నీతి కథలు - 4



























































నీతి కథలు





శ్రీకృష్ణలీలలు అఘాసుర వధ




శ్రీ గర్గభాగవతము లోని కథ

ఏ పరమపూరుషుని బ్రహ్మణ్యులు పరబ్రహ్మ అని, వైష్ణవులు విష్ణువని, శైవులు మరియు ఇతర భక్తులు శివుడని, కాపాలికులు కాలభైరవుడని, శాక్తేయులు శక్తి అని కొలిచెదరో అట్టి వేదవేద్యుడైన స్వామి గోపబాలురకు సఖునిగా స్నేహితునిగా మెలిగి వారితో కలిసి తని ఆడి పాడి వరిని తరింపచేసినాడు. ఆహా! గోపబాలుల అదృష్టమే అదృష్టము. (అదృష్టమంటే కనబడనిది అంటే మన జన్మజన్మాంతరాల కర్మఫలము)
ఒకసారి శ్రీకృష్ణుడు గోపబాలురు యమునాతీరమున ఆడుచుండగా కంసప్రేరితుడైన బకాసురుని జ్యేష్ఠపుత్రుడు అఘాసురుడు ఒక పెద్ద కొండచిలువ రూపమున వచ్చి నోటిని తెరిచి శ్రీకృష్ణునికై ఎదురుచూసెను. దాని పైపెదవి మేఘమండలమును క్రింది పెదవి భూమిని తాకుచుండెను! శ్రీకృష్ణలీలలను ప్రత్యక్షముగా చాలాసార్లు చూసిన గోపబాలురు అతడే రక్షిస్తాడనే నమ్మకముతో గోవులతో సహా పెద్దకొండబిలము వలెనున్న అఘాసురుని నోటిలోకి వెళ్ళిపోయినారు.




నందకిశోరుడు కూడా లోనికి ప్రవేశించెను. పరమాత్మ ప్రవేశించగానే అఘాసురుడు నోరుమూసివేసెను. విషవాయువుల ప్రభావముచే గోవులు గోపబాలురు ప్రాణములు విడిచిరి. అప్పుడు పరమాత్మ అఘాసురుని నవరంధ్రాలను మూసి ఉదరము ఉబ్బునట్టు చేసెను. అఘాసురుని పొట్టపగిలి నందనందనుడు బయటికి వచ్చెను. సంకల్పమాత్రముచే శ్రీకృష్ణుడు గోవులను గోపబాలురను బ్రతికించెను. అఘాసురుడు ముక్తినొందెను.
అఘాసురుని వృత్తాంతము:
శంఖుడనే రాక్షసుని కుమారుడు అఘాసురుడు. అతడు సుందరాంగుడు యౌవనుడు బలిష్ఠదేహుడు. కాని పరులను నిందించు స్వభావము కలవాడు. వాడు ఒకసారి అష్టావక్ర మహర్షిని చూచి ఇన్ని వంకరలేమిఅని హేళన చేసెను. మహర్షి అనుగ్రహము చూపుటకు ఓరీ! వంకరలని హేళన చేసిన నీవు సర్పరూపమును ధరింతువుఅని శపించెను. చేసిన తప్పుకు పశ్చాత్తాపముచెంది రక్షించమని ప్రార్థించిన అఘాసురునితో అష్టావక్ర మహర్షి
నాయనా! పరనింద మృత్యువువంటిది. మనము అనవసరముగా ఎవరినైనా నిందిస్తే నిందింపబడిన వాడి పాపములో సగం మనకివస్తుంది. అంతేకాక మనం ఎంతో కష్టపడి ఆర్జించుకున్న పుణ్యసర్వస్వములో సగం అతనికి వెళిపోతుంది. కావున అనవసరముగా పరనిందచేయరాదు. నీవు చేసిన తప్పుకు పశ్చాత్తాపముచెంది పాపఫలము అనుభవించిన తరువాత ద్వాపరయుగములో శ్రీకృష్ణపరమాత్మ కృపచే ముక్తిని పొందుతావుఅని ఆశీర్వదించినాడు.
పిల్లలూ! మనమెన్నడూ అనవసరముగా పరులను నిందించరాదు.




