నీతి కథలు - 2




























నీతి కథలు





తొండమాన్ చక్రవర్తి భీమ కులాలుడు



భవిష్యోత్తర పురాణము లోని కథ
కలియుగ ప్రత్యక్ష దేవుడైన శ్రీ వేంకటనాథునికి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి అయిన పద్మావతీ దేవిని కన్యాదానమిచ్చిన మహానుభావుడు తొండమండలాధీశుడైన ఆకాశరాజు. తొండమానుడు ఆకాశరాజు సోదరుడు. అమిత శ్రీనివాస భక్తుడు. స్వామి ఆజ్ఞపై తిరుమల భవ్య మందిర నిర్మాణము చేయించిన ధన్యజీవి. బ్రహ్మాది దేవతలు నిత్యం వచ్చి శ్రీవేంకటపతిని సేవించుకునేది తొండమానుడు కట్టించిన ఆలయంలోనే. తొండమానుడు ఎంతటి భక్తుడంటే నిత్యము స్వామితో సంభషణలు చేసేవాడు!
ఇలా ఉండగా ఒకరోజు ఆకాశవాణి ఆహా! ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా! శ్రీనివాసుని ప్రతి కైంకర్యుము నీచేతుల మీదిగా శ్రద్ధాభక్తులతో రంగ రంగ వైభవంగా చేయిస్తున్నావు. రాజా! నీవంటి విష్ణుభక్తుడు లేడయ్యాఅని అన్నది. అంతవరకూ స్వామిగురించి తప్ప ఏమీ ఆలోచించని తొండమానుడు ఆకాశవాణి మాటలు నిజమే కదా! నావంటి భక్తుడు అరుదుఅని అనుకున్నాడు.
ఆహా! అహంకారమెంత దారుణమైనది. చివరికి మహనీయుడైన తొండమానుని సైతం విడువలేదు! అహంకారమే సకల దురుతాలకు మూలము. అహంకారం గర్వం ఎంత కొంచమైనా అది ఉన్నవాడిని నిలువునా దహించివేస్తుంది. కానీ స్వామి సామాన్యుడా? ఒక్కసారి త్రికరణశుద్ధిగా శరణువేడిన పరమ శత్రువునైనా దరిజేరుస్తాడు (ధర్మజ్ఞః కథ చూడండి). అలాంటిది సర్వసుగుణవంతుడు మహాభక్తుడు అయిన తొండమానుని పతనం జరగనిస్తాడా? లేదు. వెంటనే తొండమానునికి గుణపాఠం నేర్పాలని నిశ్చయించుకున్నాడు స్వామి.
ఒకరోజు తొండమానుడు స్వామితో సంభాషించుచూ నావంటి భక్తుడు ఈ ముజ్జగాలలో లేడు. అసలు నేను తప్ప నీకు నిజభక్తులు ఎవరైనా ఉన్నారా దేవాదిదేవా?” అని ప్రశ్నించాడు. జగన్నాటకసూత్రధారి అప్పటికి చిరుమందహాసముతో సమాధానమిచ్చిఆ తొండమానునికి గుణపాఠం చెప్పే నాటకానికి అప్పుడే శ్రీకారం చుట్టాడు.
ఒకరోజు తొండమానుడు రోజూలానే ఉదయాన్నే స్వామి దర్శనము చేసుకొని నిశ్చల భక్తితో ఆ పరమపురుషుని ధ్యానించి కలిదోషనివారణములైన శ్రీపాదలను చూశాడు. శ్రీహరిపాదం చుట్టూ ఉన్న కోట్లాది సౌర్యమండలాల వలె ప్రకాశిస్తున్నాయి తొండమానుడు పూజించిన సువర్ణ కమలాలు. కాని ఆశ్చర్యమ్! కన్నులు మినుమిట్లు గొలిపే ఇంతటి సువర్ణకాంతులలోను రాజుకు వాడిపోయి మట్టి అంటుకొని ఉన్న కమలాలు తులసీదళాలు కనబడ్డాయి. ఏమిటీ చిత్రమ్? వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి అయినా ఈ సుమాలిక్కడికి ఎలా వచ్చాయి? నేను స్వామిని స్వర్ణ కమాలతో తప్ప పూజించను కదా!అని తర్కించుకొని నేరుగా స్వామినే ఈ ప్రశ్నవేశాడు. ఆ దయామయుడు చిరుమందహాసముతో ఇలా సమాధానమిచ్చాడు.
నాయనా! ఇక్కడికి కొంత దూరములో ఉన్న పేదపల్లెలో ఒక సామాన్య కుమ్మరి ఉన్నాడు. అతని పేరు భీముడు. పాపం అతనికి నేనంటే ఎనలేని భక్తి ప్రేమ. అతనుండే ఇంటి మట్టి గోడలో ఒక గూడు చేసి అందులో నా కఱ్ఱబొమ్మ ఒకటి మలచి అందులో నన్ను భావించుకొంటూ పూజిస్తుంటాడు. భక్తుడు ఎక్కడ భావిస్తే అక్కడ దీపించడం నా బాధ్యత కదా! ప్రహ్లాదుని కథ నీకు తెలియనిది కాదుకదా! పాపం అతనికి మంత్రతంత్రాలు తపోయోగాలు ఏమీ తెలియవు. అయినా త్రికరణశుద్ధిగా నిరంతరం నన్ను ధ్యానిస్తూనే ఉంటాడు. తాను కుండలు చేస్తున్నా అన్నం తింటున్నా ఎప్పుడు నా ఊసే! నా ధ్యాసే!
తన కులాచారం ధర్మం ఎల్లవేళలా పాటిస్తాడు. సూర్యోదయాత్పూర్వమే లేచి తనకు తెలిసిన రీతిలో స్నానాది శౌచములు ఆచరించి నా పేరు స్మరిస్తూ తులసీదళాలు సమర్పిస్తాడు. అక్కడ అతడు వేసిన దళాలే నీకిక్కడ కనబడుతున్నాయి. అతనే కాదయ్యా వారి కుటుంబమంతా అంతే. నా మాట నా పాట తప్ప వారికేదీ రుచించదు. ఆ భీమ కులాలుని భక్తిపాశాలకు బంధీ అయిపోయానయ్యా!
విషయం తెలిసింది తొండమానునికి. భాష్పపూరితనయనాలతో ప్రభూ!అని ఆర్తితో పిలిచి స్వామిపాదాలపైపడి జగన్నాథా! నా తప్పు క్షమించు. నావంటి భక్తుడు లేడని అహంకరించాను. నేను చూసిన ప్రపంచమెంత? నా అనుభవం ఎంత? నాపై దయతో నా బుద్ధిదోషాన్ని పోగొట్టి నిజమైన భక్తుని చేశావు తండ్రీ. ఇదుగో ఇప్పుడే వెళ్ళి భీముని దర్శనము చేసుకొని వస్తాను. నాకు సెలవు ఇవ్వుఅని చెప్పి బయలుదేరాడు రాజు.
నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవౌ |
మద్భక్తాః యత్రగాయంతి తత్ర తిష్ఠామి నారద!
అన్న సూక్తి ప్రకారము భీముని దర్శనము తీర్థయాత్రగా భావించి రాజు నడుచుకుంటూ వెళ్ళాడు. పుణ్యక్షేత్రాలకు కాలినడకనే ప్రయాణము చేయాలి కదా! భీముని ఇల్లు చేరాడు రాజు. భీముని ఇల్లు స్వామి భజనలతో మారుమ్రోగుతున్నది. భీముని పాదాలపైపడి అయ్యా! శ్రీ వేంకటేశుని ద్వారా నీ మహాత్మ్యము తెలిసుకున్నాను. సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే నీ భక్తిని కొనియాడాడయ్య! నీ పాదధూళి తాకి పునీతుడని అవుదామని వచ్చానుఅని అన్నాడు తొండమానుడు. చక్రవర్తి ఏమిటి నా పాదలు తాకడం ఏమిటి అని వెనక్కు జరిగిపోయి చేతులు జోడించి రాజా! అంత పని చేయద్దు. స్వామికి దివ్యాలయం కట్టించిన మహానుభావుడవు నీవుఅని అన్నాడు.
ఇంతలో గరుడారూహుడై స్వామి లక్ష్మీదేవితో సహా ప్రత్యక్షమైనాడు. భీముని ఆనందానికి అంతులేదు. ఓ దయామయ! నా పూరి గుడిసెకు వచ్చావా! నీ లీలలే లీలలయ్యా. మా తప్పులెన్నక దయావర్షం కురిపించే కాలమేఘానివి స్వామీ నీవు. నేను హనుమంతుని వలె వారధిదాటి నిన్ను మెప్పించలేను, శబరివలె భక్తిశ్రద్ధలు చూపి నిన్ను ఆకట్టుకోలేను, జనకుని వలె సీతను ఇవ్వలేను, నారదుని వలె గంధర్వగానముతో నీ గుణగణాలను కీర్తించలేను, జటాయువు వలె నీకై నా ప్రాణాలు ఇవ్వలేను అయినా నిన్ను శరణువేడిన నన్ను కరుణించిన కరుణామూర్తివి నాయనా నీవుఅని స్తుతించాడు. భీముడిలా తన్మయత్వంతో ఆడిన మాటలను వేదమంత్రాలు వింటున్నంత ప్రీతితో విన్నాడు స్వామి.
మహాభక్తురాలైన భీముని భార్య తమాలినీ కూడా గద్గద స్వరంతో అమ్మని కీర్తించింది. ఆదిదేవుడు మహాలక్ష్మి స్వయంగా తన యింటికివచ్చారు. వారికి ఇవ్వదగినది ఏమీ లేదే అని బిడియపడింది. అది గమనించి శ్రీనివాసుడు తమాలినీ! నీ చేతితో ఏది వండి ఇచ్చినా తింటానమ్మాఅని అన్నాడు. తమాలినీ సంతోషానికి పట్టపగ్గాలులేవు. తనకు పెద్దల వలన తెలిసినంతలో యథాశక్తిగా శుచితో తామర తూడ్లతో వంటకాన్ని వండి లక్ష్మీనారాయణులకు వడ్డించింది. తృప్తిగా ఆరగించారు అలమేలుమంగాశ్రీనివాసులు. తొండమానుడు చూస్తుండగానే దివ్యశరీరధారులై వైకుంఠధామానికి చేరారు భీమకులాల దంపతులు.
ఇదంతా ఆశ్చర్యంగా చూసిన తొండమాను ప్రభూ! నా సంగతేమిటిఅని ప్రాధేయపడ్డడు. అప్పుడు జగన్నాథుడు రాజా! తరువాత జన్మలో నీవు విరాగివై నా ఏకాంతభక్తుడవు అవుతావు. అప్పుడు తప్పక నీకు ముక్తి లభిస్తుందిఅని చెప్పి తొండమానుని ఊరడించాడు. ఇలా తొండమానునికి భీమునికి ముక్తిని ప్రసాదించాడు శ్రీవేంకటేశుడు.
పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాము:
1.     అహంకారం ఎంతవారికైనా ఎంతకొంచమైనా తగదు. మహనీయుడైన తొండమానునికే అహంకారము వలన భంగపాటు తప్పలేదు. ఇక సామాన్యులమైన మనసంగతి ఏమిటి? కాబట్టి మనమెల్లప్పుడు వినయవిధేయతలతో ఉండాలి.
2.     కులధర్మం కర్తవ్యం పాటిస్తూ స్వామిని నిష్కల్మష భక్తితో కొలిచే వారిని కరుణిస్తాడు భగవంతుడు అని నిరూపించాడు భీముడు. కులం కన్నా గుణం ప్రధానం కదా!

