్మమార్గముననే నడువవలెను. నీవు చేసిన తప్పుకు ఫలితమును అనుభవించిన తరువాత ద్వాపరయుగములో బలరాముని చేతిలో మరణించి ముక్తిని పొందుతావుఅని ఆశీర్వదించెను. ఆ సాహసికుడే ధేనుకుడు. పూర్వం ప్రహ్లాదుని కాచినపుడు స్వామి ప్రహ్లాదుని వంశమువారిని సంహరించనని వరమిచ్చెను. అందుకనే బలరామునికి ధేనుకాసురిని సంహరించమని సైగచేసెను.
కాబట్టి పిల్లలూ! మనము ఎల్లప్పుడూ వినయ విధేయతలు కలిగి ఉండాలి. మనకు ఇష్టం వచ్చినట్లు చేయక ధర్మబద్ధమైన కార్యములనే చేయాలి.



సత్సాంగత్యము



పెద్దలు చెప్పిన నీతికథ
దేవర్షి అయిన నారదడు సాక్షాత్ శ్రీమహావిష్ణువు యొక్క అవతారరూపుడు. అందుకనే యోగీశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుడు దేవర్షీణాంచ నారదఃఅని అన్నాడు. అట్టి మహనీయుడైన నారదుడు ఒకసారి శ్రీకృష్ణుని దర్శించుటకై వచ్చి దండప్రణామములు చేసి భగవాన్! సత్సాంగత్యము యొక్క ఫలము దయచేసి వివరముగా చెప్పండిఅని కోరినాడు. జగద్గురువైన శ్రీకృష్ణుడు సత్సాంగత్య మహిమ అనుభవపూర్వకముగానే నారదునికి తెలియచేయాలని సంకల్పించి నీవు తూర్పువైపుగా వెళితే ఒక పెంటకుప్ప కనిపిస్తుంది. అందులో ఉన్న పేడపురుగును సత్సాంగత్య మహిమేమని ప్రశ్నించుఅని చెప్పి జగన్మోహనముగా చిరునవ్వునవ్వాడు.
పరమాత్మ ఆదేశానుసారమే చేశాడు నారదుడు. నరద మహర్షి ప్రశ్న అడిగాడోలేదో గిలగిలలాడూతూ ప్రాణాలు విడిచింది ఆ పేడపురుగు. ఇలా జరిగిందేమని దుఃఖిస్తూ శ్రీకృష్ణుని వద్దకు వచ్చి జరిగినదంతా విన్నవించుకొన్నాడు నారదుడు. జరిగినది విని జగన్నాటకసూత్రధారి ఇలా అన్నాడు ఇప్పుడు పశ్చిమదిశగా వెళ్ళు. ఒక పాడుపడిన దేవాలయము అందులో నివసిస్తున్న పావురము కనిపిస్తాయి. నీ సందేహమును అది తీర్చగలదేమో చూడు”. వెంటనే బయలుదేరి పావురమును కలుసుకొని తన ప్రశ్నవేశాడు నారదుడు. అదేమి చిత్రమో ఆ కపోతము నారద మహర్షి పాదలమీద పడి ప్రాణాలు విడిచింది. ఇది ఏమి వింత? ఇంకా ఎన్ని విధాల ఆ భగవంతుడు నన్ను పరీక్షించదలచాడో?” అని చింతిస్తూ శ్రీకృష్ణుని వద్దకు వచ్చి జరిగినది విన్నవించుకొన్నాడు. అలా జరిగిందా నారదా? అయితే ఈ సారి ఉత్తర దిక్కుగా వెళ్ళు. అక్కడి సంస్థానములోని మహారాజుకు చక్కని మగశిశువును పుట్టాడు. నీ సందేహమును ఆ శిశువు తీర్చగలదుఅని చెప్పి చిరునవ్వులొలకబోసాడు లీలామానుషవిగ్రహుడైన నందనందనుడు.
