నీతి కథలు - 6































నీతి కథలు






శ్రీకృష్ణ లీలలు యమళార్జున భంజనమ్




శ్రీ మద్భాగవతము లోని కథ
అల్లరి నల్లనయ్య తల్లిమీద కినుకబూని దధిభాండమును పగులగొట్టాడు. పొరుగింటిలో దూరి ఱోలు తిరగవేసి దానిమీదకెక్కి ఉట్టిమీదనున్న వెన్నను తీసి ఒక కోతికి ఇచ్చాడు. ఇటువంటి అల్లరి పనులు చేస్తున్న దొఱదొంగను చూచి యశోదకన్నయ్య! నీవింతవరకూ ఎవరికి చిక్కలేదనీ ఎవరూ నీ ముద్దుమోము చూచి నిన్ను శిక్షించలేదనీ బొత్తిగా అదురూ బెదురూ లేకుండా అల్లరి పనులు చేస్తున్నావు. ఇవాళ ఎలా తప్పించుకుంటావో చూస్తానుఅని అన్నది. బెత్తం తెచ్చి కొడుకును బెదిరించడానికి వచ్చిన యశోద తన మదిలో ఇలా అనుకున్నది ఇతడు పసివాడు అనుకొందామంటే కనీవినీ ఎఱుగని అత్యబ్ధుత కార్యాలు చేస్తున్నాడు. బెదిరించి బుద్ధులు నేర్పుదామనుకుంటే తనంతట తానే బుద్ధిగా ఉంటున్నాడు. అలాగని వీడు చూడని చోటులేదు ఎక్కరలేని విషయములేదు. భయము అంటూ ఒకటుందని వీడికి తెలీనేతెలియదు. నాన్నా! సాహసాలు మానరా! ప్రమాదమురా! అని చెప్పినా వినడు”. ఇలా పరిపరి విధాల తలచి ఆ యశోద చివరికి అతి గారాబము చేస్తే పిల్లలు బాగా చెడిపోతారు. అప్పుడప్పుడు నయానో భయానో మంచి గుణాలు అలవాటు చేయాలి. దుడుకుగల పిల్లలకు దండోపాయమే మంచిదిఅనుకుని ఆ మాయలయ్యను బెత్తంతో జళిపించింది.
శ్రీకృష్ణుడు భయపడినట్టు నటించి ఱోలు మీదనుంచి అందెలు ఘల్లుఘల్లుమని మ్రోగుతుండగా అతివేగముగా పారిపోయాడు. ఆ తల్లి బాలకృష్ణుని వెనకాల పరుగులెట్టింది.

తనను పట్టుకోలేక అలసిపోయిన తల్లిని చూసి జాలిపడి ఆ పరమాత్మ ఆమెకు దొరికిపోయాడు! పరమయోగీశ్వరులకు సంయములకు మునులకు దొరకని ఆ భగవంతుడు భక్తురాలైన యశోదకు దొరికిపోయాడు. కన్నతండ్రిని పట్టుకున్నదే కానీ కొట్టడానికి చేతులు రాలేదు ఆ తల్లికి. యశోదాదేవి శరీరము స్వభావముకూడా పువ్వువలె మెత్తనివి. బిడ్డ మీద జాలితో దండించలేక త్రాటితో ఱోకటికి (ఉలూఖలమునకు) కట్టివేయాలనుకొన్నది. ఒక పెద్ద త్రాడు తీసుకువచ్చి ఆ బాలకృష్ణుని గట్టిగా కట్టబోయింది. కాని ఆ త్రాడు రెండంగుళాలు తక్కువయ్యింది. మరొక త్రాడు దానికి జతచేసినా మళ్ళీ రెండంగుళాలు తక్కువైనది. యశోద ఇంటిలోనున్న త్రాళ్ళన్నీ జతచేసినా ఆ నల్లనయ్య సన్నటి నడుమును చుట్టలేకపోయింది. ముజ్జగాలు దాగివున్న ఆ చిరు బొజ్జను కట్టుట ఎవరితరము? అలసిపోయిన తల్లిపై జాలిపడి నందకిశోరుడు కట్టుబడిపోయాడు. భక్తులకు పట్టుబడినట్టుగా భగవంతుడు జ్ఞానులకుగానీ మౌనులకుగానీ దానపరులకుగానీ యోగీశ్వరులకుగానీ పట్టుబడడుగదా!


యశోదాదేవి శ్రీకృష్ణుని ఇలా ఱోటికి కట్టివేసి ఇంటిపనులలో మునిగిపోయింది. బాలకృష్ణుడు ఆ ఱోలు ఈడ్చుకుంటూ పెరట్లో చాలాకాలముగా శాపగ్రస్తులై మద్దిచెట్లుగా ఉన్న నలకూబర మణిగ్రీవుల దగ్గరకువెళ్ళి వారిని కరుణించదలచి ఆ రెండు చెట్ల మధ్యనుంచి రోటిని లాక్కుంటూ వెళ్ళాడు. దానితో ఆ యమళ అర్జున వృక్షాలు కూలిపోయినాయి. అందునుంచి దిఙ్మండలము ప్రకాశింపచేయు ఇద్దరు అగ్నితుల్యులగు దివ్య పురుషులు వచ్చి స్వామిని స్తుతించి అతని అనుజ్ఞతీసుకుని కర్తవ్యొన్ముఖులై వెళ్ళిపోయారు.