శంఖ లిఖితుల కథ



పూర్వం శంఖుడు లిఖితుడు అనే ఇద్దరు సోదరులు ఉండేవారు. వారు బాహుదానదీ తీరములో ఆశ్రమాలను నిర్మించుకొని తపస్సు చేయసాగినారు. ఇలా ఉండగా ఒకరోజు అన్నగారిని చూడలనిపించి లిఖితుడు శంఖుని ఆశ్రమమునకు చేరుకున్నాడు. అన్నగారు ఎక్కడో బయటికి వెళ్ళారని తెలుసుకొని ఆశ్రమములోని ఒక చెట్టునీడలో కూర్చుని దాని పండ్లలు తింటూ అన్నగారికోసం నిరీక్షించాడు. వేదవేదాంగ పారంగతుడైన శంఖుడు వచ్చి తన తమ్ముని చూసి సంతోషించాడు. ఆతడు పండ్లను ఆరగించటం చూచితమ్ముడూ! ఈ పండ్లు నీకెక్కడివిరా?” అని అడిగాడు. లిఖితుడు చెప్పినది వినిప్రియసోదరా! ఇది తప్పు కదా! అజమానినైన నేను లేని సమయములో నా అనుమతిని పొందకనే ఫలములను తీసుకునుట అపరాధమని నీవెఱుగవా? మన మహారాజుగారి వద్దకు వెళ్ళి నీవు చేసిన తప్పుకి తగిన శిక్షని అనుభవించి రా!అని అన్న అయిన శంఖుడు ఆజ్ఞాపించినాడు.
తండ్రి తరువాత తండ్రంతటి అన్న మాట తప్పని లిఖితుడు వెంటనే సుద్యుమ్న మహారాజు వద్దకు పరుగెట్టాడు. మునీంద్రుడు వచ్చాడని తెలియగానే ధర్మాత్ముడైన సుద్యుమ్న మహారాజు ఎదురేగి అర్ఘ్యపాద్యాదులర్పించి పూజించాడు. అప్పుడు లిఖితుడు పార్థివకులభూషణ! ఈ పూజలకు నేను అనర్హుడిని. నేను మా అన్నగారు లేని సమయములో ఆయన ఇంటికి వెళ్ళి చెట్టుకున్న పండ్లను ఆయన అనుమతి లేకుండా కోసుకొని తిన్నాను. కనుక నేను చేసిని ఈ దొంగతనానికి తగిన రీతిలో శిక్షవేసి నన్ను రక్షించు. రాజదండన పొందిన వానికి యమదండన ఉండదని మా అన్నగారు నాకు హితవు చెప్పారుఅని ప్రార్థించాడు. తపశ్శక్తితో లోకాలకు హితవు చేసే మిమ్ము ఎట్లు శిక్షించము?” అని నచ్చచెప్పినా లిఖితుడు తన పట్టువదలలేదు.
చివరికి సుద్యుమ్నుడు దండనీతి శాత్రాన్ని అనుసరించి లిఖితుని చేతులు నరికించాడు. లిఖితుడు ఎంతో సంతోషించి మహారాజును మనసారా ఆశీర్వదించి అన్నగారి వద్దకు పరుగెట్టాడు. శిక్షను అనుభవించి పునీతుడై వస్తున్న తమ్ముని చూచి శంఖుడు నాయనా! మంచి పని చేశావు. నీవంటి ఉత్తముని వలన మన వంశమంతా ఉద్ధరింపబడుతుంది.
మద్యపానము, గురుపత్నిని ఆశించడము, విప్రుని చంపడము, విప్రుని ధనమును అపహరించడము (లిఖితుడు తెలియక చేసిన తప్పు ఇదే) మరియు ఈ పనులను చేసేవారితో కలిసి తిరగడము ఇవ్వి పంచమహాపాతకాలు. నువ్వు తగిన రాజదండన పొంది పాప విముక్తుడవైనావు. ఈ బాహుదానదీ పుణ్యజలాలలో మునిగి దేవమునిపితృ తర్పణాలు ఇవ్వుఅని ఆజ్ఞాపించాడు. వెంటానే అన్నగారి ఆజ్ఞపాటించాడు లిఖితుడు. లిఖితుడు బాహుదా నదిలో మునక వేశాడోలేదో తన బాహువులు వచ్చేశాయి! ఆశ్చర్యచకితుడై అన్నగారికి నమస్కరించాడు. శంఖుడు ప్రియసోదరా! నువ్వు చేసిన తప్పుకు శిక్షను అనుభవించి పునీతుడవైనావు కావున భగవంతుడు నిన్ను కరుణించినాడు. బాహుదానదీ మహాత్మ్యము నా తపశ్శక్తి ప్రభావము నీ చేతులు మొలవటానికి దోహదం చేశాయి. దండనీతిని సక్రమముగా అనుసరించి నిన్ను కాపాడిన సుద్యుమ్న మహారాజు కూడా ధన్యుడుఅని చెప్పాడు.
పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాము:
1.     దండనీతి యొక్క ప్రాముఖ్యత మనకీ కథ ద్వారా తెలిసినది. ఏ తప్పుకు ఏ శిక్షను అనుభవించాలో వవరించి ఈ దండనీతి శాస్త్రము మనలను యమబాధలనుండి కాపాడుతుంది.
2.     తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. చేసిన తప్పుకు శిక్ష ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదు. ఈ విషయము తెలిసిన శంఖుడు తమ్మునిపైన అనుగ్రహముతో మహారాజువద్దకు వెళ్ళి దండన అనుభవించిరమ్మనాడు.
3.     అన్నగారు చెప్పిన హితవును వెంటనే అనుసరించి లిఖితుడు తనంతట తాను రాజు వద్దకు వెళ్ళి చేసిన తప్పొక్కుకుని దండించమని ప్రార్థించినాడు. దండన అనుభవించి పునీతుడైనాడు.
4.     ఈ కథలో అందఱూ తమ కర్తవ్యములను బాగా పాటించి మనకు మార్గదర్శకులైనారు. విప్రులైన శంఖలిఖితులు లోకహితార్థం తప్పస్సులు చేసుకుంటూ కాలము గడిపినారు. దండనీతికోవిదుడైన సుద్యుమ్న మహారాజు లిఖితునికి తగిన శిక్షవేశాడు. లిఖితుడు అన్నగారి మాట జవదాటలేదు. శంఖుడు తమ్ముని శ్రేయస్సునే కోరినాడు.