మొదటి రెండు మార్లు జరిగినది తలచుకొని కొంచెం సంకోచించాడు నారదుడు. సర్వజ్ఞుడైన స్వామి అది గమనించి నారదా! నిర్భయముగా వెళ్ళు. ఈ సారి అంతా శుభమే జరుగుతుందిఅని ఆశీర్వదించాడు. వెంటనే నారదుడు బయలుదేరి ఆ శిశువు వద్దకు వచ్చి ఓ పాపాయి! మహాత్ముల సాంగత్యము వలన కలిగే ప్రయోజనమేమిటి?” అని ప్రశ్నించాడు. నారదుడు ప్రశ్నించిన మరుక్షణం ఆ పసిపాప ఒక దేవతగా మారిపోయి భగవత్స్వరూపుడైన నారదునికి యథావిధిగా ప్రణమిల్లి ఆశ్చర్యముగా చూస్తున్న నారదునితో దేవర్షి! అలా ఆశ్చర్య పోతున్నారేమిటి? పెంటకుప్పలోనున్న పేడపురుగును నేనే. అప్పుడు నా జన్మజన్మాంతరాల పుణ్యఫలము వలన అమోఘమైన మీ దర్శన భాగ్యము నాకు కలిగినది. మీవంటి దివ్యపురుషుల సందర్శన మాత్రముచే నాకు పావురము యొక్క జన్మ లభించినది. ఆ జన్మలో కూడా మీ దర్శనభాగ్యము లభించుటచే రాజపుత్రునిగా జన్మించినాను. మరల ఈ జన్మలో మీ దుర్లభ దర్శనము కలిగినందు వలన నాకు దైవత్వము లభించినది. మహాత్ముల సాంగత్యము యొక్క మహిమ ఇంతటిది!అని అంటూ దేవలోకానికి వెళ్ళిపోయాడు.
పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాము:
జగద్గురువులైన ఆదిశంకరులు
సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలితత్వం నిశ్చలితత్వే జీవన్ముక్తిః ||”
అని ఉపదేశించినారు. అంటే జీవన్ముక్తికి ప్రథమ సోపానము సత్సంగత్యము. రాజకుమారుడు చెప్పినట్టు ఆ సత్సంగత్యము పురాకృతపుణ్యము వలన కలుగును. కాబట్టి మనకు మంచిపనులు చేస్తేనే సత్పురుషుల సాంగత్యము తద్వారా జీవన్ముక్తి కలుగుతాయి. ఈ కారణముగానే ఇంద్రునిచే శాపగ్రస్తుడైన యయాతి (యయాతి కథ చూడండి) కూడా కనీసం తనను సత్పురుషుల సాంగత్యములో ఉండనివ్వమని ప్రార్థించి సద్భువనములో ఉండుటకు దేవేంద్రుని వద్ద వరం పొంది తరించాడు. కనుక మనము ఎల్లప్పుడూ మంచివారితో ఉండి వారినుండి మంచిని గ్రహించి తరించాలి. దుష్టులకు ఎల్లప్పుడూ దూరముగా ఉండాలి