యమళార్జునుల వృత్తాంతము:
నలకూబరమణిగ్రీవులు పరమశివుని ప్రియసఖుడైన కుబేరుని పుత్రులు. వారు చాలా ధనగర్వముతో ఉండేవారు. రుద్రానుచరులై కూడా ఒకసారి వారు అతి పవిత్రమైన కైలాసపర్వతములోని ఒక సుందర ఉద్యానవనములో స్త్రీలతో కూడి వహారము చెసినారు. మదోమత్తులై వారుణి అను మదిరను పానముచేసినారు. వారు పద్మవనములో ఉన్న గంగలో జలక్రీడలాడ సాగినారు. అప్పుడు పరమపూజ్యుడైన నారదమహర్షి వారి పురాకృత సుకృతమువలన అక్కడికి వచ్చాడు. నారదుని చూసి ఆ దేవతాస్త్రీలు లజ్జితులై వెంటనే వస్త్రములు ధరించారు. కానీ మదిర ప్రభావములో ఒళ్ళు మరచిపోయిన ఆ కుబేరపుత్రులు వస్త్రములను ధరించలేదు.



ఆ దేవకుమారుల అజ్ఞానమును చూచి నారదుడు ఇలా అన్నాడు ధనగర్వము ఎంతటి గొప్పవారినైనా నాశనము చేస్తుంది. ధనగర్వితులైన వారు మద్యపానము జూదము స్త్రీసంభోగము వంటి దుర్వ్యసనములకు లోబడి అనేక పాపకార్యాలు చేయుదురు. నిర్దయులై మనోవినోదముకై పశువులను వధించెదరు. నశ్వరమైన దేహనుము శాశ్వతమైనదని నమ్మి దేహసౌఖ్యమే పరమానందము అనుకొనెదరు.
మద్యపానమత్తులై నగ్నముగా ఉండి ఘోరాపరాధము చేసిన వీరు స్థావరత్వమును పొందుటకు తగియున్నారు. మరల వీరెన్నడూ ఇట్టి అకార్యములు చేయకుండుటకై నా అనుగ్రహమువలన వీరికి పూర్వజన్మ స్మృతి ఉండును. నూరుదివ్యవర్షములు చేసిన తప్పుకు పశ్చాత్తాపము నొంది పునీతులై నా అనుగ్రహముచే కృష్ణభక్తులై దైవత్వమును పొందగలరు”. ఆ కుబేర పుత్రులే యమళార్జునులు.
పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాము:
1.     వస్త్రధారణము యొక్క ప్రాముఖ్యత మనకు ఈ కథ ద్వారా తెలిసినది. ఎప్పూడూ సరిగా వస్త్రములేకుండా ఉండరాదని నారదమహర్షి మనకు చెప్పాడు.
2.     వారుణి అనే మదిర ప్రభావములో ఉండి తప్పని తెలిసికూడా నలకూబరమణిగ్రీవులు వస్త్రధారణము చేయలేదు. మదిరాపానం వలన మానవుడు తెలియకనే అనేక పాపాలు చేస్తాడు. పంచమహాపాతకాలలో మొదటిది ఈ మదిరాపానమే. అందుకని మనమిట్టి దుర్వ్యసనములకు ఎల్లప్పుడూ దూరముగా ఉండాలి.
3.     ధనగర్వము ఉండరాదని నారదమహర్షి మనకు ఉపదేసించాడు. శివానుచరులై ఉండికూడా కేవలము ధనగర్వము వలన కుబేరపుత్రులు వారి దైవత్వాన్ని కోల్పోయారు.
4.     తీర్థాలు పుణ్యక్షేత్రాలు సిద్ధప్రదేశాలు ఎప్పుడు విహార దృష్టితో వెళ్ళరాదని మనకు ఈ కథ ద్వారా తెలిసినది