శుక్రాచార్యులు కచుడు ఆదర్శ గురుశిష్యులు



మహాభారతము లోని కథ
ఇది క్షీరసాగర మంథనమునకు పూర్వం జరిగిన కథ. దేవదానవులకు అమృతకలశం అప్పటికింకా లభించలేదు. దేవదానవ యుద్ధాలు అతి భీకరముగా జరిగేవి. ఇరుపక్షాల ఎందఱో సైనికులు అసువులు బాసేవారు. ఇలావుండగా రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు తీవ్ర తపస్సుచేసి మృతసంజీవనీ విద్యను సంపాదించాడు. ఇంకేమున్నది? యుద్ధములలో చచ్చిన రాక్షసులను సంజీవనీ విద్య ద్వారా బ్రతికించేవాడు శుక్రుడు. వాళ్ళు మళ్ళీ దేవతలపై పడి పోరుసాగించేవారు. దేవతలు ఎంత బలవంతులైనా ఇలా జరిగేసరికి వారి శక్తి క్షీణించసాగినది. మంచికి అపజయం కలుగుట చూడలేని దేవతాగురువు బృహస్పతుల వారు తన కుమారుడైన కచుని పిలిచి శుక్రుని శిష్యుడవై మృతసంజీవని అభ్యసించిరమ్మని ఆదేశించాడు.
పాపభీతి లేని రాక్షసులతో వ్యవహారము తన కుమారుని ప్రాణాలకే అపాయమని తెలిసికూడా ధర్మస్థాపనార్థం తన కుమారుని ఆ అసాధ్యకార్యము నిర్వర్తించుకొని రమ్మని పంపినాడు బృహస్పతి. పిత్రాజ్ఞాపాలకుడైన కచుడు వెంటనే బయలుదేరి శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి సాష్టాంగ ప్రణామము చేసి గురుభ్యోనమః స్వామీ నేను ఆంగీరస గోత్రజాతుడను. దేవగురువులైన బృహస్పతులవారి తనయుడను. నన్ను కచుడని పిలుస్తారు. విద్యార్థినై మీ వద్దకు వచ్చానుఅని ప్రార్థించాడు. కచుని వినయానికి సంతోషించి శుక్రుడు నాయనా! వినయవిధేయతలే విద్యార్జనకు ప్రథమ సోపానాలు. నీవంటి అర్హుడిని శిష్యుగా స్వీకరించుట నాకు ఆనందదాయకముఅని ఆశీర్వదించి తన శిష్యబృందములో చేర్చుకొన్నాడు.
కచుడు రోజూ సూర్యోదయాత్పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకుని సలిలోదకాలతో స్నానాది క్రియలు నిర్వహించి సంధ్యావందనాది ఆహ్నికాలు యథావిధిగా చేసేవాడు. తీవ్రమైన బ్రహ్మచర్య నిష్ఠను అవలంభిస్తూ ఎంతో ప్రీతితో గురుశుశ్రూష చేసేవాడు. భక్తి ఏకాగ్రతలతో వేదశాస్త్రాలు అభ్యసించేవాడు.
శుక్రాచార్యునికి యవ్వని త్రిలోకసౌందర్యవతి దేవయాని అను పేరుగల కుమార్తె ఉండేది. ఆమె సౌందర్యం అద్వితీయమ్. పైగా కచునిపై మనసుపడింది. కానీ కఠోర బ్రహ్మచర్యవ్రతుడైన కచుడు ఆమెను సరిగా చూడనుకూడా లేదు. కచుడు గురుపుత్రి అయిన దేవయానిని సోదరిగా భావించేవాడు. కచుని వినయం సంస్కారం విద్యలపైనున్న కుతూహలం అతనిని శుక్రునికి ఎంతో ప్రియునిగా చేసినాయి.
కచుని మంచితనం చూచి అసూయతో మిగతా రాక్షస శిష్యులందఱూ సమావేశమై ఇలా అనుకొన్నారు వీడు మన శత్రువుల పక్షము. వీడికి మృతసంజీవనీ విద్య లభిస్తే అది మనకు అపాయకరము. కనుక వీడిని చంపి పారేద్దాము”. శుక్రుని గోవులను కాచి అడవినుంచి ఇంటికి తిరిగివస్తున్న కచుని నిర్దాక్షిణ్యంగా చంపేశారు ఆ రక్కసులు. కచుడు రావటం ఆలస్యమైనదని చింతించి దేవయాని తండ్రితో నాన్నా! ఎంత అవసరం వచ్చినా కనీసం సాయంకాల సంధ్యావందన సమయానికైనా ఆశ్రమానికి తిరిగి వచ్చేవాడు కచుడు. కానీ ఇవాళ ఇంత ప్రొద్దెక్కినా ఇంత వరకూ రాలేదు. దయచేసి మీ దివ్యదృష్టితో కచుని జాడ తెలుసుకోండిఅని ప్రార్థించింది. శుక్రుడు దివ్యదృష్టితో జరిగినది తెలుసుకున్నాడు. వెంటనే తన మృతసంజీవనీ విద్యతో కచుని బ్రతికించాడు.
ఈర్ష్యాగ్నిచే జ్వలించబడుతున్న రాక్షసులకు ఈ విషయము తెలిసినది. మరునాడు మళ్ళీ కచుని సంహరించి దేహాన్ని కాల్చి బూడిద చేసి దాన్ని మదిరలో కలిపి వినయంగా శుక్రిని ఇచ్చారు. శుక్రుడు ఆ మదిరను పానముచేశాడు. కచుడు ఎంతకీ రాకపోయేసరికి దేవయాని మళ్ళీ తండ్రితో మొరపెట్టుకున్నది. శుక్రుడు దివ్యదృష్టితో జరిగినది తెలుసుకుని ఎంతో బాధ పడి ఈ రాక్షసులు చాలా కిరాతకులు. తెలియకుండా నేనెంత తప్పుచేసాను! ఈ మదిరాపానము చాలా ఘోరమైనది. దీని మత్తు ప్రభావము వలన నా వివేచన నశించినదిఅనుకొని ఇకపై ఎవరిచే ఇట్టి తప్పులు జరుగరాదని ఈ విధముగా కట్టడి చేసినాడు:
ఎంత కొంచమైననూ మదిరాపానము చేయరాదు. అది మహాపాపము”. ఇలా ధర్మనియమం తెలియజెప్పి మళ్ళీ ఇలా అన్నాడు కానీ తెలిసిచేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదా! నేను చేసిన తప్పును సరిదిద్దుకొనెదను. మృతసంజీవనీ విద్యను నా కడుపులో సూక్ష్మ రూపములో ఉన్న కచునకు ఉపదేశించెదను. ఆపై అతనిని బ్రతికించెదను. కచుడు నా ఉదరము చీల్చుకువచ్చి మృతుడనైన నన్ను బ్రతికించెదడు”. శుక్రుడు అలాగే చేశాడు. కచుడు శుక్రగర్భం నుంచి బయటకు వస్తూనే గురువు గారిని బ్రతికించినాడు. ప్రణామము చేసి శుక్రుని వద్ద సెలవు తీసుకొని ఇంటికి బయలుదేరినాడు.
అప్పుడు దేవయాని తన ప్రేమను వ్యక్త పఱచి తనను వివాహమాడమని నిర్బంధించింది. అంతట కచుడు సోదరీ! నీవు నా గురు పుత్రికవు. కావున నాకు చెల్లెలివి అవుతావు. నీకిట్టి అధర్మ కోరిక కలుగరాదుఅని హితవు చెప్పాడు. నిరాకరించిన కచునిపై క్రోధిత అయి దేవయాని కచుని ఇలా శపించినది నన్ను హింసించిన ఫలముగా ఈ విద్య నీకు ఉపకరించదు పో”! దేవయాని అమాయకత్వాన్ని చూసి ఇలా సమాధానమిచ్చాడు కచుడు
చెల్లీ! విద్య ఎన్నడూ నిరుపయోగం కాదమ్మా! ఈ విద్య నాకు ఉపకరించక పోతేనేమి? అర్హులైన పరులకు నేర్పి వారికి ఉపయోగపడతాను. సమాజశ్రేయస్సుకై నా విద్య ఉపకరించుట కన్న నాకేమి కావాలి”? అని చెప్పి ఆనందముగా తిరిగి వెళిపోయాడు కచుడు.
పిల్లలూ! మనమీ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాము:
1.     దేశంకోసం ఒక గ్రామాన్ని, గ్రామం మేలుకై ఒక కుటుంబాన్ని, కుటుంబ శ్రేయస్సుకై ఒక కుటుంబ సభ్యుని త్యజించుట ధర్మము. ఈ సూక్ష్మం ఎఱిగిన బృహస్పతి తన ప్రియ కుమారుని ప్రాణాలను సైతం లెక్కసేయక దేవతలను కాపాడటానికి కచుని రాక్షస గురువు వద్దకు పంపించాడు.
2.     శత్రువని తెలిసి కూడా అర్హుడైన వాడు కాబట్టి కచునికి సంతోషముగా విద్యనేర్పించి ఆదర్శ గురువైనాడు శుక్రుడు. కచుడు శ్రద్ధాభక్తులతో విద్యలను అభ్యసించాడు. దేవయాని పట్ల ప్రవరాఖ్య నిగ్రహం చూపించి ఉత్తమ శిష్యుడైనాడు కచుడు. కావున మనకు ఈ శుక్రకచులు ఆదర్శప్రాయులు కావాలి.
3.     ఈర్ష అనేది పెనుభూతము. మత్సరముచే దారుణముగా కచుని చంపివేసినారు రాక్షసులు. అట్లు చేసి కచునికి సంజీవనీ మంత్రోపదేశం కలుగుటకు చేచేతులారా వారే కారణమైతిరి. వివేకహీనులు తెలియకనే వారికి వారే కీడు కలిగించుకొనెదరు.
4.     మదిరాపానము మహాపాపము   ). ఈ విషయమును మరొక్కమాఱు మనకు తెలియజేశాడు శుక్రుడు.
5.     గురుపుత్రిక సోదరి అని గ్రహించి దేవయానిని సోదరీభావముతో చూసిన కచుని ధర్మజ్ఞత మనకు కనువిప్పు కావాలి.
6.     చోరులచే చోరింపబడనిది అర్హులకు పంచి ఇస్తే పెరిగేదీ విద్యాధనమొక్కటే. విద్య యొక్క గొప్పతనము మనకు కచుని అమృతవాక్కుల ద్వారా ఈ కథలో తెలిసినది. మనమెప్పుడూ సమాజశ్రేయస్సునకే విద్యను ఉపయోగించాలి. విద్యాభ్యాసమునకు సార్థకత అప్పుడే కలుగును.