శుచిలేనిది సత్పురుషదర్శనం లభించదు



మహాభారతము లోని కథ
వేదప్రవర్తకుడైన పైలమహర్షికి ఉదంకుడను ఉత్తమ శిష్యుడుండెడివాడు. అతడు బ్రహ్మతేజస్సు కలవాడు మహాతపస్సంపన్నుడు. గురుదేవతా అనుగ్రహం వలన అణిమాద్యష్టసిద్ధులు జ్ఞానము పొందిన మహానుభావుడు ఉదంకుడు.
ఒకరోజు గురుపత్ని అతనికి ఒకకార్యమును అప్పచెప్పినది నాయనా! మనదేశ మహారాజైన పౌష్యుడు ధర్మాత్ముడు. ఆయన ధర్మపత్ని ఉత్తమురాలు. ఒక వ్రతము చేయటానికి నాకు ఆ సాధ్వి కుండలాలు కావాలి. ఆమెను అర్థించి అవి తీసుకొనిరా”. గురుపత్ని ఆజ్ఞను శిరసావహించుటకై ఉదంకుడు వెంటనే ధర్మాత్ముడైన పౌష్యమహారాజు వద్దకు బయలుదేరినాడు. దారిలో అరణ్యమార్గములో వెళుతుండగా ఒక మహావృషభము మీదనున్న దివ్యపురుషుని చూచినాడు. అతడు సూర్యుని వలె వెలిగిపోతున్నాడు. ఆ దివ్యపురుషుడు ఉదంకునికి అనుగ్రహముతో పవిత్రమైన గోమయమును ఆరగించుటకు ఇచ్చెను. అమృతప్రాయమైన గోయమును భుజించి గురుపత్ని ఆజ్ఞ త్వరగా నెరవేర్చుటకై ఆ మహాపురుషుని వద్ద సెలవు తీసుకొని పౌష్యుని రాజ్యమును చేరుకున్నాడు.
పౌష్యుడు ఉదంకునికి యథావిధి సత్కారాలు చేసి రాకకు కారణమేమియో తెలుపుమని ఉదంకుని ప్రార్థించినాడు. ఉదంకుడు తన గురుపత్నిగారి ఆజ్ఞను రాజుకు తెలిపినాడు. ఆహా! లోకశ్రయస్సును కోరే మీవంటి తాపసులను సేవించుటకంటే అదృష్టమేమున్నది? మహానుభావా నా రాణి వద్దకు వెళ్ళి నా మాటగా చెప్పి కుండలములను తీసుకొనుముఅని పౌష్యుడు చెప్పినాడు. వెంటనే ఉదంకుడు మహారాణిగారి మందిరమును చేరుకున్నాడు. కానీ ఆయనకు ఎక్కడా పౌష్యరాణి కనబడలేదు! తరిగివచ్చి రాజా! నాకు మహారాణి కనబడలేదు. నీవే ఆ కుండలములను తెప్పించి ఇవ్వుఅని అడిగినాడు.
అప్పుడు పౌష్యమహారాజు ఇలా అన్నాడు భూవినుత! నీవంటి త్రిభువన పావనుని అశుచివి అని ఎట్లా అనగలను? నా రాణి మహాపతివ్రత కావున అశుచులకు కనబడదు”. ఉదంకుడు ఎందులకు తనకు అశుచి వచ్చినదో ఆలోచించినాడు. తాను గురుపత్నీ కార్యమును త్వరగా పూర్తిచేసే తొందరలో ఆ మహాపురుషుడు ఇచ్చిన గోమయాన్ని భుజించిన తరువాత ఆచమించలేదని గుర్తుకు వచ్చినది. వెంటనే కాళ్ళూ చేతులు అన్ని కడుక్కుని కేశవ నామాదులతో ఆచమనము చేసి శిచియై మహారాణి అంతఃపురమునకు వెళ్ళినాడు. అక్కడ యథాస్థానములో మహారాణిని చూసి ఆమె పాతివ్రత్య మహాత్మ్యమునకు ఆశ్చర్యపోయి మహారాణీ! మా గురుపత్ని వ్రతార్థము మీ కుండలములు కోరి వచ్చినానుఅని ప్రార్థించినాడు. ఆ పతివ్రతామతల్లి తన కుండలములు ఇట్టి తాపసులకు ఉపకరిస్తున్నాయని సంతోషించి ఉదంకునకు కుండములను ఇచ్చి పంపివేసినది.

పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాము:
శుచిత్వము సత్పురుషుల సందర్శనమునకు ప్రథమ సోపానము. ఉదంకుడు భోజనము తరువాత తొందరలో ఉండి కాళ్ళుకడుక్కుని ఆచమించనందున ఎంతగొప్పవాడైనా ఆయనకు పతివ్రత అయిన పౌష్యరాణి కనబడలేదు. కావున మనమన్ని వేళలా ముఖ్యముగా సత్పురుష, దైవ సందర్శనమునకు వెళ్ళునప్పుడు శుచిగా ఉండవలయును. ఇదే కారణముగా అర్జునుడు, అశ్వత్థామ బ్రహ్మాస్త్రప్రయోగమునకు ముందు శుచులై మంత్రప్రయోగము చేసినారు  . బకాసురుని యుద్ధమునకు ముందు భీమసేనుడు ఆహారము భుజించి శుచిఅయ్యి తరువాతనే యుద్ధముచేసినాడు  . అవంతీరాజు, విక్రమార్కుడు పుష్కరిణిలో స్నానము చేసిన తరువాతనే కాళీ ఆలయములోకి ప్రవేశించినారు  .