ఇంద్రద్యుమ్నుని కథ




మహాభారతము లోని కథ
పూర్వం ఇంద్రద్యుమ్నుడనే రాజేంద్రుడు ఉండేవాడు. అతడు ఎన్నో దానధర్మాలు చేసి ధర్మాచరణలో తనంతటి వాడు లేడనే ఖ్యాతిని పొందినాడు. లెక్కగట్టలేనన్ని గో భూ హిరణ్య దానములు పాత్రులైన వారికిచ్చి అనంత పుణ్యసంపదను ఆర్జించుకొన్నాడు. రాజర్షి అయ్యి ప్రజారంజకముగా పాలన చేసినాడు. అలా ఎన్నో వర్షములు రాజ్యపాలనము చేసి తన పుణ్యనిధి ప్రభావముతో కాలం చెల్లాక స్వర్గం చేరుకొన్నాడు. చాలాకాలము స్వర్గభోగాలు అనుభవించిన తరువాత ఒకరోజు దేవేంద్రుడు ఇంద్రద్యుమ్నుని పిలిపించి
మహాత్మా! నీవు అనేక దానధర్మాలు చేసి ఎంతో పుణ్యమును ఆర్జించినావు కనుక ఇంత దీర్ఘకాలము స్వర్గములో ఉండగలిగినావు. కానీ పరమేశ్వరుని శరణువేడి ఆయన కృపతో పోందెడి మోక్షపదము ఒక్కటే శాశ్వతమైనది (ఇతరములు శాశ్వతములు కావు). నీ పుణ్యఫలమును అనుభవించినావు కావున సర్గమును వీడు సమయము వచ్చినదిఅని చెప్పినాడు. స్వర్గాధిపతి మాటలు విని ఇంద్రద్యుమ్నుడు ఇంతకొద్ది కాలములోనే తన పుణ్యరాసులు ఎలా కరిగిపోయినాయి? అని ఆశ్చర్యపోయినాడు. అది చూసి శచీపతిరాజా! భూలోకములో నిన్ను కానీ నీవుచేసిన సత్కర్మలను కానీ గుర్తుపెట్టుకొన్న వానిని నాకు చూపిస్తే నీవు స్వర్గములోనే ఉండవచ్చు. చేసిన దానములు మహనీయములు కాకపోతే జనులు చిరకాలము గుర్తుంచుకొనరు కదా! కావున నీ దానములను ఎంతకాలము ప్రజలు ఉపయోగింతురో అంతకాలము నీవిక్కడనుండవచ్చుఅని హితవు చెప్పినాడు. ఇంద్రుని ఆజ్ఞతీసుకొని అట్టివారు ఉన్నారేమో వెదకటానికి బయలుదేరినాడు ఇంద్రద్యుమ్నుడు.
చిరంజీవి అయిన మార్కండేయ మహర్షి వద్దకువెళ్ళి నమస్కరించి తపస్విచంద్రమా! నన్ను మీరు ఎఱుగుదురా”? అని అడిగినాడు. అప్పటికి ఎంతోకాలముగా తీర్థయాత్రలుచేసి ఉపవాస వ్రతాలు చేసి కృశించి ఉన్న మార్కండేయ మహర్షి గుర్తులేదని చెప్పినాడు. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు స్వామి! చిరంజీవులైన మీకంటే ముందుపుట్టిన ప్రాణి ఏదైనా బ్రతికి ఉన్నదా”? అని అడిగినాడు. పవిత్ర హిమాలయ పర్వత ప్రాంతములో ప్రావారకర్ణం అనే గుడ్లగూబ ఉన్నదిఅని బదులిచ్చినాడు మార్కండేయ మహర్షి.
వెంటనే ఆ ఉలూకము వద్దకు చేరి అయ్యా! నెన్నెఱుగుదువా”? అని ప్రశ్నించినాడు. తెలియదు అని చెప్పి ఇక్కడికి కొన్ని యోజనాల దూరములో ఇంద్రద్యుమ్నమను సరోవరమున్నది. ఆ సరోవరములో నాడీజంఘమనే కొంగ ఉన్నదిఅని ప్రావారకర్ణం చెప్పగా ఇంద్రద్యుమ్నుడు బ్రహ్మదేవుని స్నేహితుడైన నాడీజంఘుని వద్దకు చేరి ఓ బకరాజా! నన్ను మీరు గుర్తుపట్టినారా”? ప్రశ్నించినాడు.లేదు. ఈ సరోవరములో ఆకూపారమనే తాబేలు ఉన్నది. అది నాకంటే పెద్దది. దానికి నీవు తెలుసేమో కనుక్కోఅని చెప్పినది.
ఇంద్రద్యుమ్నుని చూడగానే ఆకూపార కళ్ళుచెమ్మగిల్లాయి అయ్యా! వెయ్యి యజ్ఞములు సాంగముగా చేసి వెయ్యి యూపస్తంభాలు కట్టించినావు. ఆ యజ్ఞదానాలలో లెక్కకట్టలేనన్ని గోదానాలు ఇచ్చినావు. నీవు దానము ఇచ్చిన గోవుల రాకపోకలతో ఈ భూమి దిగబడి యింత సరోవరము అయినది. ఇది అంతా నీ చలవేఅని కృతజ్ఞతాపూర్వకముగా చెప్పినది. మరుక్షణం దేవతలు దివ్యవిమానములో ఇంద్రద్యుమ్నుని స్వర్గానికి తీసుకొని వెళ్ళినారు.
పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాము:
1.     మన సత్కీర్తి భూలోకములో ఉన్నంత కాలము సర్గలోకము కరతలామలకము. ఆకూపార ఇంద్రద్యుమ్నుడు చేసిన దానములు మరువలేదు కావున ఇంద్రద్యుమ్నునికి పునః సర్గలోక ప్రాప్తి కలిగినది. కానుక మనము నలుగురుకీ ఉపకరించే పనులు చేయాలి. అవియే మనలను రక్షించు సంపదలు (ధనము కాదు).
2.     దేవేంద్రుడు చెప్పినట్టు మోక్షము ఒక్కటే శాశ్వతపదము. ఇంత పుణ్యాత్ముడు కాబట్టే మహావిష్ణువు గజేంద్ర రూపములో ఉన్న ఇంద్రద్యుమ్నునిచే నీవేతప్ప హితః పరంబెఱుగను …” అని అనిపించి అతనికి శాశ్వతమైన మోక్షమును ప్రసాదించినాడు (గజేంద్ర మోక్షము కథ). కావున మోక్షమునకు పుణ్యమే ప్రథమ సోపానము