శ్రీకృష్ణ లీలలు వ్యోమాసుర భంజనమ్




శ్రీ గర్గభాగవతము లోని కథ
ఒకరోజు నందనందనుడు గోపాలురతో కలిసి ఆడుచుండెను. కొందఱు గోవులుగా మరికొందఱు మేకలుగా కొందఱు చోరులుగా మరియు కొందఱు పసులకాపరులుగా విడివడి ఆడుచుండిరి. కంసప్రేరితుడైన వ్యోమాసురుడు చోరుల గుంపులో చేరి గోవులుగా మేకలుగా గోపాలురుగా నటిస్తున్న బాలులను ఎత్తుకొని పోయి ఒక బిలమున దాచి బిలద్వారము మూసివేసెను. పరమాత్మ అది గ్రహించి రక్కసుని రెండుకాళ్ళు పట్టుకొని గిరగిరా త్రిప్పి నేలపై విసిరిగొట్టెను. మృతుండైన వ్యోమాసురుని లోని తేజస్సు పరమాత్మలో లీనమయ్యెను.

వ్యోమాసురుని చరిత్ర
పూర్వం మహాపుణ్యక్షేత్రమగు భవ్య కాశీనగరమును భీమరథుడు అను రాజేంద్రుడు పరిపాలించెడివాడు. అతడు మేధావి దానశీలి ధర్మజ్ఞుడు పైగా శ్రీహరి భక్తుడు. రాజ్యభారమును యోగ్యుడైన కుమారునికి అప్పగించి రమేశుని పై అనురక్తుడై తపముకై మలయపర్వతమునకు ఏగెను. అక్కడ ఆశ్రమములో నివసించి తపమును సాగించుచుండెను.
ఒకనాడు బ్రహ్మమానస పుత్రుడు పరమపూజ్యుడు అయిన పులస్త్య మహర్షి శిష్యవర్గముతో భీమరథుని ఆశ్రమమునకు వచ్చెను. త్రిలోకపూజ్యుడైన పులస్త్యునకు రాజు నమస్కరించెనే కానీ యథావిధి అతిథి సత్కారము చేయలేదు. ధర్మము తప్పినందుకు మహర్షి రాజా! ఇంటికి వచ్చిన వానిని సత్కరింపకుండుట అసురలక్షణము. కావున నీవు రాక్షసుడివి కమ్ము”! అని శపించెను. పశ్చాత్తాపముతో శరణువేడిన రాజును కరుణించి పులస్త్యుడు నీ దుష్కర్మకు ఫలితమనుభవించక తప్పదు. కానీ నీవు అఖండ విష్ణుభక్తుడవగుటచే నీకు ద్వాపరయుగములో శ్రీకృష్ణపరమాత్మ అనుగ్రహము కలుగును. భగవంతుడు భక్తుల కెన్నడు అపజయము కలిగించడు కదా!అని ఆశీర్వదించెను. ఆ భీమరథుడే వ్యోమాసురుడు.
కావున పిల్లలూ! మనమెన్నడు ఇంటికి వచ్చిన అతిథిని సత్కరింపక ఉండరాదు. అభ్యాగతః స్వయం విష్ణుః అన్న సూక్తిని మఱువరాదు.