ఎన్నడూ పారుష్యపు మాటలాడరాదు




మహాభారతము లోని కథ
నహుష మహారాజు ప్రియంవద యొక్క పుత్రుడు యయాతి. అతడు ఎంతో కాలము ధర్మము తప్పకుండా రాజ్యపాలన చేసి యోగ్యుడు పితృవాక్య పరిపాలకుడు అయిన పూరువునికి రాజ్యభారమొసగి వైరాగ్యముతో తపోవనాలకు తపస్సుకై వెళ్ళిపోయాడు. వేదవేదాంగ పాఱంగులైన పండితులను తోడుగా తీసుకుని కందమూలాదులను భుజిస్తూ కఠిన నియమ వ్రతాలతో తపస్సు సాగించాడు. యయాతి ఆ తపోవనాలలో ఎన్నో యజ్ఞ యాగాదులు చేశాడు. హవిస్సులతో దేవతలను తర్పణలతో పితృదేవతలను సంతోషపెట్టాడు. కామ క్రోధాది అరిషడ్వర్గాలను జయించి సహస్ర దివ్యవర్షములు తీవ్ర నిష్ఠతో తపస్సు చేశాడు. ముప్పది ఏండ్లు నిరాహారిగా ఒక్క ఏడాది వాయుభక్షణ చేసి తరువాత పంచాగ్నుల మధ్యలో నిలిచి తపస్సు చేశాడు. అటు తరువాత ఒక్క ఏడాది సముద్రమధ్యములో ఒంటికాలుమీద నిలబడి ఏకాగ్రతతో తపస్సు చేశాడు. ఇలా తపస్సు చేసి తన అనంత పుణ్యనిధి ప్రభావంవల్ల దివ్యవిమానములో దేవలోకానికి వెళ్ళాడు.
అక్కడ దేవర్షుల పూజలందుకొని బ్రహ్మలోకం చేరాడు. అక్కడ అనేక కల్పములు ఉండి బ్రహ్మర్షుల చేత పూజలందుకొన్నాడు! ఆ తరువాత ఇంద్రలోకాని వచ్చాడు. ధర్మాత్ముడు మహాతపశ్శక్తి సంపన్నుడు అయిన యయాతి వచ్చాడని తెలిసి దేవేంద్రుడు స్వయముగా వచ్చి అతిథికి అర్ఘ్యపాద్యాదులిచ్చి సత్కరించాడు. మహావిభవోపేతుడైన ఇంద్రుడు ఆ యయాతిని యథావిధి పూజించి ఇలా అన్నాడు ఏమి తపస్సు చేశావయ్య మహానుభావా? నువ్వు సామాన్యుడవు కావు! శతసహస్ర వర్షముల తపస్సు సామాన్యులకు సాధ్యమా?”.
సాక్షాత్ దేవేంద్రుడంతటివాడు ఇలా పొగిడేసరికి యయాతి ప్రారబ్ధవశాత్తు ఇలా పారుష్య వాక్యాలు అన్నాడు ఓ అమరేంద్రా! సుర దైత్య యక్ష రాక్షస నర ఖేచర సిద్ధ మునిగణముల తపస్సులు నా తపస్సుకు సాటిరావు”. “ఔరా! ఇంత గొప్పవాడయ్యికూడా గర్వమును వీడలేదు కదా!అని అనుకొని ఇంద్రుడు యయాతితోమహనీయులైన మహర్షుల తపస్సులను గర్వముతో కించపఱచినావు. లోకశ్రేయస్సుకై తమ జీవితాలను ధారపోసిన ఆ మహనీయులనెన్నడూ అవమానించరాదు. ఓ యయాతి! ఈ ఒక్క మాటతో నీవు సంపాదించుకొన్న తపశ్శక్తి అంతా అంతరించిపోయింది. ఇక నీకు ఈ లోకములో ఉండటానికి అర్హతలేదు. అధోలోకానికి పోఅని శపించాడు.
తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపముతో శరణువేడి యయాతి ఓ దేవేంద్రా! ఏ క్షణాన నేను పూజ్యులైన మహర్షులను అవమానించానో ఆ క్షణమే నా శక్తి అంతా కరిగిపోయింది. నన్ను అధోలోకాలకు పంపకు. నాకు సత్సంగత్యం లేకుండా చేయకు. సత్ భువనములో సత్పురుషుల సాంగత్యములో నన్ను ఉండనివ్వుఅని ప్రార్థించాడు. పశ్చాత్తాపముతో కుమిలిపోతున్న యయాతిని కరుణించి దేవేంద్రుడు యయాతికి సద్భువనములో నివసించుటకు అనుజ్ఞ ఇచ్చాడు.
సద్భువనములో ఉండి ఆ యయాతి అచిరకాలములోనే అనంత తపశ్శక్తిని మళ్ళీ సంపాదించాడు. అహంకారమును పూర్తిగా విడిచి మహాతేజోమయుడయ్యాడు. ఇలా ఉండగా ఒకసారి ఆ యయాతి దౌహిత్రులైన అష్టకుడు ప్రతర్దనుడు వసుమంతుడు ఔసీనరుడు మరియు శిబి సద్భువనమునకు వచ్చిరి. అనంతపుణ్యసంపదతో వెలిగిపోతున్న యయాతిని పూజించి స్వామి! మీరెవరుఅని అడిగారు. యయాతి తన కథను చెప్పి నాయనలారా! ఎంత కొంచెమైనా గర్వము ఎన్నడు ఉండరాదు. గర్వముతో నేను పారుష్యవాక్యములు మాట్లాడి ఉత్తములైన మహర్షులను అవమానించినాను. మీరెన్నడు అట్టి తప్పుచేయవద్దు. వాక్పారుష్యము విషము కన్నా అగ్ని కన్నా భయంకరమైనదిఅని హితవు చెప్పాడు. యాయాతిని తమ తాతగారిగా గుర్తించి నమస్కరించి ఆయనవద్ద ఎన్నో రహస్యములైన ధర్మోపదేశాలు పొందారు అష్టకాదులు.
పిల్లలూ! మనమీ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాము:
1.     గర్వము అహంకారము ఎంత కొంచెముగా ఉన్నా హాని కాలుగచేస్తాయి. ఒక్కచిన్న పారుష్యవాక్యము వలన తన తపశ్శక్తినంతా పోగొట్టుకున్నాడు యయాతి.
2.     ఎన్నడూ ఉత్తములను అవమానించరాదు. మహర్షుల తపస్సులు తన తపస్సుతో సాటిరావని అని యయాతి వారిని అవమానించాడు.
3.     ఒక సజ్జనుడెన్నడూ తప్పుచేయడు. పొరబాటుగా చేసినా దానికి పశ్చాత్తాపము చెంది ఆ తప్పు నెన్నడు మళ్ళీ చేయడు. సజ్జనుడైన యయాతి తను చేసిన తప్పును దౌహిత్రుల వద్ద చెప్పుకొని ఆ తప్పు చేయవద్దని హితవు చెప్పాడు.
4.     ఒక మనిషి యొక్క ఉద్ధారణకు సత్సంగత్యం చాలా అవసరము. ఈ విషయం తెలిసిన యయాతి సత్సంగత్య భాగ్యము కలిగించమి ఇంద్రుని కోరుకున్నాడు.