దీపకుని గురుసేవ



పెద్దలు చెప్పిన నీతికథ
పూర్వం దీపకుడనే నైష్ఠిక బ్రహ్మచారి ఉండేవాడు. అతడొకనాడు శాస్త్రాలలో చెప్పబడిన ఈ సుక్తిని చదివినాడు పతివ్రతకు భర్త పుత్రునికి తల్లిదండ్రులు శిష్యునకు గురువు దైవసమానులు. వీరిని మించిన దైవము లేదు. వీరి సేవను మించిన తీర్థాలు వ్రతాలు ఉపవాసాలు లేవు. తరించుటకు ఇదియే అతిసులభ మార్గముఅని చదివినాడు. వెంటనే గురువును అన్వేషించుటకు బయలుదేరినాడు. పవిత్ర గోదావరీనదీ తీరమున వేదధర్య మహర్షి ఆశ్రమము ఉన్నదని ఆయన సకల వేదవేదాంగాలు తెలిసినవాడని ఉత్తమ గురువు అని ఎందఱో చెప్పగా విని ఆయనను ఆశ్రయించి సాష్టాంగ నమస్కారము చేసినాడు. వినయవంతుడైన దీపకుని శిష్యునిగా స్వీకరించినాడు వేదధర్యుడు. గురుసేవ ప్రభావం వలన తన చిత్తశుద్ధి ఏకాగ్రతల వలన అచిరకాలంలోనే దీపకుడు సకల శాస్త్రాలు నేర్చాడు. అనన్య గురుసేవా నిరతుడై ప్రకాశించాడు.
శిష్యుని విద్యాతేజస్సు చూసి వేదధర్యుడు ఒకనాడు కుమారా! నేను పూర్వజన్మలలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తము చేసుకున్నాను. కానీ రెండు భయంకరమైన పాపాల ఫలము ఇంకా అనుభవించాలి. చేసిన కర్మ చెడని పదార్థముకదా. నేను అతిపురాతనము సనాతనము పవిత్రము సాక్షాత్ విశ్వనాథుని ధామమైన కాశీ క్షేత్రములో ఆ పాపాలకు ప్రాయశ్చిత్తము చేయదలచినాను. పుణ్యక్షేత్రములో ఏ కార్యానికైనా ఫలితము రెండింతలు కదా!
నేను ఆ పాపాలను ప్రాయశ్చిత్తార్థము ఆవాహన చేయగానే భయంకరమైన కుష్ఠురోగం వస్తుంది. శరీరమంతా చీము నెత్తురు కారుతుంటుంది. వికారరూపము అంధత్వము వస్తాయి. నాలో సహనం సాధుత్వం ఆది సద్గుణాలు నశిస్తాయి. కఠినాత్ముడనై ఇతరుల సేవలకై దీనముగా ఎదురు చూస్తుంటాను. అట్టి దుస్థితిలో నీవు నాకు సేవ చేయగలవా”? అని అడిగినాడు వేదధర్యుడు.
గురుసేవయే పరమభాగ్యమని త్రికరణశుద్ధిగా నమ్మిన దీపకుడు గురూత్తమా! నేను మీ పాపాలను ఆవహింప చేసుకొని పాపఫలితాన్ని అనుభవిస్తాను. నాకా అవకాశాన్ని ప్రసాదించండిఅని అన్నాడు. దీపకా! నీ వంశాన్నంతా దీపింపచేయగల వాడవు అలా అనక ఏమంటావు? కానీ ఎవరు చేసిన కర్మకు వారే బాధ్యులు కదా! పుణ్యమైనా పాపమైనా ఫలితమును అనుభవించక తప్పదు కదా! నా పాపాలను కడుక్కుంటే గాని ఈశ్వర సాన్నిధ్యాన్ని పొందలేనుఅని వేదధర్యుడు చెప్పినాడు. గురు ఆజ్ఞప్రకారమే చేశాడు దీపకుడు. ఇద్దరు మణికర్ణికా ఘాట్ కు ఉత్తరంగా ఉన్న కమలేశ్వర మహాదేవ మందిరం వద్దకు చేరి అక్కడ బస ఏర్పాటు చేసుకున్నారు. కశీ విశ్వనాథునికి అన్నపూర్ణాభవానీకి పూజలుచేసి పాపాల ఆవాహన చేశాడు వేదధర్యుడు. గురువుగారు చెప్పినట్టే జరిగింది.