నాడీజంఘుని క్షమాగుణమ్



మహాభారతము లోని కథ
పూర్వం ఒకానొక గ్రామములో బ్రాహ్మణాధముడొకడు ఉండేవాడు. అతడు తన స్వధర్మమును వీడి వేదశాస్త్రాధ్యయనములు మఱచి చివరికి ఒక బోయదాని వివాహమాడి మాంస భక్షకుడై నిత్యము హింసాజీవితాన్ని గడపసాగినాడు. ఇంద్రియసుఖములే ఉత్తమమనుకొనేవారు విషయవాంఛలతో లోకోపకరమైన ధర్మమును విడనాడి మహాదురితాలను సైతం చేయుటకు వెనుకాడరు కదా!
అతడొకమాఱు ధనాపేక్షతో కొందఱు వ్యాపారులతో కలసి వాణిజ్యార్థము దేశాంతరం వెళ్ళాడు. మార్గమధ్యములో ఒక భీకరకాంతారమును వారు దాటుచున్నప్పుడు మత్తగజమొకటి వారిని తరిమినది. ప్రాణభీతితో వారు తలకొకవైపుకు పరుగులెట్టారు. ధర్మభ్రష్టుడైన బ్రాహ్మణుడలా తన మిత్రులనుండి దూరమై గహనాటవిలో దారిదప్పి తీవ్ర క్షుత్పిపాసలతో సొమ్మసిల్లి ఒక పెద్ద మఱ్ఱిచెట్టు వద్ద కూలబడ్డాడు.
ఆ వృక్షము నాడీజంఘుడనే ధర్మవర్తనుడైన బకరాజు నివాసము. నాడీజంఘునికిరాజధర్ముడుఅనే సార్థక బిరుదు కూడా ఉన్నది. సృష్టికర్త అయిన చతుర్ముఖుడు నాడీజంఘుని మిత్రుడు. ఆకలిదప్పులతో వచ్చిన భ్రష్టవిప్రుని చూసి నాడీజంఘుడు జాలిపడి అతిథిభావముతో అతని సత్కరించి ఫలోదకాలిచ్చి తృప్తి పఱచినాడు. తన పెద్ద రెక్కలను విసనకఱ్ఱ వలె వీచి సేదతీర్చాడు. అప్పటికే రాత్రి అవడముతో నాడీజంఘుడు విప్రాధమునితో ఇలా అన్నాడు మహానుభావా! మీరు నాకు మిత్రులైనారు. మిత్రుని బాధలు తీర్చుట కనీస కర్తవ్యము. ఇక్కడికి మూడుయోజనాల దూరములో మధువ్రజమనే రాజ్యమున్నది. దాని రాజైన విరూపాక్షుడు నా ప్రియమిత్రుడు. అతడు రాక్షసుడైననూ పరమశాంతుడు ధార్మికుడు. అతని వద్దకు మీరు వెళితే తప్పక మిమ్ము సత్కరించగలడు. ఱేపు ప్రొద్దున్నే బయలుదేరి వెళ్ళవచ్చు. ఇప్పుడు నిశ్చింతగా విశ్రమించండి”.
అతిథిసేవా నిరతుడైన నాడీజంఘుడిలా వాక్సుధలను చిలికించి బ్రాహ్మణుని వన్యమృగాలనుండి కాపాడుటకై రాత్రంతా మేల్కొని రక్షణనిచ్చాడు. ఉదయాన్నే బ్రాహ్మణుడు మధువ్రజమునకు బయలుదేరినాడు. నాడీజంఘుని మిత్రుడని తెలియగానే విరూపాక్షుని వద్దకు బ్రాహ్మణుని సగౌరవముగా తీసుకువెళ్ళారు మధువ్రజ రాజసేవకులు.
ఒకవ్యక్తి ఆచరించే ధర్మాధర్మాలు భావాలు అతడి ఆకృతిలో స్పష్టముగా ప్రతిబింబిస్తాయి. ధర్మాత్ముడు పైగా రాజు అవడముతో బ్రాహణుడు కులభ్రష్టుడు నీచుడు అని చూడగానే పసిగట్టాడు విరూపాక్షుడు. కానీ నాడీజంఘుని మిత్రుడు అని అతనిని సగౌరవముగా సత్కరించి ఎంతో ధనమిచ్చి పంపించాడు విరూపాక్షుడు. మోయలేనన్ని ధనరాసులను పేరాశతో మోస్తూ తిరిగి నాడీజంఘుని నివాసము చేరాడు పతిత బ్రాహ్మణుడు. నాడీజంఘుడు మళ్ళీ యథావిధిగా ఆతిథ్యమిచ్చి సేదతీర్చాడు. అలసి ఉన్న బ్రాహ్మణుడు ఆదమఱచి నిదుర పోయాడు.
మన జీవన విధానం మన ఆలోచనల్ని బుద్ధిని ప్రభావింపజేస్తుంది (సత్యసంధః కథలో సీతమ్మ చెప్పిన ఋషికథ ఇందుకు నిదర్శనము). కనుకనే భారతీయులు సద్భావ సత్ప్రవర్తనలను ఆచారముల ద్వారా వారి దైనందిన జీవితములలో అలవరచుకుని ఎల్లప్పుడు ధర్మమార్గముననే చరిస్తారు. దయయే స్వభావముగా కలిగి దయాళువు అయినవాడే విప్రుడు. అట్లుకాక నిరంతరము కౄరకర్మములు చేయుట వలన ఆ పతిత బ్రాహ్మణుని బుద్ధి వక్రమైనది. అన్నం పెట్టి ఆదరించి క్రొత్త జీవితాన్ని ప్రసాదించిన నాడీజంఘునిలో పతితబ్రాహ్మణునికి భగవంతుడు కనబడలేదు. ఒక రుచికరమైన భోజనం కనబడింది! బలిష్టమైన నాడీజంఘుని దేహాన్ని బ్రాహ్మణుడు చూచి ఇలా అనుకొన్నాడు ఱేపటి నుంచి నేను ఇల్లు చేరేలోపల మళ్ళి ఆహారము దొరుకుతుందో లేదో. పైగా ఈ కొంగ బలిష్టముగా ఉంది. దీని మాంసము ఎంతో రుచికరముగా ఉంటుంది. దీన్ని చంపి మాంసము మోసుకు వెళతాను”. వెంటనే దొడ్డుకఱ్ఱ తీసుకొని నాడీజంఘుని తలపై బలంగా కొట్టాడు. ఆ శిరోఘాతానికి అసువులు బాసాడు నాడీజంఘుడు! చర్మం వొలిచి మాంసాన్ని మూటకట్టుకొని ప్రణాయమయ్యాడా దురితుడు.
మనకు ప్రియులైన వారు ఎంత దూరములో ఉన్నా వారికి ఆపద వస్తే మన హృదయం స్పందిస్తుంది. తన ప్రియమితునికి ఏదో కీడుసంభవించిందని తెలుసుకొని విరూపాక్షుడు తన సైనికులను విషయము కనుక్కొని రమ్మని పంపించాడు. వారు జరిగిన దారుణము తెలుసుకొని విరూపాక్షునికి నివేదించారు. అతని ఆజ్ఞపై పతితవిప్రుని బంధించి తెచ్చారు. కృతఘ్నుడు మిత్రద్రోహి అయిన బ్రాహ్మణుని చూచి విరూపాక్షుడు భటులారా! కృతఘ్నతకు మించిన మహాపాపములేదు. వీడిని ఖండఖండాలుగా నరికి తినివేయండి. రాక్షసులు కాబట్టి మీరు నరమాంసము తినవచ్చుఅని ఆజ్ఞాపించాడు.
క్షమించండి మహారాజా! ఇటువంటి పాపాత్ముడి మాంసం వాసనకూడా మేము చూడలేముఅని భటులుచెప్పి కుక్కలకు వేశారు. కుక్కలు కూడా ఆ కృతఘ్నుని మాంసము ముట్టలేదు!
నాడీజంఘుని శరీరభాగాలు ఒకచోటచేర్చి దహనసంస్కారాలు యథావిధి కర్మకాండ చెశాడు విరూపాక్షుడు. విధాత తన ప్రియమిత్రుని మరణవార్త విని వెంటనే కామధేనువును నాడీజంఘుని బ్రతికించమని ఆజ్ఞాపించాడు. గోక్షీరములోని అమృతశక్తి ప్రభావముతో నాడీజంఘుడు పునర్జీవితుడైనాడు. బ్రతికిన మిత్రుని చూసి ఎంతో సంతోషించి ఆలింగనము చేసుకొని జరిగినదంతా వివరించాడు విరూపాక్షుడు.
తన ఇంటికి వచ్చిన అతిథి మిత్రుడు అయిన బ్రాహ్మాణుడు సంహరించబడ్డాడని తెలుసుకొని బాధపడ్డాడు నాడీజంఘుడు! వెంటనే బ్రహ్మదేవుని పతితబ్రాహ్మణుని బ్రతికించమని ప్రాధేయపడ్డాడు. విరించి రాజధర్ముని క్షమాగుణాన్ని చూచి అబ్బురపడి అతని ధర్మజ్ఞతకు సంతసించి భ్రష్టవిప్రుని బ్రతికించినాడు. విరూపాక్షుడిచ్చిన ధనము మరల ఇప్పించి సగౌరవముగా బ్రాహ్మణుని ఇంటికి పంపించాడు నాడీజంఘుడు!
ఇది చూసి నాడీజంఘుని మెచ్చుకొని బ్రహ్మదేవుడిలా అన్నాడు నాడీజంఘుని ఔదార్యముతో ఇప్పుడు బ్రతికిపోయినా ఈ అధమునికి నిష్కృతిలేదు. జన్మజన్మాల వరకూ ఈ మహాపాపము వాడిని క్షోభింపజేస్తుంది. చేసిన కర్మ చెడని పదార్థము. ఫలితమనుభవింపక తప్పదు. ఏ పాపానికైనా నిష్కృతి ప్రాయశ్చిత్తము ఉన్నదేమో కానీ కృతఘ్నతకు మిత్రద్రోహానికి మాత్రం లేదు.
మహాత్మా! రాజధర్మా! ప్రియమిత్రా నాడీజంఘా! నీ క్షమా గుణం అద్వితీయము. దేవతలు సైతం నీకు నమస్కరిస్తారు. శుభంభూయాత్”.
పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాము:
1.     మన జీవన విధానం మన ఆలోచనల్ని బుద్ధిని ప్రభావింపజేస్తుంది. ఆచారముతోనే ధర్మవర్ధనము జరుగుతుంది. దైవభీతి పాపభీతి లేనివాడు తనకుతానే కాక సమాజానికి కూడా హానికరము. స్వధర్మమును వీడిన బ్రాహ్మణుడు ఎన్నో దురితాలు చేసి భ్రష్టుడైన వైనం మనకు కనువిప్పు కావాలి.
2.     నాడీజంఘుని (రాజధర్ముని) అతిథిసేవ మిత్రవాత్సల్యం క్షమాగుణములు మనకు ఆదర్శప్రాయములు. ధర్మవర్తనులమైతే బ్రహ్మలోక ప్రాప్తి కరతలామలకము అని నాడీజంఘుడు మనకు చూపినాడు.




Om Tat Sat
                                                        
(Continued...) 

 




(My humble greatfulness to Neethi Kathalu  dot com and  Hindu dot com for the collection) 





(మన భారతీయ సంస్కృతికి సవినయ నివాళి )

నీతి కథలు - 1



















































నీతి కథలు


కృష్ణం వన్దే జగద్గురుమ్





కృష్ణం వన్దే జగద్గురుమ్ – 1



శ్రీమద్భాగవతము లోని కథ
భారతీయుల పాలి పెన్నిధి అయిన గీతామృతాన్ని అందించిన శ్రీ కృష్ణ పరమాత్మ ఇప్పుడే అమ్మాఅనటం నేర్చుకుంటున్నాడు. వామనునిగా భూమ్యాకాశాలను రెండడుగులతో కొలిచిన నల్లనయ్య ఇప్పుడే తప్పటడుగులు వేయడం నేర్చుకుంటున్నాడు. దిన దినాభివృద్ధిగా తల్లితండ్రులకు ఆనందం కలిగిస్తూ పెరుగుతున్నాడు.
బాలకృష్ణుడు గోపబాలురతో కలిసి ఎన్నో అల్లరి ఆటలాడేవాడు. లీలామానుష విగ్రహుడైన ఆ కన్నయ్య అల్లరి నిజమని నమ్మారు గోపికలు. చిన్ని కృష్ణుడు చేసే వినోదాలు తమయెడల అనుగ్రహించిన మహాప్రసాదాలని మహోపదేశాలని పాపం వారు తెలుసుకోలేక పోయారు. యోగీశ్వరేశ్వరుడైన కృష్ణుని తత్త్వం తెలుసుకొనుట ఎవఱి తఱము ?
కన్నయ్య అల్లరి పనులకు ఓర్పు నశించిన గోపిక ఇలా యశోదతో మొఱబెట్టుకున్నదిఅమ్మా! యశోదా! నీ పాపని అల్లరిని ఏమని చెప్పేది? మా యింటిలోని బాలింతలకు పాపం పసి పాపలకు ఇవ్వడనికి పాలులేవు. ఆకలితో గుక్కపట్టి ఏడుస్తున్న పాపలకి గోక్షీరమైనా పడదామని అనుకున్నారు. ఇంతలో మీ పాపడు వచ్చి బాలింతల మొఱలు వినకుండా లేగదూడల త్రాళ్ళు విప్పి ఆవుల వద్ద వదిలేశాడు. అవి ఆవుల పాలు త్రాగివేశాయి. పిల్లలకు పాలు ఇవ్వలేక పోయిన ఆ బాలింతల దుఃఖం వర్ణనాతీతం. ఇది ఏమైనా న్యాయమా? ఓ అంభోజాక్షీ! చెప్పవమ్మ!”.
బాలురకుఁ బాలు లే వని
బాలెంతలు మొఱలు వెట్టఁ బకపక నగి యీ
బాలుం డాలము సేయుచు
నాలకుఁ గ్రేపులను విడిచె నంభోజాక్షీ!
పిల్లలూ! మరి జగద్గురువైన శ్రీ కృష్ణుడు ఈ కథ ద్వారా ఏమి బోధించాలనుకున్నాడో తెలుసుకుందామా?
పిల్లలకు పాలు లేకపోతే మనం ఎంత బాధపడతామో లేగదూడలకు పాలుపట్టినీయకుండా పాలుపిండుకుంటే ఆవులు కూడా అంతే బాధను అనుభవిస్తాయి. సర్వాంతర్యామి అయిన బాలకృష్ణుడు పశుపక్షాదుల బాధలను అర్థం చేసుకొని వాటిని బాధించకుండా వాటితో సహజీవనము చేయాలని మనకు ఈ కథ ద్వారా బోధించినాడు. ఆవులు దూడలకు పాలు ఇచ్చిన తరువాతే మనం మిగిలిన పాలు తీసుకోవాలన్నదే జగద్గురువైన కృష్ణుని ఆంతర్యం (ఈ ధర్మాన్ని పాటించిన దిలీపుని కథ కూడా చదవండి). పశుపక్షాదులను సైతం ప్రేమించి అహింసాయుత జీవనాన్ని లోకానికి బోధించిన భరతభూమి ధన్యభూమి.