భక్త పురందరదాసు కథ



పూర్వం విక్రమార్క శకం 16వ శతాబ్దములో నవనిధి శ్రీనివాసనాయకుడనే గొప్పధనవంతుడు ఉండేవాడు. అతడు పరమ లోభి. భార్య సరస్వతీబాయి భక్తురాలు దానగుణశీలి. పతియే ప్రత్యక్షదైవమని నమస్కరించిన ఆ సాధ్వితో శ్రీనివాసనాయకుడిలా అనేవాడు ఏమని ఆశీర్వదించను? అంకా దానధర్మాలు చేయమనా?” “స్వామీ! మీ ఆనుజ్ఞ తీసుకునే నేనీ వ్రతము ఆచరించితిని కదా!అని బదులిచ్చిన భార్యతో ఆ! ఆ! పొందితివి పొందితివి. తులసీపూజయే కదా ఖర్చు ఉండదులే అనుకున్నాను. కాని ఆ పేరుతో దంపతి పూజలు దానాలు ఒక్కటేమిటి అన్నీ చేశావు. నీ సుపుత్రుడు వరదుడు లెక్క చూపిన తరువాతే నాకీ విషయం తెలిసింది. నువ్విలాంటి నాగులు వ్రతాలు చేస్తే చాలు మనమందఱము తలకొక జోలె పట్టుకోవలసి వస్తుందిఅని అనేవాడు శ్రీనివాసనాయకుడు.
రామ! రామ! అట్లా అనకండి. భగవంతుడు మనకు ఇచ్చినప్పుడే దానాదులు చేయకుంటే లేనప్పుడీయ గలమా”? అని సత్యం పలికిన సరస్వతీబాయితో శ్రీనివాసనాయకుడుఇందులో భగవంతుడిచ్చినది ఏమున్నది? మా తాతముత్తాతలు మా నాన్నగారు నేను ఎంతో శ్రమించి ఆర్జించినదే కదా!అని అనేవాడు. దానధర్మాదులకు ఉపయోగపడని ధనమెందులకు స్వామి? ఇట్టి సత్కార్యములే సద్గతులకు చద్ది మూటలని సాధుసజ్జనులంటారుఅని హితవు చెప్పిన భార్యతో భర్త ఆ సన్యాసుల మాటలకేమిలే వాళ్ళలానే అంటారు. అవన్నీ ఆచరిస్తూ కూర్చుంటే మనకు మిగిలేది బూడిదే! చూడు సరస్వతీ! ధనమూలమిదం జగత్ అన్నారు. ఆ సిరి యొక్క గరిమ ఎంతో కష్టపడి సంపాదించిన నాకు తెలుసుఅని అనేవాడు. ఆ భార్యా భర్తల సంభాషణములు ఇలా ఉండేవి!
శ్రీనివాసనాయకుని అనంత పూర్వజన్మ పుణ్యమో లేక సరస్వతీబాయి అఖండ సౌశీల్య మహాత్మ్యమో పుట్టు లోభి అయిన శ్రీనివాసనాయకుని భక్త పురందరదాసుగా మార్చా అనుకున్నాడు పాండురంగ విఠ్ఠలుడు. ఏ దుర్గుణాన్నైనా నివారించవచ్చును కానీ లోభగుణాన్ని మార్చుట దుష్కరం అని అనుకున్న స్వామి స్వయంగా ఆ శ్రీనివాసనాయకుని వద్దకు ఒక బ్రాహ్మణుని వేషంలో వచ్చాడు. ఎవరి పాదాలకు సకల చరాచర జీవులు ముక్తికై చేతులుజోడించి నమస్కరిస్తాయో అట్టి స్వామి శ్రీనివాసనాయకుని ముందర నిలిచి ఏదైనా దానమివ్వమని యాచించేవాడు! కసురుకుంటూ వెళ్ళగొట్టేవాడు నాయకుడు.
భగవంతుడు శ్రీనివాసనాయకుడెన్ని అవమానాలు చేసినా రోజూ పుత్రవాత్సల్యంతో వచ్చి ఏదో ఒకటి దానమిమ్మని అర్థించేవాడు. భగవంతుడు ఎన్ని సార్లు అడిగినా ఆ శ్రీనివాసనాయకుడు ఒక్కసారికూడా ఏమీ ఇవ్వలేదు. ఇలా ప్రతిరోజు ఆ లక్ష్మీపతి శ్రీనివాసనాయకుని మార్చడం కోసం పడరాని పాట్లు పడ్డాడు. బహుశః ఇందుకేనేమో ఆ భగవంతుడు ఆశ్రితపక్షపాతి అని నిందింపబడినాడు. నీవే తప్ప ఇతరమెఱుగనని శరణువేడిన సరస్వతీబాయిని రక్షించటానికే నేమో ప్రాయశః స్వామి ఇన్ని పాట్లుపడ్డాడు. లేదా కర్మయే పరమాత్మ అన్న నిజం నిరూపించేలా శ్రీనివాసనాయకుని పూర్వజన్మల పుణ్యానికి ఫలముగా ఇలా అనుగ్రహించదలచినాడో స్వామి. ఆ పన్నగశాయి లీలలు అర్థం చేసుకోవటం ఎవరి తరము?