నచికేతుని పితృభక్తి



కఠోపనిషత్తు లోని కథ
పూర్వం వాజస్రవసుడను సత్పురుషుడుండేవాడు. గౌతమవంశజాతుడైన అతనికి గౌతముడు, ఔద్దాలకుడు మరియు ఆరుణి అను పేరులు కూడా కలవు. అతడొకసారి విశ్వజిత్ యజ్ఞము చేసినాడు. ఆ బృహత్ యజ్ఞం చేసినవారు యాగాంత్యములో తమ సర్వస్వమునూ దానము చేయవలెను! వాజస్రవసుడు కూడా తనకున్నదందా దానంచేయసాగినాడు.
భారతీయులకు పశువృక్షములు ముఖ్యమైన సంపదలు. అందునా గోసంపద అతి ముఖ్యమైనది. మణిమరకతాలకంటే హిరణ్యరజితాదులకంటే గొప్పది గోసంపద. కావున వాజస్రవుడు ఋత్విజులకు గోదానాలు చేయసాగినాడు. వాజస్రవసునకు మహాబుద్ధిశాలి గుణోన్నతుడు పితృభక్తి పరాయణుడగు నచికేతుడను పుత్రుడు కలడు. అతడు చిన్నవాడైనా సకల ధర్మశాస్త్రాలు బాగా అభ్యసించినాడు. నచికేతుని దృష్టి తన తండ్రియిచ్చే గోవుల మీద పడినది. తండ్రి దానమిచ్చే గోవులు చాలమటుకు ముసలివి పండ్లులేనివి పాలిచ్చుటకు ప్రసవించుటకు శక్తిలేనివి అని కనుగొన్నాడు. మిక్కిలి దుఃఖమును చెంది నచికేతుడిలా అనుకున్నాడు
శాస్త్రాలు ఎవడైతే నిస్సారమైన గోవులను దానంచేస్తాడో వాడికి సద్గతులుండవు అని ఘోషిస్తున్నాయి. అయ్యో! మహనీయుడైన మా తండ్రిగారు విశ్వజిత్ వంటి విశిష్టమైన యజ్ఞము చేసియూ ఈ తామస దానము వలన పూర్ణఫలమును పొందకుండుట పాడిగాదుఅని పలువిధాల ఆవేదనపడి చివరి నిమిషములోనైనా తండ్రిగారికి హితం చేద్దామని తలచి ఇలా అన్నాడు
తండ్రీ! ఈ యజ్ఞములో నీకున్నవన్నీ దానము చేయాలి కదా? మరి నన్ను ఎవరికిస్తావు”? అని అడిగినాడు. బాలచేష్ట అనుకుని బదులివ్వలేదు వాజస్రవసుడు. నచికేతుడు మళ్ళీ నన్నెరికిస్తావు నాన్నా”? అని అడిగినాడు. సహనావవతు …” మొదలైన శాంతిమంత్రాలతో ప్రతిధ్వనిస్తున్న యాగశాలలో ఉన్న వాజస్రవసుడు సహనం వహించాడు. తండ్రికి మహాపుణ్యాన్ని ఎలాగైనా కట్టబెట్టాలని దృఢనిశ్చయంతో ఉన్న నచికేతుడు మూడవమాఱు అదే ప్రశ్నవేశాడు. సహనమును కోల్పోయి వాజస్రవసుడునిన్ను యమునికిస్తానుఅని అన్నాడు!
అయ్యో! కోపముతో నేనెంతమాటన్నాను? ఆహా! తన కోపమే తన శత్రువు అను సూక్తిని చిన్నప్పటినుంచి వింటూవచ్చినా ఒక్క క్షణం సహనాన్ని కోల్పోయి ఎంత తప్పుచేశాను!అని బాధపడ్డాడు వాజస్రవసుడు. నచికేతుడు తన మదిలోదానమిచ్చేటప్పుడు గ్రహీతకు అక్కరకు వచ్చే వస్తువును ఇవ్వాలి. నావంటి సామాన్యుడు ధర్మప్రభువైన యమునికి ఏమి అక్కరకు రాగలను? అయిననూ పితృవాక్యపాలనమే తనయుల ధర్మంఅనుకొని చింతిస్తున్న తండ్రిని చూచి తండ్రీ! విచారించవలదు. మన పూర్వీకులందఱూ సత్యనిష్ఠాగరిష్ఠులు అన్నమాటను ఎన్నడూ జవదాటి ఎఱుగనివారు. సత్యమే ఈ చరాచర సృష్టికి ఆధారము. సత్యభ్రష్టుడైన వానికి నరకము తప్పదుకదా! తండ్రీ! నీవాడిన మాటను నేను సత్యముచేసెదను. నాకై విచారించకుము.
పైరు మొలచి పండి ఆపై ఎలా జీర్ణమవుతుందో అదేవిధముగా పాంచభౌతిక శరీరము పుట్టి పెరిగి మరల ఆ పంచభూతముల లోనే లీనమగును కదా! కావున ఈ శరీరము శాశ్వతము కాదు. సత్యమొక్కటే శాశ్వతము. సత్యమే భగవంతుడు. కనుక విచారించక యముని వద్దకు పోవుటకు ఆజ్ఞనొసంగుము”. ఇలా తన అమృతవాక్కులతో సుధావర్షమును కురిపించినాడు నచికేతుడు. ఎలాగైతే దశరథ మహారాజు మహాదుఃఖముతో దాశరథిని కానలకు పంపినాడో అలా వాజస్రవసుడు నచికేతుని యముని వద్దకు పంపినాడు.
ఆ యమపురమునకు దారి అతిదుర్గమమైనది. ఎంతో పుణ్యశీలులు కూడా సులభముగా దాటలేని వైతరణీనదిని నచికేతుడు తన సత్యసంధత్వ పితృభక్తి ప్రభావములచే సునాయాసముగా దాటి యమపురిని చేరినాడు. యమధర్మరాజు నగరములో లేరని తెలుసుకుని ద్వారమువద్ద నిరీక్షించినాడు. మూడురోజులు అన్నపానీయాదులు లేకుండా ఆ పసివాడు కాలునికై నిరీక్షించినాడు. మూడురోజులకు ధర్ముడు వచ్చినాడు. మహాతేజస్సుతో అగ్నివలె వెలిగిపోతున్న నచికేతుని చూచి