కృష్ణం వన్దే జగద్గురుమ్ – 2



శ్రీమద్భాగవతములోని కథ


ఒకనాడు బాలకృష్ణుడు గోపబాలురతో కూడి ఆటలాడుచుండెను. మీరందఱూ వేషధారులు నేను సూత్రధారినిఅంటూ వారితో వింత ఆటలాడేవాడు చిన్నికృష్ణుడు. ఆటలమధ్యలో ఉండగా వారికి కమ్మని కాగిన పాల వాసనలు వచ్చినవి. వారు ఆ వాసనలు వచ్చుచున్న ఇంటిలోకి వెళ్ళారు. అక్కడ వారికి ఎన్నో కడవలనిండా మంచిగా కాగిన కమ్మని పాలు కనిపించాయి. అఖిలలోక వసుప్రదాత అయిన కృష్ణస్వామి కడవలలోని పాలను తన తోడిపిల్లలకు పంచివేశాడు. అంతటితో ఆగకుండా ఖాళీ అయిన కడవలను కూడా పగులగొట్టి వేశాడు.
కన్నయ్య చేతలోని ఆంతర్యం గ్రహించలేక పాపం ఆ ఇంటి పడుచు యశోదతో శ్రీకృష్ణుని దుడుకుపని వివరించి ఓ పడతీ! నీ బిడ్డడు మా ఇంట ఇటువంటి అల్లరి చేశాడు. అసలు మీ వాడికి భయభక్తులు ఉన్నాయా?” అని వాబోయింది. ఆ లీలామానుషవిగ్రహుని అర్థం చేసుకొనుట ఎవరి తఱం ?
పడఁతీ! నీ బిడ్డఁడు మా
కడవలలో నున్న మంచి కాఁగిన పా లా
పడుచులకుఁ బోసి చిక్కిన
కడవలఁ బో నడిచె నాజ్ఞ గలదో లేదో?
పిల్లలూ! మరి జగద్గురువైన శ్రీ కృష్ణుడు ఈ కథ ద్వారా ఏమి బోధించాలనుకున్నాడో తెలుసుకుందామా?
పాలుఅనే శబ్దము పంచుకోదగిన పదార్థమునకు సంకేతము. అందుకనే మన తేనెల తెలుగు భాషలో పాలుపంచుకొనుటఅనే ప్రయోగం ఉన్నది. నలుగురికీ ఉపయోగపడే పదార్థమును పంచుకోకుండా తమకోసమే నిలువ చేసుకోరాదని శ్రీ కృష్ణ జగద్గురువు మనకీ కథ ద్వారా బోధించాడు. అందుకనే మిగిలిన కడవలను కూడా పగులగొట్టి పంచుకో తగినవి నిలవచేసుకోనీయకుండా చేశాడు. మీ-మా అనుభేదాలు మఱచి తోటి జనులతో సహజీవనము చేయమన్నదే ఆ సర్వేశ్వరుని సందేశం.



కృష్ణం వన్దే జగద్గురుమ్ – 



శ్రీమద్భాగవతములోని కథ



శ్రీకృష్ణుడు బాలురందఱిలోనూ చాలా ఉత్తముడు. ఆతని బాల్యక్రీడలు లోకహితార్థములైన మహోపదేశాలే కాని అల్లరి పనులు కావు. విష్ణుమాయచే మోహితులైన గోపికలు శ్రీకృష్ణుడు ఒక బాలుడని భ్రమించినారే కానీ ఆదిమధ్యాంతరహితుడైన పరబ్రహ్మ అని తెలుసుకోలేక పోయారు. ఆతని అల్లరి పనులు నిజమేనని నమ్మారు. చిన్నికృష్ణుని దుండగాలు సహించలేని ఒక గోపిక యశోదతో ఇలా మొఱబెట్టుకున్నది
మీ పాపఁడు మా గృహముల
నా పోవఁగ బాలు ద్రావ నగపడ కున్నం
గోపించి పిన్నపడుచుల
వాపోవఁగఁ జిమ్ముకొనుచు వచ్చెం దల్లీ!
ఓ తల్లీ! యశోదా! మీ పిల్లవాడు మా గృహములోకి వచ్చి తనకు తృప్తిదీరా త్రాగుటకు సరిపోవు పాలు లేవని కోపించినాడు. పసిబిడ్డలని కూడా చూడకుండా కోపముతో వారిని పడదోసుకుంటూ బయటికి వచ్చేశాడు. వాళ్ళు పాపం గుక్కపట్టి ఏడ్చారు. అమ్మా! నీవూ ఒక తల్లివే కదా? మా బాధను అర్థంచేసుకోలేవా?”.
పిల్లలూ! మరి జగద్గురువైన శ్రీ కృష్ణుడు ఈ కథ ద్వారా ఏమి బోధించాలనుకున్నాడో తెలుసుకుందామా?
గృహస్థధర్మాలలో అతి ముఖ్యమైన అంశం గురించి శ్రీకృష్ణ గురువర్యుడు మనకీ కథలో బోధించినాడు. గృహస్థులు తమ పిల్లలను సంసారమును పోషించుకొనుటే కాక ఇంటికి వచ్చిన వారిని ముఖ్యముగా పిల్లలను వృద్ధులను అతిథులను అర్థులను సంతృప్తి పఱచవలెను. అట్లుచేయకుండిన వంశక్షయము కలుగునని శ్రీకృష్ణ గురుదేవుని సందేశము. చిన్న పిల్లవాడైన తనకు కావలిసినవి పాలు. ఆ ఇంటి యజమాని తన పిల్లలకు పాలు ఉన్నాయో లేవో చూచుకున్నాడు కానీ తన ఇంటికి ఆడుకొనుటకు వచ్చే భగవత్స్వరూపులైన బాలకులకు పాలు ఉన్నాయోలేవో చూసుకొనలేదు. అందుకనే కన్నయ్య వారినారీతిలో శిక్షించి కాపాడినాడు.
ఈ కారణముగనే మన పెద్దలు ముఖ్య అవసర వస్తువులైన ధాన్యం పసుపు-కుంకుమ పాలు-పెరుగులు ఎప్పుడూ ఇంట్లో లేకుండా ఉండకూడదని అంటారు. ఒకవేళ అవి లేకపోతేనిండుకున్నాయిఅని అంటారే తప్ప లేవుఅని అనరు. అట్టి వస్తువులను త్వరగా సంపాదించి తమ అవసరాలకోసమే కాక ఇంటికి వచ్చిన అర్థులకోసం కూడా ఉంచుకోవాలన్నదే వారి తాత్పర్యం. పూర్వం ఏ మాదాకబళం వాడు వస్తాడో ఏమో అని కొంచం అన్నం మిగిల్చేవారు. ఎప్పుడూ తినే పదార్థాలను పూర్తిగా వినియోగించుకునేవారు కాదు. అట్లా చేయుట వలన అనుకోకుండా వచ్చే అర్థులను కూడా తృప్తి పఱచవచ్చని వారి ఆలోచన. కాబట్టి మనమెన్నడూ అత్యవసర పదార్థాలను అర్థులకోసం దాచి ఉంచుకోవాలని జగద్గురువైన శ్రీకృష్ణుని సందేశం.