ఏమైనా సరే నీకేమీ ఇవ్వనుఅని నిక్కచ్చగా అన్నాడు ఒకరోజు విప్రవేషంలో ఉన్న భగవంతుని చూసి శ్రీనివాసనాయకుడు. అయ్యా! వీడు నా ఒక్కగానొక్క కొడుకు. వీడికి ఉపనయనం చేయాలని సంకల్పించాను. ఓం ప్రథమంగా మీ వద్దకొచ్చాను. మీరు దయతో ఏది ఇచ్చినా తీసుకుంటానుఅని అడిగాడు భగవంతుడు. ఏది ఇచ్చినా తీసుకుంటావా?” అని రెట్టిస్తూ నేను ఇచ్చేది కిం అనక తీసుకు వెళిపోవాలిఅని అంటూ ఇల్లంతా వెతికి వెతికి తుప్పు పట్టిన కాణీ బిళ్ళ తెచ్చి విఠ్ఠలునికి ఇచ్చి పంపించి పీడా వదిలిందిఅనుకున్నాడు.
ఏదో పనిమీద నాయకుడు బయటికెళ్ళాడోలేదో మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు విఠ్ఠలనాథుడు. అమ్మా! నాకు సహాయం చేయండిఅని అన్నాడు స్వామి. ఇందాకే కదయ్య మా ఆయనిచ్చారు?” అని అన్నది ఆ ఇల్లాలు. ఆ తుప్పుపట్టిన కాణీ చూపించాడు స్వామి. ఖిన్నురాలై నిస్సహాయిగా నిలుచున్న ఆమెను చూసి పరమాత్మఅమ్మా! మీ ముక్కెర ఇప్పిస్తే నా అవసరం తీరుతుందిఅని అన్నాడు. నీళ్ళునములుతూ యాచించిన ఆ పేద బ్రాహ్మణుని చూసి జాలిపడి సరస్వతీబాయి వెంటనే తన ముక్కెర తీసి ఇచ్చింది. మనసారా ఆశీర్వదించి ముక్కెర తీసుకుని స్వామి వెళ్ళిపోయాడు.
విప్రునికి ముక్కెర ఇచ్చింది కాని భర్తకు ఏమని సమాధానం చెబుతుంది? ఏమి చేయాలిరా భగవంతుడా అని వ్యాకుల పడుతుండగా ఆమె ప్రాణాలపాలిటి రెండో కాలునిలా శ్రీనివాసనాయకుడు వచ్చి ఏదీ నీ ముక్కెర?” అని ప్రశ్నించాడు. లోభికి ధనం తప్ప ఇంకేదీ కానరాదు కదా! ఎక్కడుందో వెతికి తెమ్మన్నాడు భర్త. రంగ రంగ! ఏమి లీల స్వామి? నాకు దిక్కెవ్వరు?” అని భగవంతునికి మొరపెట్టుకుంది సరస్వతీబాయి. ఇది ఏమైనా సత్యయుగమా చమత్కారాలు జరగడానికి?” అని అనుకుని మరణమే శరణ్యమని నిశ్చయించుకున్నది.
ప్రేమతో అటుకులిచ్చినందుకే స్వామి సుదామునికి అనంత ఐశ్వర్యాలు కడకు కైవల్యమిచ్చాడు. ఇక అవసరానికి ఏమీ సంకోచించక అడిగనదే తడవుగా ముక్కెర ఇచ్చిన ఆ సాధ్విని మఱుస్తాడా స్వామి? “సాధ్వీ! నీ దానగుణానికి భక్తికి మెచ్చాను. ముక్కెర ధారపోసి ముక్తేశుడనైన నన్ను కొన్నావు. ఇదుగో! ముక్తిని తులతూచిన నీ ముక్కెరఅన్న భగవంతుని అంతర్వాణి వినిపించింది సరస్వతీబాయికి. ఎంతో సంతోషంతో ముక్కెర తీసుకొని భర్త దగ్గరకు వెళ్ళింది. అదిచూసి అవాక్కయ్యాడు నాయకుడు. విప్రుడు తన వద్దకే వచ్చి ముక్కెర అమ్మాడు. విషయము తెలిసింది ఆ దంపతులకు. రోజూ విప్రవేషంలో వచ్చి యాచించినది ఆ విఠ్ఠలేశుడే అని అవగతమైంది ఆ దంపతులకు. వడివాయక తిరిగే ప్రాణబంధుడు స్వామిఅన్న సత్యం తెలుసుకున్నాడు నాయకుడు. ఆ రోజునుండి ఎన్నో దానధర్మాలుచేస్తూ భగవంతుని భక్తితో కొలుస్తూ తరించారు ఆ దంపతులు. దాదాపు నాలుగు లక్షల సంకీర్తనలు గానంచేసి భక్త పురందరదాసుగా ప్రసిద్ధికెక్కాడు శ్రీనివాసనాయకుడు.

పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాము:
1. కర్మఫలం అమోఘమైనది. శ్రీనివాసనాయకుని పూర్వ పుణ్యం వలన భగవంతుడు స్వయంగా వచ్చి అతనిలోని లోభగుణాన్ని పోగొట్టి కాపాడినాడు.
2.
ఇంటికి దీపం ఇల్లాలు అని పెద్దలంటారు. ఆ సూక్తికి తార్కాణం సరస్వతీబాయి. సుశీలవతి అయిన సరస్వతీబాయి తన సుగుణాలతో స్వామిని మెప్పించి తనను తానే కాక తన భర్తను కుడా తరింపచేసింది.
3.
లోభం చాలా భయంకరమైన దుర్గుణము. సాక్షాత్ ఆ భగవంతునికే శ్రీనివాసనాయకుని లోభగుణం మార్చడానికి అంత శ్రమ పడవలసి వచ్చింది. మనమెన్నడూ ధనకాంక్షులము కారాదని దానధర్మాలు చేయాలని మనకీ కథద్వారా తెలిసినది.


శ్రీకృష్ణ లీలలు తృణావర్త భంజనమ్




గర్గభాగవతము లోని కథ
ముద్దుకృష్ణుని ఒడిలో కూర్చుండబెట్టుకొని ఆడించుచున్నది మహాభాగ్యశాలి అయిన యశోదాదేవి. అప్పుడు తృణావర్తుడనే రక్కసుడు పెద్ద సుడిగాలి రూపములో అక్కడికి వచ్చెను. కొండంత బరువెక్కిన తయుని భారము భరించలేక యశోద శ్రీకృష్ణుని నేలపైకి దించెను. జంతువులు ప్రజలు ఇంటిపైకప్పులు సైతం ఆ పెనుగాలికి ఎగురదొడగెను. ధూళి రేగగా శ్రీకృష్ణుడు యశోదకు గోపికలకు కనబడలేదు. ఆందోళనతో వారు ఆ పరమాత్ముని వెదుకసాగిరి.
చిన్నికృష్ణుడు తృణావర్తుని వెంట మింటికెగసి ఆతని వీపుపైకి ఎక్కెను. అండపిండవేదోండ సహతులను గుప్తగతి బొజ్జలో ఉంచుకొన్న స్వామి భారము మోయలేక ఆతని క్రిందికి వసరికొట్టబోయెను తృణావర్తుడు. పాపం పండిన దానవుని గొంతునులిమి శ్రీకాంతుడు భూభారము దించెను.


నేలగూలి ప్రాణములువిడిచిన అసురుని శరీరముపై ఏమీ ఎఱగనట్టు ఆడుకుంటున్న బాలకృష్ణుని చూసి బాలకుడు క్షేమముగా ఉన్నాడని సంతోషించి యశోద శ్రీకృష్ణుని ముద్దాడి దిష్టి తీసి వేదాశీర్వచనము చేయించెను. ఎన్నో గో భూదానములు పండిత మండలికి ఇప్పించెను.



తృణావర్తుని వృత్తాంతము
పూర్వం పాండుదేశమును సహస్రాక్షుడను మహారాజు పరిపాలించుచుండెడివాడు. ఆతుడు మిక్కిలి భగవద్భక్తుడే కాని స్త్రీలోలుడు. సీతమ్మ చెప్పినట్టు (సత్యసంధః కథ చూడండి) ఎవడైతే వ్యసనాలకు దూరముగా ఉంటాడో వాడే ధర్మమార్గాన నడువగలడు. కామాంధుడైన ఆ సహస్రాక్షుడు దూర్వాసమహర్షి వచ్చాడని ఎఱిగియూ ఆతనికి నమస్కరించలేదు. వ్యసనపరుడై పూజ్యపూజావ్యతిక్రమ దోషము చేసిన సహస్రాక్షుని రాక్షసుడివి కమ్మని ఆ మహర్షి శపించెను. తన తప్పు తెలుసుకొని ప్రాయశ్చిత్తముతో శరణువేడిన ఆ సహస్రాక్షుని మహర్షి మన్నించి రాజా! ఈ దుష్కార్యమునకు ఫలితమనుభవింపక తప్పదు. చేసిన కర్మ చెడని పదార్థము కదా! కానీ భక్తుడవైన నీకు పరమాత్ముడైన శ్రీకృష్ణుని పాదస్పర్శచే కైవల్యము ప్రాప్తించునుఅని ఆశీర్వదించెను. ఆ సహస్రాక్షుడే తృణావర్తుడు.
పిల్లలూ! మనమీ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాము:
మానవుడు అన్ని వ్యసనములనుండి ఎల్లవేళలా దూరముగా ఉండవలెను. పరమ భక్తుడైనా ఒక్క స్త్రీలోలత్వం అనే వ్యసనము వలన దుష్కర్మ చేసి శాపగ్రస్తుడైనాడు సహస్రాక్షుడు.