అయ్యో! తెలియకనే నావలన ఎంత అపరాధము జరిగినది? ధర్మానికి రాజునైన నా ఇంటనే ఇంతటి అధర్మము జరిగినదే! ఇంటివారిచే తప్పు జరిగినా ఆ తప్పుకు బాధ్యుడు యజమానియే కదా! అగ్నితుల్యుడైన అతిథి ఎవరింట్లో పస్తుంటాడో వాడి ఇష్టాపూర్తులు పుత్రులు మొదలైన సంపదలు నశిస్తాయి కదా! నిప్పుని తెలిసి తాకినా తెలియక తాకినా కాలకమానదు. అటులే తెలిసిచేసినా తెలియక చేసినా తప్పుకు శిక్షను అనుభవించక తప్పదు. ఈ అధర్మకార్యానికి ఫలితము నాకు రాకమానదు. ఇప్పటికైనా ఆ అతిథికి అర్ఘ్యపాద్యాదులిచ్చి సత్కరించెదనుఅని నిశ్చయించి యముడు నచికేతుని వద్దకువెళ్ళి ఓ బ్రహ్మన్! అభ్యాగతః స్వయం విష్ణుః. కావున చిన్నవాడివైనా నీకు నమస్కరిస్తున్నాను. నా నమస్కారమును స్వీకరించు. ఇంటికి వచ్చిన అతిథి అగ్నిదేవునితో సమానుడని తెలిసికూడా నిన్ను మూడు దినములు నిరీక్షింపచేసినాను. నన్ను క్షమించు. నాకు శుభం కలిగేటట్టు ఆశీర్వదించు. మూడురోజులు నిన్ను కష్టపెట్టినందుకు ప్రాయశ్చిత్తముగా నీకు మూడు వరాలు ఇస్తాను. కోరుకోఅని అన్నాడు.
వంశదీపకుడైన నచికేతుడిలా కోరినాడు ఓ యమధర్మరాజా! మా తండ్రిగారు ఆందోళనారహితుడు శాంతచిత్తుడు అగునట్టు ఆశీర్వదించు. నేను ఇంటికి చేరిన తరువాత ఆయన నాపై కోపమును విడుచు నట్లు ఆశీర్వదించు. నాకు అగ్నివిద్యను ఉపదేశించుఅని కోరినాడు. యముడు ఆ వరములను ప్రసాదించి మూడవ వరము కోరుకొమన్నాడు. అప్పుడు నచికేతుడు స్వామి! ఆత్మ శాశ్వతమని కొందఱు కాదని మరికొందఱు అంటున్నారు. ఈ సందేహము తీరునట్లుగా నాకు అతిరహస్యమైన బ్రహ్మవిద్యను ఉపదేశించుము”.
ఆత్మవిద్యను యోగ్యతార్హతలున్న వానికే బోధించాలి. అనర్హునకు బోధించిన ఆతనికి సమాజమునకు హానికరం అని ఎఱిగిన యమధర్మరాజు నచికేతుడు జ్ఞానోపదేశానికి అర్హుడోకాదో అని పరీక్షచేసినాడు. ఈ విద్యనేర్చుకొనుట చాలా కష్టము. ఇంకేదైనా కోరుకో. ఉత్తమ సంతానం, ఏనుగులు, గుఱ్ఱాలు, ఆవులు సిరిసంపదలు ఇంకా మానవులకు దుర్లభమైన భోగభాగ్యాలనేవైనా కోరుకో తీరుస్తాను. ఈ భూమండలాన్నంతా కోరినా ఇస్తాను. దీర్ఘాయువు అమరత్వము కోరుకొనుము ప్రసాదించెదను. కానీ ఆత్మవిద్యను కోరవద్దుఅని ప్రలోభ పెట్టినాడు కాలుడు. ధీరుడైన నచికేతుడు ఐహికార్థాలను తృణప్రాయముగా ఎంచి ఆత్మవిద్య నేర్చుటకు ఉత్సుకతను చూపించినాడు. నచికేతుని పట్టుదల చూచి సంతోషించి ప్రలోభాలకు లొంగని అతడు అర్హుడని నిశ్చియించి ఆత్మవిద్యను నేర్పినాడు.
పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాము:
1.     దానమిచ్చే సమయములో మనవద్దనున్నవానిలో మంచివి గ్రహీతకు ఉపకరించేవి ఇవ్వాలని నచికేతుడు మనకు బోధించినాడు. ఇదే ఉత్తమ దానము యొక్క లక్షణము.
2.     పితృవాక్యపాలనము తనయుల ప్రథమ కర్తవ్యము. అంతేకాక తండ్రి అడుగకుండానే తండ్రికి హితవు (ప్రియము కాదు) చేయాలని తపించేవాడు ఉత్తమ పుత్రుడు. శ్రీరాముడు, భీష్మపితామహుడు, నచికేతుడు ఈ త్రోవకు చెందినవారు. నచికేతుడు తండ్రికి పూర్ణదాన ఫలం ఇప్పిద్దామని దృఢసంకల్పము చేసినాడు. తండ్రి అన్నమాటను సత్యంచేయుటకు తన ప్రాణాలనే తృణప్రాయముగా ఎంచి యమపురికి బయలుదేరినాడు. ఇట్టి పితృభక్తి పరాయణులు మనకు ఆదర్శప్రాయులు.
3.     కోపము ఒక్క నిమిషములో మనచేత ఎంత తప్పునైనా చేయిస్తుంది. వాజస్రవసుడు సహనం వహించక యమునికిస్తానుఅని తరువాత పశ్చాత్తాపపడినాడు. కాబట్టి మనము ఎల్లప్పుడు శాంతచిత్తముతో ఉండాలి.
4.     అభ్యాగతః స్వయం విష్ణుఃఅన్న సూక్తిని మనకు చూపించినాడు యమధర్మరాజు. అతిథిని నిరీక్షింపచేయవలసి వచ్చినదే అని ఎంతో బాధపడ్డాడు. దిక్పాలకుడు అయికూడా నన్ను క్షమించుఅని ఒక పసిబాలునితో అన్నాడు!
5.     ఎన్నో విషయాలు తెలిసినా నచికేతుడు నావంటి సామాన్యుడు యమునికేమి అక్కర”? అని అనుకొని తన వినయవైభవాన్ని మనకు చూపినాడు.