కృష్ణం వన్దే జగద్గురుమ్ – 4



రీమద్భాగవతములోని కథ



చిన్నికృష్ణుడు గోపబాలురతో కలిసి ఎన్నో విచిత్రమైన ఆటలు ఆడేవాడు.మీరందఱూ గోవులు నేను ఆబోతునుఅంటూ ఆబోతులాగా రంకెలు వేస్తూ పరుగులెట్టేవాడు. నేను రాజును మీరు భటులుఅంటూ అధికారం చూపుతూ వారికెన్నో పనులు చెప్పి చేయిస్తూ ఉండేవాడు. మూలమూలలా దాక్కొని దాగుడుమూతలాడే వాడు. అందఱితో కలిసి ఉయ్యాలాటలు, చేబంతులాటలు ఆడేవాడు. ఆహా! కఠోర నిష్ఠాపరులైన సంయమీద్రులకు సైతం అందని పరంధాముడు గోపబాలురతో కలిసి ఆటలాడుటకు వారెంత పుణ్యము చేసినారో!
ఒకరోజు కన్నయ్య ఆటకని బయలుదేరాడు. ఒకానొక గోపిక ఇంటిలోనికి వెళ్ళాడు. ఆ ఇంటి కోడలు నిద్రపోతూ ఉన్నది. బాలకృష్ణుడు వాళ్ళ ఇంట్లో ఉన్న పెరుగంతా త్రాగివేశాడు. వెళ్ళేవాడు వెళ్ళకుండా నిద్రిస్తున్న ఆ కోడలి మూతికి కొంచెం పెరుగు వ్రాసి వెళ్ళిపోయాడు. పెరుగంతా తానే తినివేసిందని భ్రమసి అత్తగారు కోడలిని కొట్టింది. ఆ అల్లరిపని లోని ఆంతర్యం గ్రహించలేక యశోదతో శ్రీకృష్ణుని గురించి ఇలా చెప్పుకుంది ఓ గొపిక
ఆడం జని వీరల పెరుఁ
గోడక నీ సుతుఁడు ద్రావి యొకయించుక తాఁ
గోడలి మూఁతిం జరిమినఁ
గోడలు మ్రుచ్చనుచు నత్త గొట్టె లతాంగీ!
పిల్లలూ! మరి జగద్గురువైన శ్రీ కృష్ణుడు ఈ కథ ద్వారా ఏమి బోధించాలనుకున్నాడో తెలుసుకుందామా?
ఈ సన్నివేశము జరిగిన సమయం రాత్రి కాదు. పైగా అది శ్రీకృష్ణుడు ఆటకై బయలుదేరిన సమయం కాబట్టి మనుషులు బాగా మేల్కొని ఉండి శ్రమించి తమ కర్తవ్యాలు నిర్వహించ వలసిన సమయం. అట్టి ఉపయోగకరమైన వేళలో ఆ ఇంటి కోడలు నిద్రించుట కృష్ణపరమాత్మకు నచ్చలేదు. అందుకనే ఆ విధంగా కోడలిని శిక్షించినాడు. ప్రకృతి నియమానుసరముగా లభ్యమైన సమయమును వృధా చేయకుండా నిరంతరం సత్కర్మలను చేయాలన్నదే జగద్గురువైన శ్రీకృష్ణుని సందేశం.



కృష్ణం వన్దే జగద్గురుమ్ – 5



శ్రీమద్భాగవతములోని కథ



శ్రీకృష్ణుడు గోపబాలురతో కలిసి వింతవింత ఆటలాడి చూసే వారికి కన్నులపండుగ చేసెడివాడు. కన్నయ్య దేహానికి అంటిన దుమ్ము భూతిభూషణుడు ప్రీతితో అలంకరించుకొను విభూతి వలె కనిపించెడిది. ఉంగరాలజుట్టు పై యశోద అలంకరించిన ముత్యాలమాల ఇందుశేఖరుడు తలదాల్చిన చంద్రుని పోలి ఉండెడిది. నుడుటి మీది ఎఱ్ఱని కస్తూరి తిలకం కామారి మూడవ నేత్రమా?” అన్నట్లు ఉండెడిది. రత్నాలహారం లోని నీలమణి గరళకంఠుని కృపావృష్టికి నిదర్శనమైన హాలాహలపు మచ్చవలె శోభిల్లెడిది. మెడలోని ముత్యాలహారాలు నాగభూషణుని అలంకరించు సర్పహారాల వలెనుండెడివి. సామవేదసారుడైన కృష్ణస్వామి వేణువు ఖట్వాంగుని దణ్డమును పోలి ఉండెడిది. ఇలా శివుడూ నేనూ ఒకటేసుమా!అని హెచ్చరిస్తున్నాడా? అన్నట్టు కనిపించేవాడు బాలకృష్ణుడు.
ఒకనాడు శ్రీకృష్ణుడు ఆటలమధ్యలో ఒక గోపిక ఇంటిలోకి జొరపడి కడవలలోని నేతినంతా త్రాగివేశాడు! అంతేకాక ఖాళీ కడవలను తీసుకువచ్చి ప్రక్క ఇంటిలో పడవేసి వెళ్ళిపోయాడు. తరువాత ఆ ఇంటివారికీ ఈ ఇంటివారికీ పెద్దపోట్లాట జరిగింది. ఈ అల్లరి వివరిస్తూ గోపిక యశోదతో ఇలా అన్నది:
వా రిల్లు సొచ్చి కడవలఁ
దోరంబగు నెయ్యి ద్రావి తుది నా కడవల్
వీరింట నీ సుతుం డిడ
వారికి వీరికిని దొడ్డవా దయ్యె సతీ!
పిల్లలూ! మరి జగద్గురువైన శ్రీ కృష్ణుడు ఈ కథ ద్వారా ఏమి బోధించాలనుకున్నాడో తెలుసుకుందామా?
నెయ్యి జ్ఞానానికి సంకేతము. జ్ఞానాన్ని వస్తు రూపములో భద్రపఱచిన (కడవలలో నెయ్యి ఉంచిన) గోపిక నిజానికి జ్ఞానమును ఆర్జించుకోలేదు. దీనికి నిదర్శనం నిజానిజాలు తెలుసుకోకుండా ప్రక్క ఇంటివారితో పోట్లాడడమే. కృష్ణస్వామి నేతిని త్రాగివేసి జ్ఞానమునెన్నడు స్వార్థముతో దాచుకోరాదు (దాచుకోలేరు) అని చూపించినాడు. అంతే కాక ఆర్జించిన జ్ఞానమును ఇతరులకు పంచాలని చూపించడానికి కడవలను ప్రక్క ఇంటిలో పడవేశాడు. ఐతే జ్ఞానము స్వానుభవైకవేద్యమైనది కావున జ్ఞానమును పదార్థ రూపములో (నేతి రూపములో) పంచలేము. జ్ఞానబోధకు ఏకైకమార్గం జ్ఞానార్జన పై జిజ్ఞాస కలిగించడం. అందుకనే శుద్ధజ్ఞాన పరాత్పరుడైన శ్రీకృష్ణుడు కమ్మని నేతివాసనలు వచ్చే ఖాళీ కడవలను ప్రక్క ఇంటిలో పడవేశాడు.
కాబట్టి జగద్గురువైన శ్రీ కృష్ణుడు ఈ కథ ద్వారా మనకు జ్ఞానమెన్నడూ స్వార్థబుద్ధితో దాచుకోరాదని, దానిపై జిజ్ఞాస కలిగే రీతిలో అందఱికీ అందించాలని బోధించినాడు. అంతేకాక జ్ఞానమును సంపూర్ణముగా ఆస్వాదించి గురుత్వమును పొందిన తరువాతనే ఇతరులకు బోధించాలి అని శ్రీ కృష్ణ పరమాత్మ ఈ కథ ద్వారా చూపినాడు. అందుకనే నెయ్యి మొత్తం త్రాగివేసి (గురుత్వమును సంపాదించిన) తరువాతనే ప్రక్క ఇంటిలో కడవలను పడవేసి జ్ఞానబోధ చేసినాడు.






దిలీప మహారాజు కథ


(శ్రీకాళిదాసకృత రఘువంశం లోని కథ)

 