గురువుగారి దుస్థితి చూసి ఎంతో బాధపడ్డాడు దీపకుడు. చీము నెత్తురు తుడిచి కట్టు కట్టి మలమూత్రాదులను కడిగి అతని శుభ్రపఱచే వాడు దీపకుడు! ప్రతిపూట దీపకుడు తెచ్చిన భిక్షను తానే తినేసి ఇంత కొంచెం తెచ్చావెందుకుఅని నిష్ఠూరాలాడేవాడు వేదధర్యుడు. అతడెంత కోపించినా గద్దించినా ధర్మనిష్ఠతో నిరంతర గురుసేవ చేసినాడు ఆనందపరశుడై దీపకుడు.
అంబికానాథుడు దీపకుని అసమాన గురుభక్తి మెచ్చి వత్సా! నీ అనన్య గురుసేవా దీక్షను మెచ్చినాను. ఏమి వరము కావాలో కోరుకోఅని అన్నాడు. గుణనిధి అయిన దీపకుడు స్వామి! నాకు ఈ లోకములో గురుసేవ తప్ప ఏదీ తెలియదు. వారి అభీష్టమేమో కనుక్కొని చెప్తానుఅని అన్నాడు దీపకుడు. గురువుగారికీ విషయం చెప్పి గురుదేవా! మీకు స్వస్థత కోరుతానుఅని అన్నాడు. వేదధర్యుడు నాయనా! ఎవరు చేసిన పాపాలకు ఫలితం వారు అనుభవిస్తేనే పోతాయిఅని చెప్పాడు.
మరునాడు విశ్వనాథుని ఆలయానికి వెళ్ళి ఏ వరమూ కోరలేదు దీపకుడు. భగవంతుడు ఆ దీపకుని చూసి మురిసిపోయి జగజ్జనని అయిన పార్వతీదేవితో అతని విషయం చెప్పి సంబరపడిపోయాడు. తరువాత నిర్వాణ మండపములో ఉన్న శ్రీమన్నారాయణునికి సమస్త దేవతలకు దీపకుని సంగతి చెప్పి పొగిడినాడు. మహావిష్ణువు పరమశివుని మెప్పించిన నీ గురుభక్తి అసామాన్యము. నీ మనోభీష్టమును కోరుకోఅని అన్నాడు. అందఱికీ సాష్టాంగవందనము చేసి ఆనందాశ్రువులతో స్వామీ! నాకు అచంచలమైన గురుభక్తిని ప్రసాదించుఅని అడిగినాడు. తథాస్తుఅని దీవించి దీపకుని కృతార్థుని చేసినాడు మహావిష్ణువు.
పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాము:
1.     గురువును సేవిస్తే సకల దేవతలనూ సేవించిన ఫలితం వస్తుంది. దీపకుడు తన గురుసేవానిరతితో త్రిమూర్తుల సమస్త దేవతల అనుగ్రహాన్ని పొందినాడు.
2.     కర్మ పాశం తెగనిది. పాపకర్మలకు ప్రాయశ్చిత్తము ఎంత ఘోరముగా ఉన్నదో మనము ఈ కథలో చూచినాము. కావున పాపకర్మలెన్నడు చేయరాదు

 






Om Tat Sat
                                                        
(Continued...) 

 

(My humble greatfulness to Neethi Kathalu  dot com and  Hindu dot com for the collection)



(మన భారతీయ సంస్కృతికి సవినయ నివాళి )

0 comments:

Post a Comment

About Me

My Photo
gopalakrishna
View my complete profile

Visitors

free counters

Visitors

free counters
Powered by Blogger.

Visitors

Labels