శ్రీకృష్ణలీలలు బకాసుర వధ



శ్రీ గర్గభాగవతము లోని కథ
యోగీశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుడు బాలునివలె గోపాలురతో యమునాతీరమున తిరుగుతూ ఆడుచూ ఉండెను. అప్పుడు కైలాస పర్వతమంత ఎత్తుగా ఉన్న ఒక పెద్ద కొంగ అక్కడికి వచ్చెను. మేఘగర్జన వలెనున్న దాని అరుపు విని గోపబాలురు భయభ్రాంతులైరి. ఆ మహాబకము తన ముక్కుతో పరమాత్మను నోటిలోకి వేసుకొని మ్రింగెను.

లోకరక్షకుని రక్షించుటకై దేవేంద్రుడు వజ్రప్రయోగము చేసెను. విధాత దండమును విసరెను. ఆ బకాసురునికి ఏ హానీ జరగలేదు! పరమేశ్వరుడు త్రిశూలముచే దాని రెక్క విఱుగగొట్టెను. వాయదేవుని వాయవ్యాస్త్రము యముని దండము సూర్యుని వేయిబాణములు చంద్రుని నీహారాస్త్రము ఆ బకాసురునిపై పనిచేయలేదు!
ఆగ్నేయాస్త్రముతో అగ్నిదేవుడు ఆ బకుని రొమ్ములను కాల్చెను. వరుణదేవుడు పాశముతో భద్రకాళి గదతో కొట్టగా ఆ బకాసురుడు మూర్ఛనొందెను. కొంతసేపటికి తేరుకున్న బకుని కాలు విఱుగగొట్టెను తన శక్త్యాస్త్రముతో కుమారస్వామి. ఒంటికాలితోనే మింటికెగసి ఆ బకాసురుడు దేవతలను తరిమికొట్టెను!
మహర్షులు వేదవేద్యుడైన శ్రీకృష్ణస్వామిని ధ్యానించగా బకాసురుని ఉదరములోనున్న స్వామి వాడి పొట్ట ఉబ్బునట్లు చేసెను. ఊపిరాడక బకుడు పరమాత్మను బయటకు ఉమ్మివేసెను. తరువాత బకుడు ముక్కుతో పొడవగా నందకిశోరుడు బకుని ముక్కుపుటములను చీల్చెను.