రఘువంశపు రాజైన దిలీపునికి చాలా కాలం వరకూ సంతానం కలుగలేదు. తన అర్థాంగి అయిన సుదక్షిణాదేవితో సహా సద్గురు దర్శనం కోసం వసిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. తనకుగల చింతను వ్యక్తపఱచాడు. ఒక్క నిమిషము ధ్యానముచేసి వసిష్ఠుల వారు ఇలా అన్నారు నాయనా! నీవు ఒకసారి దేవేంద్రలోకం వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు కల్పవృక్ష ఛాయలో ఉన్న కామధేనువును గమనించలేదు. గోవు కనబడగానే నమస్కరించి ప్రదక్షిణము చేయాలి. ఇక కామధేనువు మాట వేరే చెప్పాలా? సర్వధర్మాలు తెలిసిన నీవు అప్పుడు ఋతుస్నాత అయిన నీ భార్య దగ్గర ఉండాలన్న ధర్మము పాటించే తొందరలో వేగముగా నీ మందిరము చేరదామని వస్తున్నావు. ఆ కారణముగా నీవు ఆ కామధేనువును గమనించకే వచ్చేశావు. నీచే పూజ్యపూజావ్యతిక్రమము జరిగినది. పూజ్యులను గుర్తింపక పోవుట శ్రేయస్సుకు భంగకరము కదా!
అప్పుడు కామధేనువు రాజా! నన్ను పూజించకనే తొందరలో ఉండి వెళ్ళిపోతున్నావు. నా సంతానామును సేవించిన కానీ నీకు సంతానం కలుగదుఅని చెప్పినది. కానీ రథవేగము వలని వాయుధ్వని కారణముగా నీకుగానీ నీ సారథికిగానీ ఆ కామధేనువు చెప్పిన మాటలు వినబడలేదు. నాయనా! తెలిసిచేసినా తెలియకచేసినా కర్మఫలం అనుభవించక తప్పదు. చేసిన తప్పును సరిదిద్దుకుని ప్రగితిపథంలో నడిచేవాడు ఉత్తముడు. కావున నీవు గోసేవ చేసి శ్రేయస్సును పొందు. వరుణుని యజ్ఞములో పాలు నేయి ధనధాన్యాలు సమకూర్చుటకై కామధేనువు పాతాళలోకానికి వెళ్ళినది. ఆ గోమాత తరిగి వచ్చేంత వరకూ ఆమె సంతానమైన ఈ నందినీధేనువును సేవించి తరించు”.
ఇలా వసిష్ఠులవారు హితవు చెప్తుండగానే ఆ నందినీధేనువు రానేవచ్చింది. దిలీపుడు పరమసాధ్వి అయిన సుదక్షిణాదేవీ ఆ నందినీధేనువును సేవించుట ప్రారంభించారు. ఆ రాజదంపతులు నందినీధేనువును నీడలాగా అనుసరించి సేవించారు. ఆ ధేనువు నిలిచిన నిలిచి కూర్చున్న కూర్చుని నీళ్ళు త్రాగిన త్రాగి ఆ నందినీధేనువును ఆరాధించారు. ఇలా 21 దివసములు ఆ రాజదంపతులు ధేనువ్రతమును పరమభక్తితో చేశారు. వారి సేవకు సంతోషించిన నందినీధేనువు వారి భక్తిని పరీక్షిద్దామని హిమాలయములో ఒక గంభీర బిలంలోకి ప్రవేశించింది. త్రుటిలో ఒక సింహం ఆ హోమధేనువు మీద పడబోయింది. వెంటనే రాజు ఆ ధేనువును కాపాడటానికి ధనుర్బాణాలు తీయబోయాడు. కానీ ఆశ్చర్యం! చిత్రపటంలో వీరునిలాగా ఉండిపోయాడు. ఆ సింహము మాయ వలన స్థాణువుగా ఉండిపోయాడు. ప్రగల్భముగా అప్పుడు సింహమన్నదిరాజా! గిరిజాపతి ఆజ్ఞపొంది నేనీ పరిసరాలలో విహరిస్తున్నాను. శివ కింకరుడను. నా మీద నీ శక్తులేమీ పనిచేయవు. నేను మామూలు సింహాన్ని కాను. ప్రతిదినము పరమేశ్వరుడు నందిని ఆరోహించేటప్పుడు నన్ను పాదపీఠికగా నియోగించి అనుగ్రహిస్తాడు. నేను నికుంభ మిత్రుడనైన కుంభోదరుడను. పార్వతీదేవికి పుత్రప్రాయమైన ఈ దేవదారు వృక్షాన్ని కాపాడటానికి పరమశివుడు నన్నిక్కడ నియంమించాడు. ఈ ప్రాంతాలకి వచ్చే ఏ మృగాన్నైనా భక్షించే అధికారం నాకు ఉన్నది”.
నా పరాక్రమం బాహుబలం వృథా అవుతున్నవే! ఈ నందినీ ధేనువును కాపాడలేక పోతున్నానేఅని అనుకుంటున్న రాజు నేను కుంభోదరుడను. శివ కింకరుడనుఅన్న మాటలు వినగానే కొంచెం కుదుటపడ్డాడు. భగవత్ శక్తి ముందు మానవశక్తి అత్యల్పమే కదా!అని అనుకున్నాడు. ఆ కుంభోదరునితో ఇలా అన్నాడు ఓ దివ్య సింహమా! సృష్టి స్థితి లయ కారకుడైన ఆ పరమేశ్వరుడు నీకువలె నాకుకూడా పరమ పూజ్యుడు. కానీ హోమధేనువైన ఈ నందినిని కాపాడటము ధర్మమే కదా! మన ఇద్దరికీ శ్రేయోదాయకమైనది చెప్తాను. నా ఈ శరీరాన్ని ఆహారముగా స్వీకరించి నా గురుధనమైన ఈ నందినీధేనువును వడిచిపెట్టు”.
ఇది వినగానే కుంభోదరుడు నవ్వి ఓ రాజా! నీవు చాలా మూఢుని వలెనున్నావు. నీవు ఈ భూమండలానికి ఏకఛత్రాధిపతివి. యవ్వనములో ఉన్న మన్మథాకారుడవు. ఒక్క గోవు కోసం అన్నీ వదులుకుంటావా? అల్పకారణానికి అధికమూల్యం ఎందుకు చెల్లిస్తావు? ఈ ఆవు కాకపోతే ఇలాంటివి కోటి మీ గురువు గారికి ఇవ్వచ్చు. నీ పాలనలో సుఖంగా ఉండే కోట్లాది ప్రజలను అనాథలను చేసి ఈ గోవు కోసం శరీర త్యాగముచేస్తావా? నీకు ఎట్టి అపకీర్తి రాదు. గురుద్రోహం అంటదుఅని అన్నాడు దిలీపుని ప్రలోభపెడదామని. అది విని ధర్మాత్ముడైన దిలీపుడు క్షతము (ఆపద) నుండి రక్షించేవాడే క్షత్రియుడు. అట్లు చేయనివాడు రాజు ఎట్లా అవుతాడు? అదీ కాక ఎదుఱుగా హింస జరుతున్నా కాపాడకుండా చూస్తూన్న ప్రాణాలు ఎందుకు? ఓ శివ కింకరుడా! నీవు దేవతామూర్తివి. నా శరీరము స్వీకరించి ఈ ధేనువును విడిచి నా ప్రార్థన మన్నించుఅని అన్నాడు.
ఎట్లాగో చివరికి ఒప్పుకున్నది సింహం. స్థాణువుగా ఉన్న రాజు మామూలుగా కదలగడిగాడు. తనును తాను సింహానికి అర్పిద్దామని మోకాళ్ళ పై కూర్చుని తలవంచుకుని సింహం వేటుకై ఎదుఱు చూస్తున్న దిలీపుడి మీద పుష్పవృష్టి కురిసింది! నందినీధేనువు దివ్యాకృతి దాల్చి రాజా! వసిష్ఠ మహర్షి తపశ్శక్తి వలన నన్ను ఈ సింహమే కాదు విశ్వంలో ఏ శక్తీ హానికలిగించలేదు. నిన్ను పరీక్షిద్దామనే ఇలా చేశాను. నీ భక్తితో నన్ను మెప్పించావు. దివ్యమైన నా క్షీరము స్వీకరించు. సంతానవంతుడివి అవుతావుఅని అన్నది నందినీధేనువు.
అప్పుడు ధర్మజ్ఞుడైన దిలీపుడిలా అన్నాడు తల్లీ! నీ కరుణ అమోఘం. నన్ను నా అర్థాంగిని ధన్యుల్ని చేశావు. లేగ దూడ నీ పాలకై ఎదుఱు చూస్తుంది. మహర్షులు యజ్ఞార్థము నీ క్షీరమునకై నిరీక్షిస్తూ ఉంటారు. వారు తీసుకున్న తరువాత మిగిలిన దానిలో ఆఱోవంతు తీసుకుంటాను (ధర్మాత్ముడైన రాజు ప్రజలనుండి 1/6 మాత్రమే కప్పముగా తీసుకుంటాడు)”. “తథేతిఅని ఆశీర్వదించింది నందినీ. ధేనువ్రత మహిమ వలన రఘు మహారాజును పుత్రునిగా పొందినాడు దిలీపుడు.

పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దామ్:
1.    పూజ్యులను ఎల్లవేళలా యథావిధిగా పూజించాలి. తొందరలో ఉండి కామధేనువును గమనించకుండా వెళ్ళిపోవుట వలనే దిలీపునికి శ్రేయస్సు ఆగిపోయింది. కావున పెద్దలను సాధు సజ్జనులను గోవులను ఎల్లప్పుడూ గౌరవించడం మన విధి.
2.    ఆపదలో ఉన్న గోమాతను కాపాడటానికి తన ప్రాణాలను సైంత ఇద్దామనుకున్న దిలీపుడు ఉత్తముడు. అతని గురుభక్తి ధేనువ్రత దీక్ష అసామాన్యాలు.
3.    దూడ త్రాగిన తరువాత మహర్షులు తీసుకున్న తరువాత పాలుతీసుకుంటానుఅని అన్నప్పుడు దిలీపుని మహోన్నత వ్యక్తిత్వం మనకు తెలిసినది. 1/6 మాత్రమే తీసుకుంటాను అన్నప్పుడు ఆ రాజు యొక్క ధర్మబుద్ధి మనకు అవగతమైనది. ఇట్టి ధర్మాత్ములే మనకు ఆదర్శపురుషులు.






Om Tat Sat
                                                        
(Continued...) 

 
(My humble greatfulness to Neethi Kathalu  dot com and  Hindu dot com for the collection) 



(మన భారతీయ సంస్కృతికి సవినయ నివాళి )

About Me

My Photo
gopalakrishna
View my complete profile

Visitors

free counters

Visitors

free counters
Powered by Blogger.

Visitors

Labels