దధీచి మహర్షి కథ


శ్రీ పద్మ పురాణం లోని కథ
పూర్వం పరా త్వష్ట అనే దంపతులుండే వారు. ఎంతకాలం గడచినా వారికి సంతానం కలగలేదు. ఆమె పుత్రప్రాప్తికై పరమేశ్వరునకు తపము చేయసాగింది. ఏకాగ్ర చిత్తంతో మహాదేవుని ధ్యానంచేసింది. వేయి సంవత్సరముల పరాసాధ్వి యొక్క తపస్సునకు మెచ్చి శంకరుడు ప్రత్యక్షమైనాడు. ఆమె పరమశివా! శూరుడు శస్త్రాస్త్రాలకు చంపబడని వాడు విప్రదానవ రూపధరుడు అయిన పుత్రుని ప్రసాదించుఅని కోరినది.
పరమేశ్వరుని వరానుసారం ఆమెకు వృత్రుడనే పుత్రుడు కల్గినాడు. స్వయంగా శుక్రాచార్యులవారే ఆ వృత్రునికి విద్యాబోధచేసినాడు. వరప్రభావంతో గురుకృపతో మహాతేజసంపన్నుడైనాడు వృత్రుడు. కాని అతనిలో బలగర్వం ఎక్కువయ్యింది. చివరికి దేవేంద్రుని మీద దండెత్తాడు! అమిత బలవంతుడైన వృత్రుడు దేవాధిపతి అయిన ఇంద్రుడు ౫౦౦౦ యేండ్లు యుద్ధం చేశారు. చివరికి వృత్రుడు విజయం పొందాడు. పరాజితుడైన శచీపతి బ్రహ్మలోకం చేరాడు. మించిన బలగర్వం మత్సరంగా మాఱగా వృత్రుడు శుక్రాచార్యునితో ఇలా అన్నాడు
యుద్ధంలో ఓడిన ఇంద్రుడు బ్రహ్మలోకం వెళ్ళాడు. నేనూ అక్కడి వెళ్ళాలి. దారిచెప్పండి”. శుక్రుడిలా బదులిచ్చాడు రాక్షసనాథా! నీవు బ్రహ్మలోకానికి పోలేవు. తృప్తికి మించిన సంపద లేదు. త్రిలోకాధిపత్యంతో సంతృప్తిపడు”. “ఇంద్రుడున్నంత వరకూ నాకు సుఖంలేదు. వాడిని నాశనం చేయాలి. ఇంద్రుడికి బ్రహ్మలోకం వెళ్ళే అర్హత ఎలా వచ్చింది? నాకెందుకు లేదుఅని వృత్రుడన్నాడు.పూర్వం పవిత్రమైన నైమిశారణ్యంలో 1000 సంవత్సరాలు ఇంద్రుడు శివునికై తీవ్ర నిష్ఠతో తపస్సు చేశాడు. అంతటి తపశ్శాలి కనక బ్రహ్మలోక ప్రవేశం ఇంద్రునికి శంకరుని అనుగ్రహం వలన కలిగిందిఅని చెప్పాడు శుక్రుడు. వెంటనే వృత్రుడు నైమిశారణ్యం చేరి తపస్సు ఆరంభించాడు.
దుష్టుడైన వృత్రుని సంహారమునకు శ్రీకారం చుట్టిన మహావిష్ణువు ఇంద్రునితో ఇలా అన్నాడు సురేశ్వరా! పరమేశ్వరుని వర ప్రభావం వలన వృత్రుడు శస్త్రాస్త్రాలకు అవధ్యుడు. సరస్వతీ నదీ తీరంలో పరమనిష్ఠతో దధీచి మహర్షి తపమాచరిస్తునాడు. నూరుమూరల ప్రమాణంలో ఉన్న ఆ మహనీయుని వెన్నెముక వ్రజ్రముకంటే రెండు రెట్లు పటిష్టమైనది. ఆ దయాళువును లోకహితార్థము తన అస్థిని ఈయమని ప్రార్థీంచండి”. నారాయణుని అనుజ్ఞ తీసుకుని దేవేంద్రుడు కురుక్షేత్రంలో నదీతీరంలో ఉన్న మహర్షిశిరోమణి వద్దకు వెళ్ళాడు.



దధీచి మహర్షి ఇంద్రుని రాకకు కారణమేమని అడిగినాడు. ఇంద్రుడు పూర్వ వృత్తాంతమంతయు తెలిపి ఇలా అన్నాడు మహానుభావా! వృత్రుని ఆగడాలు మితిమీఱుతున్నాయి. అతని సంహరించకపోతే విబుధ (పండిత) వినాశం తప్పదు. దయచేసి మీ అస్థిని మాకు ప్రసాదించండి”.
ఇంద్రుడు చేసిన ప్రార్థన విని దధీచి మహర్షి మహదానందంతో పొంగిపోయాడు. లోక హితార్థము తన శరీరం వినియోగపడటం కన్నా కావలిసినది ఏమున్నదన్నాడు. యోగశక్తితో శరీరత్యాగం చేశాడు! దధీచి మహర్షి చేసిన అసామాన్యమైన త్యాగానికి విభ్రమితుడైన వేల్పుదొర దధీచికి నమస్కరించాడు. అస్థితో వజ్రాయుధాన్ని చేయించి లోకభీకరుడైన వృత్ర సంహారం చేశాడు.

పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాం:
1.     మహనీయులు పరోపకారార్థము తమ శరీరమును కూడా త్యాగం చేయడానికి వెనకాడరు. అడగంగానే మహదానందంతో ఇంద్రునికి తన అస్థిని ఇచ్చి దధీచి మహర్షి మహకు మార్గదర్శి అయినాడు.
2.     గర్వం అహంకారం వినాశ హేతువులు. బలగర్వంతో హుంకరీచిన వృత్రుడు ఎంతో వరబలం ఉండికూడా మత్సరంతో ఇంద్రుని నాశనం చేయబోయి తానే నాశనమైనాడు.