మరణించిన బకాసురుని చూచి దేవతలు పరమాత్మపై పుష్పవృష్టి కురిపించిరి. బకునిలోని తేజస్సు కృష్ణపరమాత్మలో కలసెను.
బకాసురుని వృత్తాంతము:
హయగ్రీవుడనే రాక్షసుని కుమారుడు ఉత్కలుడు. వాడు తన బలపరాక్రమాలతో దేవేంద్రుని జయించి స్వర్గాధిపతి అయ్యెను. ఇట్లు నూరేండ్లు త్రిలోకాధిపతియై శోభిల్లెను.
అన్ని ఏండ్లు దేవేంద్రపదవిని పొందియూ బుద్ధిమాంద్యముచే ఆతడు మహాతెజస్వి అయిన జాజిలి మహర్షి ఆశ్రమము వద్దనున్న సింధూ మహాసాగరమునకు పోయి అక్కడ చేపలను పట్టుచుండెను. అప్పుడు జాజిలి మహర్షి ఉత్కలుని చూచి ఓయి! నీకిట్టి జీవహింస చేయ తగునా? వంశానుక్రమమున నీకు లభించిన సంస్కారమేమి? నీవు చేయుచున్న పని ఏమి? జీవ హింస మహాపాపమని ఎఱుగవా”? అని మందలించెను. మూర్ఖుడైన ఉత్కలుడు మహర్షి మాటలను విశ్వసించక జీవహింస కొనసాగించుచుండెను. అంతట జాజిలి మహర్షి కొంగవలె చేపలు పట్టుచుంటివి కావున బకుడవు కమ్ముఅని శపించెను. పశ్చాత్తాపముతో మహర్షిని శరణువేడినాడు ఉత్కలుడు. అప్పుడు మహర్షివత్సా! కర్మ ఫలితమును అనుభవింపక తప్పు కదా! పశ్చాత్తాముతో పునీతుడవైన నీకు శ్రీకృష్ణ సందర్శనము కలుగును. ముక్తిని పొందెదవుఅని అనుగ్రహించినాడు.
పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాము:
అహింసా పరమో ధర్మః |
ధర్మహింసా తథైవచ ||
ఈ సూక్తికి అద్దంపట్టే కథ బకాసుర వధ. ఇంద్రపదవిని చేపట్టి తన సంస్కారానికి విరుద్ధముగా చేపలను పట్టుకుని ఉత్కలుడు జీవహింస చేసినాడు. అందులకు జాజిలి మహర్షి అతనిని శపించినాడు. కావున మనము జీవ హింస ఎన్నడూ చేయరాదు.
దుష్టుడు లోకహింసా పరాయణుడు అయిన ఉత్కలుని సంహరించి లోకాలకురాజైన శ్రీకృష్ణపరమాత్మ ధర్మసంస్థాపన చేసినాడు. శ్రీకృష్ణుడు చేసినది ధర్మహింస అయినది. పైన చెప్పిన సూక్తి ప్రకారము అహింస పరమ ధర్మము. అహింస అంతే గొప్పది ధర్మహింస.
(
దండనీతిని పాటించి దుష్టులను శిక్షించి రాజు ధర్మహింసయే చేస్తాడు.)



శంఖ లిఖితుల కథ




మహాభారతము లోని కథ
పూర్వం శంఖుడు లిఖితుడు అనే ఇద్దరు సోదరులు ఉండేవారు. వారు బాహుదానదీ తీరములో ఆశ్రమాలను నిర్మించుకొని తపస్సు చేయసాగినారు. ఇలా ఉండగా ఒకరోజు అన్నగారిని చూడలనిపించి లిఖితుడు శంఖుని ఆశ్రమమునకు చేరుకున్నాడు. అన్నగారు ఎక్కడో బయటికి వెళ్ళారని తెలుసుకొని ఆశ్రమములోని ఒక చెట్టునీడలో కూర్చుని దాని పండ్లలు తింటూ అన్నగారికోసం నిరీక్షించాడు. వేదవేదాంగ పారంగతుడైన శంఖుడు వచ్చి తన తమ్ముని చూసి సంతోషించాడు. ఆతడు పండ్లను ఆరగించటం చూచితమ్ముడూ! ఈ పండ్లు నీకెక్కడివిరా?” అని అడిగాడు. లిఖితుడు చెప్పినది వినిప్రియసోదరా! ఇది తప్పు కదా! అజమానినైన నేను లేని సమయములో నా అనుమతిని పొందకనే ఫలములను తీసుకునుట అపరాధమని నీవెఱుగవా? మన మహారాజుగారి వద్దకు వెళ్ళి నీవు చేసిన తప్పుకి తగిన శిక్షని అనుభవించి రా!అని అన్న అయిన శంఖుడు ఆజ్ఞాపించినాడు.
తండ్రి తరువాత తండ్రంతటి అన్న మాట తప్పని లిఖితుడు వెంటనే సుద్యుమ్న మహారాజు వద్దకు పరుగెట్టాడు. మునీంద్రుడు వచ్చాడని తెలియగానే ధర్మాత్ముడైన సుద్యుమ్న మహారాజు ఎదురేగి అర్ఘ్యపాద్యాదులర్పించి పూజించాడు. అప్పుడు లిఖితుడు పార్థివకులభూషణ! ఈ పూజలకు నేను అనర్హుడిని. నేను మా అన్నగారు లేని సమయములో ఆయన ఇంటికి వెళ్ళి చెట్టుకున్న పండ్లను ఆయన అనుమతి లేకుండా కోసుకొని తిన్నాను. కనుక నేను చేసిని ఈ దొంగతనానికి తగిన రీతిలో శిక్షవేసి నన్ను రక్షించు. రాజదండన పొందిన వానికి యమదండన ఉండదని మా అన్నగారు నాకు హితవు చెప్పారుఅని ప్రార్థించాడు. తపశ్శక్తితో లోకాలకు హితవు చేసే మిమ్ము ఎట్లు శిక్షించము?” అని నచ్చచెప్పినా లిఖితుడు తన పట్టువదలలేదు.
చివరికి సుద్యుమ్నుడు దండనీతి శాత్రాన్ని అనుసరించి లిఖితుని చేతులు నరికించాడు. లిఖితుడు ఎంతో సంతోషించి మహారాజును మనసారా ఆశీర్వదించి అన్నగారి వద్దకు పరుగెట్టాడు. శిక్షను అనుభవించి పునీతుడై వస్తున్న తమ్ముని చూచి శంఖుడు నాయనా! మంచి పని చేశావు. నీవంటి ఉత్తముని వలన మన వంశమంతా ఉద్ధరింపబడుతుంది.
మద్యపానము, గురుపత్నిని ఆశించడము, విప్రుని చంపడము, విప్రుని ధనమును అపహరించడము (లిఖితుడు తెలియక చేసిన తప్పు ఇదే) మరియు ఈ పనులను చేసేవారితో కలిసి తిరగడము ఇవ్వి పంచమహాపాతకాలు. నువ్వు తగిన రాజదండన పొంది పాప విముక్తుడవైనావు. ఈ బాహుదానదీ పుణ్యజలాలలో మునిగి దేవమునిపితృ తర్పణాలు ఇవ్వుఅని ఆజ్ఞాపించాడు. వెంటానే అన్నగారి ఆజ్ఞపాటించాడు లిఖితుడు. లిఖితుడు బాహుదా నదిలో మునక వేశాడోలేదో తన బాహువులు వచ్చేశాయి! ఆశ్చర్యచకితుడై అన్నగారికి నమస్కరించాడు. శంఖుడు ప్రియసోదరా! నువ్వు చేసిన తప్పుకు శిక్షను అనుభవించి పునీతుడవైనావు కావున భగవంతుడు నిన్ను కరుణించినాడు. బాహుదానదీ మహాత్మ్యము నా తపశ్శక్తి ప్రభావము నీ చేతులు మొలవటానికి దోహదం చేశాయి. దండనీతిని సక్రమముగా అనుసరించి నిన్ను కాపాడిన సుద్యుమ్న మహారాజు కూడా ధన్యుడుఅని చెప్పాడు.
పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాము:
1.     దండనీతి యొక్క ప్రాముఖ్యత మనకీ కథ ద్వారా తెలిసినది. ఏ తప్పుకు ఏ శిక్షను అనుభవించాలో వవరించి ఈ దండనీతి శాస్త్రము మనలను యమబాధలనుండి కాపాడుతుంది.
2.     తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. చేసిన తప్పుకు శిక్ష ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదు. ఈ విషయము తెలిసిన శంఖుడు తమ్మునిపైన అనుగ్రహముతో మహారాజువద్దకు వెళ్ళి దండన అనుభవించిరమ్మనాడు.
3.     అన్నగారు చెప్పిన హితవును వెంటనే అనుసరించి లిఖితుడు తనంతట తాను రాజు వద్దకు వెళ్ళి చేసిన తప్పొక్కుకుని దండించమని ప్రార్థించినాడు. దండన అనుభవించి పునీతుడైనాడు.
4.     ఈ కథలో అందఱూ తమ కర్తవ్యములను బాగా పాటించి మనకు మార్గదర్శకులైనారు. విప్రులైన శంఖలిఖితులు లోకహితార్థం తప్పస్సులు చేసుకుంటూ కాలము గడిపినారు. దండనీతికోవిదుడైన సుద్యుమ్న మహారాజు లిఖితునికి తగిన శిక్షవేశాడు. లిఖితుడు అన్నగారి మాట జవదాటలేదు. శంఖుడు తమ్ముని శ్రేయస్సునే కోరినాడు.