బ్రహ్మరాక్షసుని విముక్తి




పెద్దలు చెప్పిన నీతి కథ
అది దండకారణ్యమ్. మహా దట్టమైన అడవీప్రాంతమ్. కన్ను పొడుచుకున్నా కానరానంత దట్టంగా వృక్షాలు తీగలు వ్యాపించి ఉన్నాయి. ఆ భీకరారణ్యంలో ఓ మఱ్ఱిచెట్టు. దాన్ని ఆశ్రయించి ఎన్నో భూత ప్రేత పిశాచాలు. అక్కడే ఓ బ్రహ్మరాక్షసుడు తన నివాసాన్ని ఏర్పరచుకొన్నాడు. అడవిలో ఎన్నో ఔషధాలు విరాజిల్లడం మూలానేమో వాటి గాలి సోకి సోకి ఆ బ్రహ్మరాక్షసుడికి కాలక్రమేణా తాను ఆ వికృతాకారము నుండి విముక్తి పొందాలనే సద్భావం కలిగింది. ఎవరైనా తనకు సన్మార్గం చూపేవాళ్ళుంటారేమోనని అన్వేషిస్తుంటే శాపగ్రస్తురాలైన ఓ పులి దైవవశాత్తు అటుగావచ్చింది. ఆ శార్దూలరాజు కళ్ళలోని నైర్మల్యాన్ని గమనించి ఆ బ్రహ్మరాక్షసుడిలా అన్నాడు ఓ వ్యాఘ్రేశ్వరా! నాయందు దయవుంచి నాకీ జన్మ నుండి విముక్తి కలిగే మార్గం చెప్పగలవా”?
పూర్వ జన్మల దుష్కర్మలే ఈ వికృత జన్మలకు హేతువు. నీవు పూర్వ జన్మలో సద్బ్రాహ్మణునిగా పుట్టియు నీకు వచ్చిన విద్యను ఎవ్వరికీ అందించకుండా సమాజశ్రెయస్సుకు వినియోగించకుండా నీవద్దనే ఉంచుకున్నావు. ఆ దోషకారణముగా నీవిప్పుడు బ్రహ్మరాక్షసుడవైనావు. ఏదైనా సత్కర్మ చేస్తే నీకు విముక్తి కలుగుతుందిఅని ఆ పులి హితవు చెప్పింది. ఆ సత్యభాషణములు విని ఆ బ్రహ్మరాక్షసుడిలా అన్నాడు జంతువై ఇంత జ్ఞానం ఎలా సంపాదించావు”? “నేను సద్గురువును అధిక్షేపించడం వలన ఈ దేహం పొందాను. ఎదైనా సత్కార్యం చేదామని ఎంతో ప్రయత్నించాను. కానీ ఈ రూపాన్ని చూసే ఎవరూ నాదెగ్గరకైనా రవటంలేదు. ఇప్పుడు నీవేదైనా సత్కర్మ చేస్తే ఆ పుణ్యంతో నీవు నీచేత సత్కర్మ చేయించినందుకు నేను ఇద్దరం బైటపడతాంఅని పులి అన్నది.
సత్కర్మ చేయాలనే ధృడ సంకల్పంతో ఉన్న ఆ బ్రహ్మరాక్షసునకు ఓ ఆగంతకుడు కనిపించాడు. తనని ఆ రూపంలో చూస్తే భయపడతాడని ఓ సాధువు వేషంలో ఆ బాటసారి వద్దకు పోయి యోగ క్షేమాలు విచారించాడు. ఆ పాంథుడిలా తన విచారాన్ని వ్యక్త పఱచాడు ఒక 100 వరహాలు కావాలి. ఎలా సంపాదిద్దామా అని ఆలోచిస్తున్నాను”. రత్నాలతో ఏమి చేస్తావని ఆత్రుతగా అడిగాడు బ్రహ్మరాక్షసుడు. రాజకుమారిని పెళ్ళాడాలిఅన్నాడు ఆగంతకుడు. పెళ్ళికి రత్నాలెందుకని ప్రశ్నించగా ఎక్కడో హిమవత్ పర్వతాల దగ్గర ఏవో రత్నాలున్నాయిట. అవి తెస్తేగాని పెళ్ళిచేయరట. ఈ దండకారణ్యంలో ఎందరో యోగులు బ్రహ్మరాక్షసులు ఉంటారని విని వాళ్ళ ద్వారా ఆ రత్నాలు సంపాదిద్దాం అని ఇక్కడ కొచ్చానుఅన్నాడు బాటసారి.
ఏ రాజకుమారి? అవంతీ రాజకుమారి ఆ?” అని ప్రశ్నించిన బ్రహ్మరాక్షసునితోఅవును. నీకెలా తెలుసుఅని అన్నాడు బాటసారి. అది వీరశుల్కం. వరుని ధైర్యసాహసాలు వీరత్వం పరీక్షించడానికా నియమం. పైగా వారడిగినది 50 రత్నాలేకదా”? అన్నాడు బ్రహ్మరాక్షసుడు. వాళ్ళకంతా ఇచ్చేస్తే మరి నా భార్యాపిల్లలకోఅన్నాడు బాటసారి.
ఓరి దుర్మార్గుడా! రాజ్యాన్ని రాజకుమారిని మోసగిద్దాం అనుకున్నావా! నీలాంటి దేశద్రోహికి సహాయపడి నేనింకా పాపం మూట కట్టుకోలేను అని అనుకొని అమాంతంగా ఆ బాటసారిని మ్రింగివేశాడు బ్రహ్మరాక్షసుడు. తత్‍క్షణమే పులిగాశాపం పొందిన శిష్యుడు నరరూపంలో ప్రత్యక్షమై మిత్రమా! దుష్టుడైన దేశద్రోహిని సంహరించి రాజ్యాన్ని కాపాడిన నిన్ను నన్ను ఆ ధర్మదేవుడు కరుణించినాడు. రాఅంటున్న నూతన మిత్రునితో దివ్యలోకాలు చేరుకున్నాడు బ్రహ్మరాక్షసుడు.
పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాం:
1.     దుష్కర్మలెన్నడునూ చేయరాదు. నేర్చిన విద్య యొక్క సారమును ఎవ్వరికీ పంచకుండా బ్రహ్మరాక్షసుడు సద్గురు దూషణ వలన శిష్యుని కి దుఃఖములు తప్పలేదు.
2.     పరోపకారం యొక్క విలువ ఈ కథ మనకు తెలిపింది. కేవలం పరోపకారం ఒక్కటే తమని కాపాడగలదని తెలిసి బ్రహ్మరాక్షసుడు పులి ధృఢ సంకల్పంతో సత్కార్యం చేయదలచినారు.
3.     దేశద్రోహం చాలా పాపకార్యం. అట్టి దేశద్రోహిని సంహరించి బ్రహ్మరాక్షసుడు ఊరికి ఉపకారం చేశాడు.

 






Om Tat Sat
                                                        
(Continued...)  



 
(My humble greatfulness to Neethi Kathalu  dot com and  Hindu dot com for the collection)


(మన భారతీయ సంస్కృతికి సవినయ నివాళి )

0 comments:

Post a Comment

About Me

My Photo
gopalakrishna
View my complete profile

Visitors

free counters

Visitors

free counters
Powered by Blogger.

Visitors

Labels