వితరణశీలి విక్రమార్కుడు



విక్రమార్కుని సాహసగాధలలోని కథ
విక్రమార్కుని ధైర్యసాహసాలు దానపరోపకారగుణాలు త్యాగనిరతి పేరుప్రతిష్ఠలు దిగ్దిగంతాలకు వ్యాపించినాయి. ఒకరోజు అవంతీరాజు ఒకభట్రాజు పద్యాల ద్వారా విక్రమాదిత్యుని గుణగణాలను విన్నాడు. ఇంత నీతిమంతుడు సత్యనిష్ఠుడు గుణాగ్రగణ్యుడు లోకంలో ఉంటాడా? అని అశ్చర్యమేసింది ఆయనకు. విక్రమార్కుని మీద కించిత్ అసూయపడి నాకు విక్రమార్కుడంత కీర్తిప్రఖ్యాతులు ఎలావస్తాయి?” అని విచారించసాగినాడు. అదే ఆలోచిస్తూ పరాకుగా ఉండటం మొదలుపెట్టాడు.
ఒకరోజు అవంతీరాజు వద్దకు ఒక సన్యాసి వచ్చాడు. యథావిధిగా అతనిని పూజించి రాజు స్వామి! విక్రమార్కుని గుణగణములు నేను ఒక భట్రాజు ద్వారా విన్నాను. ఆ విక్రముడంతటివాడు మీ భూమిమీదు లేడు. అట్టి యసస్సు నాకెలా వస్తుందో చెప్పండిఅని ప్రార్థించాడు. సన్యాసి రాజా! నీకొక సూక్ష్మోపాయం చెబుతాను. హిమవన్నగర సమీపములో ఒక కాళికాలయం ఉన్నది. సిద్ధప్రదేశమైన ఆ ఆలయం వద్ద కొందరు యోగపురుషులు హోమక్రియలు చేస్తుంటారు. నీవక్కడికి వెళ్ళి పుష్కరిణిలో స్నానం చేసి శుచివై ఆలయప్రాంతంలోకి ప్రవేశించు. గుండమొకటి త్రవ్వి కాళికాదేవికై హోమముచేసి చివరికి గుండములో దూకి నిన్ను నువ్వే పూర్ణాహుతి చేసుకో. దయాసాగరులైన ఆ యోగపురుషులు నిన్ను రక్షిస్తారు. నీ సాహసానికి మెచ్చి దేవి కరుణిస్తుందిఅని హితము చెప్పాడు.
సదాచారుడైన రాజు అటులనే చేశాడు. ప్రత్యక్షమైన కాళికాదేవితో ప్రతిదినమూ ఏడుకోట్ల ధనం నాకు రావాలిఅని అడిగాడు. నాయనా! ప్రతిరోజూ నీవు హోమంచేసి పూర్ణాహుతి నిచ్చినట్లయితే నీవు కోరుకున్నట్టే జరుగుతుందిఅని దేవి చెప్పి అంతర్ధానమయినది. అవంతీరాజు యోగపురుషులకు కృతజ్ఞతలు తెలిపి నగరానికి వచ్చి దేవి ఆజ్ఞానుసారం చేసి ప్రతిరోజూ ఏడుకోట్లు సంపాదించాడు. ఆ ధనముతో ఎన్నో అద్భుతమైన దానధర్మాలు చేసి దానకర్ణుడని ప్రఖ్యాతిని పొందినాడు.
విమలుడైన విక్రమాక్రుడు అవంతీరాజు యొక్క కీర్తిని విన్నాడు. తక్షణమే హిమవత్పర్వతములోని కాళికాలయానికి వెళ్ళి స్నానముచేసి శుచి అయ్యి ఆలయములో హోమముచేసి తన శరీరాన్ని పూర్ణాహుతి చేయబోగా కాళికాదేవి ప్రత్యక్షమై వరంకోరుకోమన్నది. కైలాశశిఖరమంత ఉన్నత హృదయం కల విక్రమాదిత్యుడు ఇలా కోరినాడు గుణవంతుడైన అవంతీరాజు తన శరీరాన్ని పూర్ణాహుతిని చేయకుండానే ఆ ధనం అతనికి వచ్చేటట్టు దానితో అతడు మరిన్ని దానధర్మాలు చేసుకునేటట్టు అనుగ్రహించు తల్లీ”. దేవి విక్రమార్కుని త్యాగనిరతి చూసి తథాస్తుఅని ఆశీర్వదించింది.
ఈ విషయం తెలుసుకున్న అవంతీరాజు విక్రమాదిత్యుని వద్దకు వచ్చి రాజా! నీ వితరణశీలత అపూర్వము అద్వితీయము. నీవంటి సౌశీల్యుడైన రాజు యీ భువిలో పుట్టబోడుఅని స్తుతించి కృతజ్ఞతలను తెలుపుకొని వెళ్ళిపోయాడు.
పిల్లలూ! మరి మనకింతటి విశాల హృదయం వితరణగుణం ఉన్నాయా?







 





Om Tat Sat
                                                        
(Continued...) 

 


(My humble greatfulness to Neethi Kathalu  dot com and  Hindu dot com for the collection)


(మన భారతీయ సంస్కృతికి సవినయ నివాళి )

0 comments:

Post a Comment

About Me

My Photo
gopalakrishna
View my complete profile

Visitors

free counters

Visitors

free counters
Powered by Blogger.

Visitors

Labels